West Godavari
-
కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ మునిసిపల్ కార్మికులు తాడేపల్లిగూడెంలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అప్కాస్ రద్దు చేస్తారన్న వార్తల నేపథ్యంలో పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అప్కాస్ రద్దు చేసే ముందు కార్మిక సంఘాలతో చర్చించాలని, సిబ్బంది సంఖ్యను, వాహనాల సంఖ్యను పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం అందజేయాలని నినాదాలు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్, ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్, నాయకులు తాడికొండ శ్రీనివాస్, అల్లం కుమార్స్వామి, కార్మికులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలి
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ కమర్షియల్ ట్రాఫిక్ మేనేజర్ జి.లక్ష్మీప్రసన్న సుబ్బారావు అన్నారు. బుధవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా రూ.187 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్లో మొదటి స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్గో లాజిస్టిక్స్ ద్వారా రూ.91 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 22 రీజియన్లలో పశ్చిమగోదావరి జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోనూ పరిసర ప్రాంతాలలోనూ ఆథరైజ్డ్ ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ సెంటర్కు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. రూ.1000 రూపాయలతో ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ కౌంటర్ను ఇవ్వనున్నట్లు తెలిపారు. -
లంచావతార ఉద్యోగి తొలగింపు?
నిడమర్రు: ‘అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు’ అంటూ సాక్షిలో ఈనెల 14న వచ్చిన కథనంపై జిల్లా ఫారెస్టు అధికారులు స్పందించారు. లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నబిగారి శ్రీనివాసబాబును విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. శ్రీనివాసబాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారించిన ఏలూరు రేంజ్ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మి రైతులను విచారించారు. అనంతరం నివేదికను జిల్లా ఫారెస్టు అధికారికి సమర్పించారు. నివేదికలోని అంశాలు బహిర్గతం కాకపోయినప్పటికీ అనధికారికంగా అందిన సమాచారం మేరకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న శ్రీనివాసబాబును విధులనుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. -
గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
భీమవరం(ప్రకాశం చౌక్): బిడ్డకి జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదని, వారి ఆరోగ్య అవసరాలపై సీ్త్ర శిశు సంక్షేమం, వైద్య శాఖల నిరంతర పర్యవేక్షణ ఎంతైనా అవసరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో కలెక్టర్ వైద్య, ఆరోగ్యశాఖ సీ్త్ర శిశు, సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ సీ్త్రల నమోదు, టీకాలు వేయించడం, పోషకాహార లోపంతో ఎంతమంది పిల్లల ఉన్నారో గుర్తించడం, ఏ లోపాలు ఉన్నాయో పరీక్షలు నిర్వహించడం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందితో ఇప్పటికే నాలుగు పర్యాయాలు సమీక్షించామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలు కాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాల నియంత్రణ లక్ష్యంగా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి డా.బి.భానునాయక్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, డీఐఓ డా.డి.దేవసుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్యం పేరుతో పేదలపై కుట్ర
భీమవరం: అభివృద్ధి ముసుగులో ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు పేదల ఇళ్లను తొలగించే బుల్డోజర్ రాజకీయాలను తక్షణం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాలుష్యమంటూ ఎన్నో ఏళ్లుగా కాలువలు, పంట బోదుల పక్కన నివసిస్తున్న పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణమన్నారు. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలం ఐ.భీమవరం నుంచి పాలకోడేరు మండలం ఏఎస్ఆర్ నగర్ వరకు కాలుష్యం పేరుతో పేదల ఇళ్ళను కూల్చివేసి పేదలకు నిలువ నీడలేకుండా చేస్తున్నారని గోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం చేసే పనులను సమర్ధిస్తామని అయితే అభివృద్ధి పేరుతో పేదలను రోడ్లపాలు చేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో భూస్వాముల పక్కనే పేదల ఇళ్లు ఉండడమే తొలగింపునకు అసలు కారణమన్నారు. ప్రభుత్వ పోరంబోకు భూములను భూస్వాములు, పెత్తందారులకు కట్టబెట్టడానికే పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనకు విరుద్ధంగా నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న ఉప్పునీటి బోర్లు రఘురామ కృష్ణంరాజుకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, సేశపు ఆశ్రియ్య పాల్గొన్నారు. -
వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం నిషేధించాలని, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల రాకను వ్యతిరేకించాలని, ఢిల్లీ యూనివర్శిటీలో సస్పెన్షన్కు గురైన 17 మంది విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం పట్టణంలోని నన్నయ యూనివర్శిటీ సబ్ సెంటర్ వద్ద విద్యార్ధులతో కలిసి ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అప్పలస్వామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, విశ్వ విద్యాలయాలలో వీసీ నియామకాలలో రాష్ట్ర హక్కులను కాలరాసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు చట్టాలను సవరిస్తున్నారని ధ్వజమెత్తారు. విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బి.సౌజన్య, డి.దేవి, ఎం.మానస, జ్ఞానేంద్ర, ఎ.ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా సర్టిఫికెట్ కోర్సు పరీక్ష
భీమవరం: భీమవరంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్) పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎస్సీహెచ్బీఆర్ఎమ్ స్కూలు పరీక్షా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 70 మందికి 52 మంది, హయ్యర్ పరీక్షకు 29 మందికి 24 మంది హాజరయ్యారు. టైలరింగ్, ఎంబ్రాడయిరీ లోయర్ పరీక్షకు 29 మందికి 21 మంది, హయ్యర్ పరీక్షకు 12 మందికి 10 మంది హాజరయ్యారు. భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో మాట్లాడుతూ కలెక్టరేట్ తరలిపోతుందనేది కేవలం అపోహమాత్రమేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం మంజూరు చేసిన ప్రత్యేక ప్యాకేజీ రూ.11,400 కోట్లు అమలు చేసేందుకు విధి విధానాలు వేగవంతం చేశామని, స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్లో సమస్యలు పరిష్కరించి 7.3 మిలియన్ల స్టీల్ ఉత్పత్తి లక్ష్యం చేరుకుంటామన్నారు. స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు చేస్తున్నామని ఇంతవరకు 1, 613 మంది వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా 1,141 మంది అర్హులుగా గుర్తించారన్నారు. మార్చి 31 నాటికి వీఆర్ఎస్ స్కీం అమలు పూర్తి చేయాలని నిర్ణయించగా తొలి విడతగా దరఖాస్తు చేసుకున్న 150 మందికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబోతునట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఛత్రపతి శివాజీకి నివాళులు భీమవరం: భీమవరం పట్టణంలో మరాఠీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. శివాజీ దేశానికే ఆదర్శమైన మహారాజని, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలన దక్షత సువర్ణాధ్యాయంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్, శ్రీవిద్య, అల్లు శ్రీనివాస్, మటపర్తి మురళీకృష్ణ, ఇళ్ల హరికృష్ణ, వనమా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 21లోగా ఎమ్మెల్సీ ఓటరు స్లిప్పుల పంపిణీ ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 21లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారని, మిగిలిన వాటిని ఈ నెల 21లోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో భూముల రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం విజయవాడ నుంచి భూముల రీసర్వేపై సీసీఎల్ఏ జి.జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ మాట్లాడుతూ రీసర్వేపై ప్రత్యేక శ్రద్ధ వహించి నివేదికలు పంపాలన్నారు. రీసర్వే రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన అంశమని.. ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించరాదన్నారు. అనంతరం కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన పౌర సేవలు సంతృప్తి స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలన్నారు. రీ సర్వే వేగవంతంగా, నిర్వహించి నివేదికలు సమర్పించాలని అన్నారు. -
అర్జీల పరిష్కారంలో అలక్ష్యం
ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజాసమస్యల పరిష్కార వేదిక అంటూ కూటమి సర్కారు పేరు మార్చిందే తప్ప సమస్యలను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. వేలాది ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా కాలం గడుపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతీ సోమవారం సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులందరూ అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసి సంబంధిత శాఖలకు వచ్చిన ఫిర్యాదులను బదిలీ చేస్తున్నారు. అయితే వందలాది ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వచ్చిన ఫిర్యాదులే పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఫిర్యాదిదారులు మళ్లీ మళ్లీ జిల్లా కేంద్రానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. సీఎం డాష్ బోర్డులో సైతం స్పష్టంగా ఫిర్యాదులు కనిపిస్తున్నప్పటికీ జిల్లాల సమాచారం ఎప్పటికప్పుడు నమోదవుతున్నా.. ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏలూరు జిల్లాలో 35 శాతం ఫిర్యాదులు పెండింగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1845 ఫిర్యాదులు రాగా, 712 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయి. 1125 ఫిర్యాదులను పరిష్కరించినట్లు సీఎం డాష్బోర్డులో అంకెలు స్పష్టం చేస్తున్నాయి. 8 ఫిర్యాదులు రీ ఓపెన్లో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1149 ఫిర్యాదులు రాగా, 335 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉండగా, 805 ఫిర్యాదులు పరిష్కరించారు. 9 ఫిర్యాదులను రీ ఓపెన్ చేశారు. ఏలూరు జిల్లాతో పోల్చుకుంటే పశ్చిమగోదావరి జిల్లా ఫిర్యాదుల పరిష్కారంలో ముందు వరుసలోనే ఉంది. సుమారు 70 శాతం పైగా ఫిర్యాదులను పరిష్కరించగా, ఏలూరు జిల్లాలో 65 శాతం ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకున్నాయి. మిగిలిన సమస్యలు పరిష్కరించడంలో అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాలకు పేర్లు మార్చడంలో చూపించిన శ్రద్ధ ఫిర్యాదులను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా భూ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, పెన్షన్ సమస్యలు అధికంగా వస్తున్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. గత ప్రభుత్వంలో సచివాలయాల్లోనే పరిష్కారం గతంలో ప్రతీ వారం స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై నివేదికలు ప్రభుత్వం పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణం ఆదేశాలు జారీ చేసేది. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ఫిర్యాదులు పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి సచివాలయాల పరిధిలోనే చర్యలు తీసుకునేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా సమస్యలు కనిపిస్తున్నప్పటికీ ప్రజా ఫిర్యాదులపై మాత్రం స్పందన అరకొరగా ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగానికి పైగా ఫిర్యాదులు పెండింగ్లో ఫిర్యాదులపై పర్యవేక్షణ కరువు ఏలూరు కంటే మెరుగ్గా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,845కు 712 ఫిర్యాదులు పెండింగ్ -
పగలు భగభగ.. రాత్రి గజగజ
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాక్షి, భీమవరం: వాతావరణ మార్పులు జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు ఎండ మండిపోతుంటే, రాత్రిళ్లు చలి వణికిస్తోంది. మంచు ప్రభావంతో వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. గొంతు నొప్పి, జలుబు తదితర లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మహా శివరాత్రి తర్వాత నుంచి చలి తీవ్రత తగ్గి ఎండల తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. మునుపెన్నడూ లేని విధంగా ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండ తీవ్రత పెరిగింది. వేసవిని తలపిస్తూ సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. కొద్ది రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతీవ్రతకు ఉక్కపోత తోడై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్న 11 గంటల నుంచి రోడ్డుపై తిరగాలంటే భయమేస్తోంది. జిల్లాలోని వినియోగదారులతో రద్దీగా ఉండే భీమవరంలోని జువ్వలపాలెం, సండే మార్కెట్ రోడ్లు, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూరు రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్, తాలుకా ఆఫీస్ రోడ్డు మధ్యాహ్నం అయ్యే సరికి జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. గతంలో లేని విధంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్రత ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పగటి పరిస్థితి ఇలా ఉంటే.. చీకటిపడే సరికి వాతావరణం మారిపోతోంది. పొగమంచు కమ్మేసి చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 18 డిగ్రీలకు తగ్గిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల సమయం వరకు కూడా మంచు ప్రభావం ఉంటుండంతో పగటిపూట వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పొంచిఉన్న వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో వైరల్ ఇన్ఫెక్షన్లు విజృంభించే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జలుబు, దగ్గు, గొంతునొప్పి, తదితర లక్షణాలతో బాదపడుతున్నారు. ఆయా లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రోజువారి ఓపీలో సీజనల్ వ్యాధులతో వచ్చే రోగులు ఎక్కువగానే ఉంటున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ప్రస్తుతం వ్యాధుల తీవ్రత లేకున్నా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్నాం. నిల్వ ఆహారం తీసుకోకూడదు. ప్రయాణించేటప్పుడు ఎండ, మంచు నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – భానునాయక్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి న్యూస్రీల్ వాతావరణ మార్పులతో ప్రజలు బెంబేలు వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు పట్టణం గరిష్టం కనిష్టం భీమవరం 36 20 తణుకు 36 21 తాడేపల్లిగూడెం 37 20 పాలకొల్లు 33 19 నరసాపురం 38 20 ఈ జాగ్రత్తలు పాటించాలి మంచులో ఎక్కువగా తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వస్తే మంచు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కూలింగ్ వాటర్ తాగకూడదు. బాగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే భుజించాలి. నిల్వ ఉన్న ఆహారం తీసుకోకూడదు. గొంతునొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. డ్రైనేజీల సమీపంలో నివసించే వారు దోమల బెడద లేకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలి. -
లెక్కల మాస్టారుపై డీఈఓ విచారణ
ద్వారకాతిరుమల: స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు గతేడాది నవంబర్లో విద్యార్థులను చితకబాదిన ఘటనపై డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ బుధవారం విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో ఒకటవ తరగతి చదివే గుండె త్రివిక్రమ్, నాల్గో తరగతి చదివే గుండె సహస్రలను గతేడాది నవంబర్ 25న లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు అకారణంగా చితకబాదిన ఘటనపై తల్లిదండ్రులు అప్పట్లో కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా జరిగిన విచారణలో విద్యార్థులను ముత్యాలరావు కొట్టాడని ఎంఈఓ నివేదికలో పేర్కొన్నా ఆయనపై డీఈఓ చర్యలు తీసుకోకుండా, బదిలీ చేయడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ, చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ అధికారి సూర్యచక్ర వేణి బుధవారం పాఠశాలలో విచారణ జరిపి గుండె ధర్మరాజు, గుండె మాణిక్యాల నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అలాగే ఎంఈఓ–1 డి.సుబ్బారావు, ఎంఈఓ–2 పి.వెంకట్రావుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం డీఈఓ మద్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, విద్యార్ధులతో కలసి భోజనం చేశారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి ఉపాధ్యాయుడు ముత్యాలరావును కాపాడుతూ వస్తున్న డీఈఓతో విచారణ జరిపిస్తే బాదితులకు ఏం న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు. దీనిపై ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు. -
బలివేలో ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ముసునూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం బలివేలోని శ్రీరామ లింగేశ్వరాలయం. పూర్వపు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ, ప్రాచీన తూర్పు వేంగీ చాళుక్యుల రాజధాని వేంగీ పురం(నేటి పెదవేగి)కి అతి సమీపాన కృష్ణా జిల్లా, ముసునూరు మండలం బలివేలో తమ్మిలేరు ఒడ్డునే ఈ ఆలయం ఉంది. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించేందుకు ఏటా రెండు లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా నూజివీడు సబ్కలెక్టర్ స్మరణ్రాజ్ ప్రత్యేకాధికారిగా, తహసీల్దార్ కె.రాజ్కుమార్ నోడల్ అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో తమ్మిలేరుపై ప్రారంభమైన చెక్డ్యామ్ కమ్ హైలెవెల్ బ్రిడ్జి, స్నానఘట్టాల నిర్మాణం పూర్తి కావడంతో విశాల ప్రాంగణంగా రూపుదిద్దుకుని భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాల ఏర్పాట్లు ప్రారంభించగా, తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని కూడా విడుదల చేశారు. ఇప్పటికే మిఠాయిల దుకాణాలు, వినోద సౌకర్యాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. బలివే చేరాలంటే బస్సురూట్లు ఇలా రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామ లింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా మొత్తం నాలుగు భాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడుపుతున్నారు. ● నూజివీడు నుంచి బలివే ఉత్సవ ప్రాంగణం వరకు ● ఏలూరు నుంచి వేల్పుచర్ల మీదుగా ● ఏలూరు నుంచి విజయరాయి మీదుగా ● సత్తుపల్లి, చింతలపూడిల నుంచి బలివే వరకు. -
వ్యసనాలకు బానిసై చోరీలు
భీమవరం: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని భీమవరం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం టూటౌన్పోలీసు స్టేషన్లో డీఎస్పీ ఆర్జీ జయసూర్య వివరాలు వెల్లడించారు. రాయలం గ్రామ పరిధిలో అడ్డాల శ్రీనివాసరావు 2013 ఆగస్టు 16వ తేదీన రూ.10 లక్షలు మోటారుసైకిల్ డిక్కీలోపెట్టి ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు నగదును ఇద్దరు వ్యక్తులు అపహరించారు. దీనిపై టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సీఐ జి కాళీచరణ్, ఎస్సై ఇశ్రాయేల్, కానిస్టేబుళ్లు టి శరత్, ఎన్ గోపి, ఆర్ నరేంద్ర దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడైన నెల్లూరు జిల్లా భోగోలు మండలం కప్పరాలతిప్ప గ్రామానికి చెందిన పీట్ల మహేష్ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.3.50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జయసూర్య వివరించారు. నిందితుడు మహేష్ వ్యసనాలకు బానిసై నగదు కోసం దొంగతనాలు ప్రారంభించాడని, అతడిపై పలు జిల్లాల్లో 11 కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో ఒక సస్పెక్టివ్, రౌడీ షీట్ నెల్లూరు జిల్లా బిట్రగుంట పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు. రాయలం వద్ద జరిగిన చోరీ కేసులో మరో నిందితుడు బెంజిమెన్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ కె మానస, సీఐ కాళీచరణ్ పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్.. రూ.3.50 లక్షలు స్వాధీనం -
జీవితంపై విరక్తితో నిరుద్యోగి ఆత్మహత్య
ఉంగుటూరు: జీవితంపై విరక్తితో ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంసాలిపాలెంలో ఈనెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం యర్రమిల్లిపాడుకు చెందిన దాసరి సత్యనారాయణ, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కల్లుగీత వృత్తి చేసుకునే ఈ కుటుంబం కంసాలిగుంటలో నివసిస్తోంది. సత్యనారాయణ ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు పృధ్వీ చందు హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్నాడు. తక్కెళ్లపాదులోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం పృధ్వీ చందు హైదరాబాద్ నుంచి ఈనెల 11న వచ్చాడు. ఫంక్షన్ అనంతరం ఈనెల 17న ఒక కుమార్తెను గోపాలపురంలో అత్తారింటి వద్ద దింపేందుకు తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ వెళ్లారు. అదేరోజు మధ్యాహ్నం ఏమైందో గానీ పృధ్వీ చందు ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కగదిలో ఉన్న మరో సోదరి ఎంతసేపు తలుపుకొట్టినా చందు తీయకపోవడంతో చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు తీసీ చందుని భీమడోలులోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పృధ్వీ చందు మృతి చెందాడు. హైదరాబాదులో ఇంటర్న్షిప్ చేసే ఉద్యోగాన్ని వదిలేసి, మరొక కంపెనీకి ప్రయత్నం చేస్తుండగా రాకపోవడంతో విరక్తి చెంది పృధ్వీ చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పృధ్వీ చందు మృతితో ఆ కుటుంబం శోకసంద్రమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేయగా మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెయ్యేరు అలేఖ్య కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగోదావరిజిల్లా గొల్లప్రోలుకు చెందిన మమ్మిడివరపు రాంబాబు, సంతోషిణి(26) దంపతులు. వీరు ఉపాధి నిమిత్తం పెయ్యేరులో కొంతకాలంగా నివాసముంటున్నారు. రాంబాబు చేపల చెరువుపై గుమస్తాగా పనిచేస్తుంటాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు. బుధవారం ఉదయమే రాంబాబు విధుల నిమిత్తం బయటకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సంతోషిణి ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళాడుతుండడం పిల్లలు గమనించి కేకలు వేశారు. స్థానికులు వచ్చి పరిశీలించి ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ జేఎస్ సుభానీ, ఎస్సై వీరభద్రరరావు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సంతోషిణి బంధువు సింహాద్రి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంతోషిణి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
చిత్రకారుడు వెంపటాపునకు జాతీయ అవార్డులు
తణుకు అర్బన్: ఉత్తరప్రదేశ్ బరెల్లికి చెందిన కళారత్నం ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్లైన్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్, కాంపిటీషన్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళా పోటీ, ఎగ్జిబిషన్లో వివిధ దేశాల నుంచి వచ్చిన చిత్రకారులు తమ చిత్రకళా రూపాలను ప్రదర్శించారని, ఈ పోటీలో తనకు ఒకేసారి కళా రత్నం, ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉందని వెంపటాపు అన్నారు. ఈ సందర్భంగా వెంపటాపును పలువురు అభినందించారు. విదేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం జర్మనీ దేశ ప్రతినిధి బృందం ద్వారకాతిరుమల: జర్మనీ, యూరప్ దేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం తమ పర్యటన ద్వారా బలపడిందని జర్మనీ దేశ ప్రతినిధి బృందం పేర్కొంది. రైతు సాధికార సంస్థ ‘్ఙఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం’ (ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా ‘ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్ ’ తరపున బృంద సభ్యులు జాస్పర్ జోర్డాన్, బెన్నెడిక్ట్ హెర్లిన్, పోర్చుగల్కు చెందిన ప్రాజెక్టు ఎర్త్ ప్రతినిధి డియోగో కౌటినో, అటెలియర్ ఫుడ్ సిస్టమ్ చేంజ్ ప్రతినిధి లూకస్ కేహ్లే ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అలాగే ఏటీఎం(ఎనీ టైమ్ మనీ), ఏ గ్రేడ్ మోడల్స్తో పాటు, పీఏండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్), ఆర్డీఎస్ (రబీ డ్రై సోయింగ్) తదితర పంట పొలాలను సందర్శించి, సాగు విధానాలపై ఆరా తీశారు. -
బెస్ట్ ఫిజిక్మెన్ టోర్నమెంట్లో విద్యార్థికి రజత పతకం
భీమవరం: చీరాలలో నిర్వహించిన ఇంటర్ కాలేజీయట్ బెస్ట్ ఫిజిక్మెన్ టోర్నమెంట్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి తోట షణ్ముఖశ్రీనివాస్ సిల్వర్ మెడల్ సాధించినట్లు కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు చెప్పారు. ఈనెల 17న జేఎన్టీయూకే అంతర్ కళాశాలల టోర్నమెంట్లో 60 కేజీల వెయిట్ విభాగంలో షణ్ముఖ శ్రీనివాస్ రజత పతకం సాధించాడన్నారు. బుధవారం విద్యార్థిని కళాశాలలో ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు తదితరులు అభినందించారు. రైలులో పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీ భీమవరం: రైలు ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.75 వేల విలువ చేసే సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు భీమవరం రైల్వే ఎస్సై పీవీటీ రమణ చెప్పారు. బుధవారం బాధితులకు సెల్ఫోన్లు అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై మాట్లాడుతూ రైలులో ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు వారి వస్తువులు, సెల్ఫోన్లు భద్రంగా చూసుకోవాలన్నారు. మోటారుసైకిల్ అదుపు తప్పి.. ఏలూరు (టూటౌన్): మోటారుసైకిల్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం ఆగడాలంక గ్రామానికి చెందిన భలే బాలాజీ (34) బంటా మేస్త్రిగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇతనికి వివాహం జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేధాలతో ఇరువురు వేరుగా ఉంటున్నారు. అయితే బాలాజీ తన సొంత గ్రామంలో కాకుండా తన అక్క ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మాదేపల్లి గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి కోటేశ్వర దుర్గాపురం వైపు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో తలపై బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుధవారం సాయంత్రం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
గణపవరం: నిడమర్రు మండలం బావాయిపాలెంలో జరిగిన యువకుడి హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గణపవరం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ శ్రవణ్కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16వతేదీ రాత్రి బావాయిపాలెం గ్రామానికి చెందిన మజ్జి ఏసు(25) అనే వ్యక్తిని చంపివేసి చేయినరికి కాల్వలో పడవేసినట్లు కేసు నమోదైంది. ఈహత్య కేసును ఛేదించేందుకు ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు గణపవరం సీఐ ఎంవీ సుభాష్, గణపవరం, నిడమర్రు, చేబ్రోలు ఎస్సైలు మణికుమార్, వీరప్రసాద్, సూర్యభగవాన్ల నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించిన మూడు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించి, హత్యలో భాగస్వాములైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. వివాహేతర సంబంధమే కారణం ఈ కేసులో మొదటి ముద్దాయి పిల్లి ఏసుబాబు భార్యతో మజ్జి ఏసుకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ హత్యకు ప్రేరణ అన్నారు. మృతుడు తరచూ ముద్దాయి భార్యతో మాట్లాడటం, సెల్ఫోన్ మెసేజీలు పెడుతున్నాడన్న అనుమానంతో గతంలో కులపెద్దల సమక్షంలో తగవు పెట్టినా మృతుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతడిని హతమార్చేందుకు పిల్లి ఏసుబాబు, అతని తండ్రి అన్నవరం, కోలమూరు గ్రామానికి చెందిన గెడ్డాడ శ్రీనివాసరావు పథకం రచించారు. ఈనెల 15వ తేదీన పిల్లి ఏసుబాబు తన భార్య ఫోన్లో ఆమె పెట్టినట్లుగా మజ్జి ఏసుకు ఫోన్లో మెసేజ్ పెట్టాడు. తాను ఉండి మండలం మహదేవపట్నంలో తన పుట్టింట్లో ఉన్నానని, రావాలని మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసిన మజ్జి ఏసు మోటార్సైకిల్పై మహదేవపట్నం చేరుకుని, ఆమె ఇంటి డాబాపైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ముద్దాయిలు మజ్జి ఏసును పట్టుకుని దారుణంగా చావబాదారు. ఆ దెబ్బలకు తాళలేక మజ్జి ఏసు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆరా తీశారు. దీనితో మా గ్రామంలో కులపెద్దల సమక్షంలో తేల్చుకుంటామని చెప్పి మజ్జి ఏసును పిల్లి ఏసురాజు, గెద్దాడ శ్రీనివాసరావు మోటార్సైకిల్పై ఎక్కించుకుని బావాయిపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బావాయిపాలెం శివారు కొత్తకోడుపుంత వద్ద ఆగారు. అప్పటికే అక్కడ కొబ్బరి గెలలుకోసే కత్తితో సిద్ధంగా ఉన్న పిల్లి ఏసుబాబు తండ్రి పిల్లి అన్నవరంతో కలిసి మజ్జి ఏసు కుడిచేతిని నరికివేశారు. చెయ్యిని కాలువలో పడేసి, బావాయిపాలెం శివారు పశువుల రేవు వద్ద మజ్జి ఏసును వదిలేసి వెళ్లిపోయారు. అధికరక్త స్రావంతో మజ్జి ఏసు కొద్దిసేపటికే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు వారు ఉపయోగించిన కత్తిని, మూడు మోటార్ సైకిళ్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రవణ్కుమార్ -
పైడిపర్రులో టెర్రర్
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే.. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి పైడిపర్రులో శాంతి భద్రతలు క్షీణించాయని, నోరెత్తితే దాడిచేసే పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్లు, జూదాలకుతోడు రౌడీ మూకలు పేట్రేగిపోతుండగా, యువత, చిన్న పిల్లలకు సైతం గంజాయి, మత్తు పదార్థాలను అలవాటు చేసే పరిస్థితి పైడిపర్రులో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా మూడు నెలల క్రితం పైడిపర్రు స్పార్క్ హోటల్లో భారీ కోతాటను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పైడిపర్రులో పేకాటను కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గతనెల 31వ తేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో వీఆర్లో ఉన్న ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో పోలీసు యంత్రాంగం కుదేలైంది. ప్రత్యేక బీట్లు నిర్వహిస్తున్నాం ఈ ఘటనలపై రూరల్ ఎస్సై చంద్రశేఖర్ను సాక్షి వివరణ కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ దొంగతనాల వ్యవహారంపై పోలీసులు బృందాలుగా విచారణ చేస్తున్నారని, అనుమానితులను గుర్తిస్తున్నామని చెప్పారు. పేకాటలపై సమాచారం ఇస్తే దాడులు నిర్వహిస్తామన్నారు. రాత్రి సమయంలో ప్రత్యేక బీట్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తణుకు అర్బన్: పైడిపర్రు గ్రామంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. దొంగల స్వైరవిహారం.. రౌడీ మూకల బెదిరింపులు.. జూదానికి కేరాఫ్ అడ్రస్గా ఈ ప్రాంతం మారింది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలతో పైడిపర్రువాసులు హడలిపోతున్నారు. ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి సయయంలో 1 గంట నుంచి 5 గంటలలోపు పైడిపర్రు ప్రాంతంలో దొంగలు స్వైరవిహారం చేశారు. ఒక మహిళ మెడలో 3 కాసుల బంగారు గొలుసు గుంజుకుని పారిపోగా.. మరో ఇంటి మందు పార్కింగ్ చేసిన మోటార్సైకిల్ను అపహరించారు. గణేశుల సూర్యనారాయణ, ఆరేటి సతీష్, పంగం శంకరం, యర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ఇళ్లలో తలుపులు పగులగొట్టి, తాళాలు విరగ్గొట్టి, కిటికీ చువ్వలు విరిచేసి, తలుపుల గెడలు వంచేసి ఇలా విధ్వంసం సృష్టించారు. దొంగలు చేసిన శబ్దాలకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో పలాయనం చిత్తగించారు. ఒక దొంగ నిక్కరుతో ఉన్నాడని, మరో దొంగ ఫ్యాంటు ధరించి ఉన్నారని బాధితులు చెబుతుండడంతో ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ దొంగతనాలన్ని రూరల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే జరగడం విశేషం. పైడిపర్రు ప్రాంతం మునిసిపాలిటీలో 4 వార్డులుగా కలిసి ఉన్నప్పటికీ ఆ ప్రాంతం ఇంకా గ్రామస్థాయి వాతావరణాన్నే కలిగి ఉంటుంది. 15వేల జనాభా ఉన్న ఈ పైడిపర్రులో 2500 పైగా ఇళ్లు ఉన్నాయి. ఆందోళనలో పైడిపర్రువాసులు ఇటీవల ఫ్లెక్సీ వివాదంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని రౌడీ మూకలు చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరచడం, అలాగే ఒక ఇంట్లో పేకాట నిర్వహించడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో ఈనెల 16వ తేదీన శ్రీబాల వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గ్రామపెద్దలు సమావేశమై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే రాత్రి దొంగలు స్వైరవిహారం చేయడం విశేషం. గ్రామంలో గాడితప్పిన లా అండ్ ఆర్డర్ ఒకే రాత్రి 6 ఇళ్లలో చోరీకి యత్నం గృహాల్లోనే పేకాట శిబిరాలు ఇటీవల చాకుతో యువకుడిపై దాడిచేసిన పేకాట బ్యాచ్ ఎస్సై ఆత్మహత్యతో కొరవడిన పోలీసు నిఘా బంగారు తాడు గుంజుకుపోయాడు 17వ తేదీ తెల్లవారుజాము 5 గంటల సమయంలో మొదటి అంతస్తు భవనంలో గుమ్మం శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి నా మెడలోని 3 కాసుల బంగారు తాడును గుంజుకుని పారిపోయాడు. నా భర్త గత కొంతకాలంగా వేరొక మహిళతో ఉంటుండగా దొంగ వెళ్తూవెళ్తూ ఆవిడ పేరు ప్రస్తావిస్తూ ఆమె జోలికొస్తే చంపేస్తానని హెచ్చరించి పారిపోయాడు. –దేవ లక్ష్మి నవదుర్గ భయాందోళన సృష్టించారు మా ఇంటి ముందు పెట్టిన మోటార్సైకిల్ 17వ తేదీన తెల్లవారిన తరువాత చూస్తే కనిపించలేదు. అదే రోజు రాత్రి నా బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా దొంగలు హల్చల్ చేశారు. గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లు మాత్రమే దోచుకునే దొంగలు ఇప్పుడు ఇంట్లో మనుషులు ఉన్న ఇళ్లలోకి సైతం ప్రవేశించారు. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి భయాందోళన పరిస్థితులు లేవు. –చల్లా పెద్దిరాజు