Bapatla
-
పక్కా ఇళ్ల నిర్మాణ లక్ష్యాలు సాధించాలి
బాపట్ల: పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలని జేసీ ప్రఖర్ జైన్ తెలిపారు. గృహ నిర్మాణంపై సంబంధిత శాఖ అధికారులతో బుధవారం ఆయన స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. మొదటి త్రైమాసికంలో జిల్లాకు 4,898 గృహాల నిర్మాణం లక్ష్యం అన్నారు. ప్రస్తుతం 290 మాత్రమే పూర్తి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. మిగినవన్ని మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద గృహ నిర్మాణాలలో పని దినాలు కల్పించాలన్నారు. నిర్దేశించిన 90 పని దినాలు చూపి లబ్ధిదారులకు కూలి సొమ్ము చెల్లించాలన్నారు. అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలన్నారు. అలా నిర్మించుకుంటే త్వరగా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. పేద లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వడానికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. జేసీ ప్రఖర్జైన్ -
స్వగ్రామంలో విషాదఛాయలు
జవాన్ మృతితో ● రాజస్థాన్లో బాపట్ల జిల్లాకు చెందిన సైనికుడు మృతి ● నేడు స్వస్థలానికి భౌతికకాయం ● కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు పిట్టలవానిపాలెం (కర్లపాలెం): గన్ బుల్లెట్ బ్యాక్ ఫైర్ కావడంతో బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) మృతి చెందారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ వారిని చదివించారు. ఇంటర్ వరకు చదివి 2019 డిసెంబర్లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ 16వ లైట్ క్యావలరీ ఆర్మ్డ్ రేంజ్మెంట్లో రాజస్థాన్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనకు గాయత్రితో వివాహం జరిగింది. వారికి కుమార్తె జ్యోత్స్న ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయారు. జవాన్ భౌతికకాయం సూరజ్గడ్లోని మిలిటరీ హాస్పటల్ నుంచి విమానంలో గురువారం ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తుందని, తరువాత రోడ్డు మార్గాన పిట్టలవానిపాలెంలోని ఆయన స్వగృహానికి తీసుకొస్తామని సైనికాధికారులు తెలిపారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ సోదరుడు గోపీకృష్ణ సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఉన్నారు. అన్న మరణ వార్తతో తల్లడిల్లిపోతున్నారు. మాకిక దిక్కెవరంటూ మోహన్ వెంకటేష్ భార్య గాయత్రి విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది. -
శివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష
● స్థానిక అధికారులకు డీఎస్పీ, ఆర్డీవో ఆదేశం ● చినగంజాంలో అన్ని శాఖలతో సమావేశం ● భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచన చినగంజాం: శివరాత్రి తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని చీరాల డీఎస్పీ మొహ్మద్ మొయిన్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో చినగంజాంలోని రామకోటేశ్వర, బాలకోటేశ్వరస్వామి శివరాత్రి తిరునాళ్ల నిర్వహణకు సంబంధించి మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తిరునాళ్లను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, అందుకు పోలీసు శాఖతో దేవాలయాల కమిటీలు, ప్రజలు సహకరించాలన్నారు. వాహనాలను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని పేర్కొన్నారు. ప్రభల వద్ద నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సమయ పాలన పాటించాలని సూచించారు. చిన్నపాటి సమస్యలు తలెత్తినా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ.. భక్తులు రైల్వే ట్రాక్ వద్ద ఇబ్బందులు పడకుండా అధికారులు, దేవాలయ కమిటీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యం, తాగునీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖాధికారులు సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. దేవాలయాల్లో అర్ధరాత్రి నుంచి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నందున ఆలయ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణాలలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సకాలంతో ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశానికి ముందుగా అధికారులు లలితా రామకోటేశ్వరాలయం, బాలకోటేశ్వరాలయాలను సందర్శించారు. అధికారులకు సంప్రదాయాల ప్రకారం ఆహ్వానం పలికి, పూజాది కార్యక్రమాలను నిర్వహించాక శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసమూర్తి, సీఐ వైవీ రమణయ్య, ఎస్ఐ శీలం రమేష్, రెండు దేవాలయాల కమిటీల ప్రతినిధులు టీఎస్సార్ ఆంజనేయులు, కుర్రి రామసుబ్బారావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
అద్దంకి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీజీఆర్ఎఫ్ ముఖ్య ఉద్దేశమని చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమ్మానియేలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో వినియోగదారుల ఆదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్మానియేలు మాట్లాడుతూ వినియోగదారులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయొద్దన్నారు. సమస్య సమంజసంగా ఉండాలని పేర్కొన్నారు. అధికారులు కూడా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అదాలత్లో 8 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో సాంకేతిక సభ్యుడు కె. వెంకట కృష్ణ, ఆర్థిక సభ్యుడు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, స్వతంత్ర సభ్యురాలు సునీత, ఎస్ఈ బీవీ ఆంజనేయులు, ఈఈ ఎన్ మస్తాన్రావు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు స్కూల్ బస్ను ఢీకొన్న కూలీల ఆటో ఏడుగురికి స్వల్ప గాయాలు జరుబులవారిపాలెం (కారంచేడు): పక్కన ఆగి ఉన్న స్కూల్ బస్సును కూలీలతో వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జరుబులవారిపాలెం గ్రామం నుంచి ఇంకొల్లు వెళ్లే రహదారిలో బుధవారం జరిగింది. ఎస్సై వి. వెంకట్రావు కథనం మేరకు.. ఇంకొల్లుకు చెందిన ఒక ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థుల కోసం కేశవరప్పాడు నుంచి వచ్చి వెళ్తోంది. వ్యవసాయ కూలీలతో ఇంకొల్లు నుంచి కేశవరప్పాడుకు వస్తున్న ఆటో ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లోకి పోగా, కూలీలలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చీరాల ఆసుపత్రికి తరలించారు. కొందరు స్కూల్ బస్సు వచ్చి ఆటోను ఢీకొందని చెబుతున్నారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను ఏఎస్ఐ బి. శేషసాయి సేకరించారు. మల్చింగ్ విధానంతో మంచి దిగుబడులు బల్లికురవ: వ్యవసాయంలో మల్చింగ్ విధానంతో రైతులకు మేలు జరుగుతుందని బాపట్ల జిల్లా ఉద్యాన అధికారి పి.జెనమ్మ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాల్లో 200 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో పుచ్చకాయ సాగు చేపట్టిన పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్చింగ్ విధానంలో కలుపు తక్కువగా రావటం, నీరు ఆవిరి కాకుండా మొక్కలు ఎదుగుదలకు ఉపకరిస్తాయన్నారు. పురుగు, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి బి. హనుమంత్ నాయక్, వీఏఏ వెంకటేశ్వర్లు, ప్రసన్న పాల్గొన్నారు. డాక్టర్ శరత్ చంద్రకుమార్ ఔదార్యం గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల 1998 బ్యాచ్ పూర్వ వైద్య విద్యార్థి, గుంటూరు చంద్ర కేర్ న్యూరో స్పెషాలిటీ అధినేత, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నలమోతు శరత్చంద్రకుమార్ తన తల్లి నలమోతు శైలజకుమారి జ్ఞాపకార్థంగా గుంటూరు వైద్య కళాశాలలో తారు రోడ్ల నిర్మాణానికి నిర్మించేందుకు రూ. 6 లక్షలు విరాళం అందజేశారు. ఈ విరాళంతో నిర్మించిన రోడ్లను బుధవారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందరాచారి శరత్చంద్రకుమార్ను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేడు, రేపు న్యాయవాదుల విధుల బహిష్కరణ గుంటూరు లీగల్ : న్యాయవాదుల అమెండ్మెంట్ బిల్లు 2025కు వ్యతిరేకంగా గుంటూరు బార్ ఫెడరేషన్ నిరసన తెలుపుతుందని ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి బుధవారం తెలిపారు. నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు గురు, శుక్రవారాల్లో విధులను బహిష్కరిస్తున్నట్టు వివరించారు. -
జెడ్పీలో ఆ‘మెక్కు’వంట !
జిల్లా పరిషత్ (జెడ్పీ) అంటే అధికారులు హడలెత్తిపోతుతున్నారు. జెడ్పీని నడిపిస్తున్న అమ్మ అవినీతికి బలవుతున్నారు. నాలుగేళ్లలో నలుగురు సీఈవోలు మారిన ఏకై క జిల్లా పరిషత్గా గుంటూరు నిలిచింది. సీఈవోలుగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు గత నాలుగేళ్లలో బలవంతంగా బదిలీ అవ్వడమే, లేక వారంతట వారే ఇక్కడ ఇమడలేక వెళ్లిపోవడం గమనార్హం. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ నుంచి మంజూరు చేస్తున్న ప్రతి పనిలో కమిషన్లు దండుకుంటూ తిరిగి అధికారులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ రచ్చకెక్కడటం పరిపాటిగా మారింది. జెడ్పీ సీఈవో విధుల్లో నిత్యం జోక్యం చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినా, అక్కడ అవినీతి జరుగుతోందని తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు. జెడ్పీలో సీఈవోగా కొనసాగుతున్న ఉన్నతాధికారిపై పాలకవర్గంలో ఉన్న కీలక వ్యక్తులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని జెడ్పీటీసీలు ఖండిస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదనతో జెడ్పీని భ్రష్టు పట్టిస్తున్న ఆమె సీఈవోలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ జెడ్పీ పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపర ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న వి. జ్యోతిబసు గుంటూరు జిల్లాకు వచ్చి మూడు నెలలైంది. కృష్ణాజిల్లా సీఈవోగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో ఇక్కడికి వచ్చిన ఆయనపై అప్పుడే జెడ్పీ పాలకుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు వరుసగా రెండేళ్ల పాటు ‘‘జగనన్న విద్యాజ్యోతి’’ పేరుతో స్టడీ మెటీరియల్ ముద్రించి పంపిణీ చేశారు. జెడ్పీ పాలకులు పార్టీ మారిన తరువాత మూడోసారి మెటీరియల్ పంపిణీకి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ నుంచి మెటీరియల్ తెప్పించుకుని, టెండర్లు పిలిచి ప్రింటింగ్ చేయించే బాధ్యత సీఈవోకు అప్పగించారు. అయితే, ముద్రణలో ఉండగానే మరో వైపు స్టడీ మెటీరియల్ పంపిణీలో జాప్యం అంటూ ఆరోపణలు చేయించారు. అధికారులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. స్టడీ మెటీరియల్పై సీఎం, విద్యాశాఖ మంత్రి ఫోటోలు ముద్రించలేదని, సీఈవోను లక్ష్యంగా చేసుకున్నారని జెడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు. తక్కువ ధరకే టెండర్ ఖరారు చేసినా ఆరోపణలు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 34,747 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ముద్రణకు సంబంధించి గతంలో కంటే తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టినా సీఈవోపై అర్థం లేని అవినీతి ఆరోపణలు చేయించారు. ఒక పేజీ ముద్రణకు గతంలో 33 పైసలు చెల్లించగా, ప్రస్తుతం అది 30 పైసలకే ఖరారు చేశారు. ఈ విధంగా 564 పేజీలతో ముద్రణ పూర్తయిన పుస్తకాలకు గాను జెడ్పీకి రూ. లక్షల్లో ఆదా అయింది. టెండర్ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున అధికారులపై ఆరోపణలు సాగిస్తుండగా, అసలు ఇప్పటి వరకు ముద్రణదారులకు చెల్లింపులు జరపలేదని అధికారులు చెబుతున్నారు. స్టడీ మెటీరియల్కు పైసా చెల్లించకుండా అవినీతి ఆస్కారం ఎక్కడ ? అని పలువురు జెడ్పీటీసీలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీకి సీఈవోలుగా వచ్చిన వారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ, వారిని బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు దృష్టి సారించని పరిస్థితులు లేవు. పరిస్థితులు ఇలాగే ఉంటే జెడ్పీ సీఈవోగా వచ్చేందుకు సైతం అధికారులు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఈవో పోస్టు అంటే హడలెత్తిపోతున్న అధికారులు జెడ్పీని నడిపిస్తున్న అమ్మ అవినీతికి బలి తమ అవినీతిని దాచి అధికారుల చేతికి మసిపూస్తున్న వైనం నాలుగేళ్లలో మారిన నలుగురు సీఈవోలు ప్రస్తుత సీఈవో వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపర -
బాపట్ల
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం బుధవారం 535.90 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,217 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం శ్రీ మహంకాళి అమ్మ ఆలయ నిర్మాణానికి మక్కెన సుబ్బారావు దంపతులు బుధవారం రూ.1,01,116 విరాళం అందించారు. వైభవంగా కోటి కుంకుమార్చన పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యంతో భవనాశి మినీ రిజర్వాయరు కలగానే మిగిలిపోనుంది. ఫలితంగా 5 వేల ఎకరాల మెట్ట భూములకు నీరు అందే అవకాశం లేకుండాపోయింది. ఇటీవల బడ్జెట్లో రిజర్వాయర్ కోసం ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఎన్నికల ప్రచారంలో అద్దంకి సభలో నారా లోకేశ్ సమక్షంలో హామీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి గొట్టిపాటి ఇకనైనా దానిని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. 7న్యూస్రీల్ -
జిందాల్ ప్లాంట్ను సందర్శించిన ఐజీ
యడ్లపాడు: కృష్ణా జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ నాలుగు టన్నుల అక్రమ గంజాయిని ధ్వంసం చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐజీ ఆరె రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్ ఆపరేషన్ ఏపీ అధ్యక్షుడు ఎం.వి. చారితో సమావేశమయ్యారు. ప్లాంట్లో ఈనెల 22న గంజాయి దహనం కోసం అనుమతి తీసుకున్నారు. కార్యక్రమానికి డీజీపీ హరీష్కుమార్ గుప్తా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అనంతరం అధికారుల బృందం ప్లాంట్లోని వివిధ విభాగాలను పరిశీలించింది. వ్యర్థాల సేకరణ, వాటిని దహనం చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం గురించి తెలుసుకుంది. -
ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ఉద్రిక్తత
దాచేపల్లి: ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో బుధవారం రాత్రి దాచేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శోభయాత్ర లైబ్రరీ సెంటర్లోకి రాగానే భారీఎత్తున నినాదాలు చేశారు. ఓ వ్యక్తి టిప్పు సుల్తాన్ జెండా చూపుతూ హల్చల్ చేయడంతో శోభాయాత్రలో ఉన్న యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు శోభాయాత్రలో రాళ్లు విసిరారు. ఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ జగదీష్ పరిశీలించి, సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలన్నింటిని మూసి వేయించారు. డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించారు. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి లాఠీచార్జీ చేసిన పోలీసులు -
చిన్నారులను తీర్చిదిద్దాలి
డీఈఓ చంద్రకళ కారెంపూడి: బడిపై ఆసక్తి కలిగేలా అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులను తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ టీచర్లకు నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3,4,5 ఏళ్లలోపు చిన్నారులను బడికి ఆకర్షితులను చేయడం అంగన్వాడీల చేతుల్లోనే ఉందని చెప్పారు. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా విద్యపై ఆసక్తి కలిగేలా నర్సరీ బోధన సాగాలని తెలిపారు. అనంతర జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని, పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని తనిఖీ చేశారు. ప్రీ పైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిశీలించి, వాటిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంఈఓ టి. రవికుమార్, జెడ్పీ హెచ్ఎం అనంత శివ ఉన్నారు. -
దేచవరంలో భూచోళ్లు
నరసరావుపేట: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో చర్మకారుల సహకార సంఘానికి కేటాయించిన భూమి ఆక్రమణకు గురైంది. గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారుల అండదండలతో ఆన్లైన్ చేయించుకొని, నకిలీ రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. దర్జాగా అనుభవిస్తున్న విషయం బయటకు పొక్కడంతో కొన్నాళ్లపాటు మిన్నకుండిపోయారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి సదరు భూమిని ఆక్రమణ చేసుకొని సొంతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా నాలుగు రోజుల కిందట భూమిలో ముళ్లపొదలు తొలగించి తమదిగా నమ్మించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్ఎస్ఆర్, అడంగల్లో స్పష్టంగా నమోదు 1970లో అప్పట్లో ఉన్న ప్రభుత్వం దేచవరం గ్రామంలోని చర్మకారుల సహకార సంఘం కోసం భూమిని కేటాయించే ప్రక్రియ ప్రారంభించింది. గ్రామ పరిధిలోనే రూపెనగుంట్ల గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆనుకొని సర్వే నంబరు 192–6బి1లో 3.56 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. అందులో ఎకరాన్ని చర్మకారుల సహకార సంఘానికి కేటాయించారు. వివరాలు ప్రసుత్తం కూడా ఆర్ఎస్ఆర్, అడంగల్లో స్పష్టంగా ఉన్నాయి. ఆక్రమణ రహస్యం బయటకు వచ్చిందిలా... వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కుటుంబాలకు నివేశనా స్థలాలు మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వ భూమి కోసం అధికారులు రికార్డులు తిరగేశారు. చర్మకారులకు కేటాయించిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరుపై ఆన్లైన్ చేయించుకున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని బయటకు లాగారు. ఆన్లైన్ చేయించుక్నున వ్యక్తి తన కుమారుల పేరుపై తప్పుడు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు తేలింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆన్లైన్ నుంచి పేర్లను తొలగించి చర్మకారుల సొసైటీ పేరు మీదే తిరిగి ఆన్లైన్ చేశారు. ముళ్ల పొదలు తొలగింపు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో మిన్నకుండిపోయిన సదరు వ్యక్తి గత నాలుగు రోజులుగా సదరు స్థలాన్ని తిరిగి ఆక్రమణ చేసుకునే పనిలో ఉన్నాడు. సంఘానికి చెందిన భూమిలో ముళ్లపొదలు తొలగించి, కబ్జా చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. తన పేరుపై తిరిగి ఆన్లైన్ చేసేందుకు రెవెన్యూ శాఖ ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కబ్జాకు గురవుతున్న స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించి తప్పుడు రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని పలువురు ఎస్సీలు కోరుతున్నారు. చర్మకారుల సహకార సంఘం భూమి ఆక్రమణ రోడ్డు పక్కనే ఉండడంతో ఆక్రమణదారుల కన్ను పట్టపగలే ముళ్లపొదలు తొలగించి సొంతం చేసుకునే యత్నం గతంలో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకొని తప్పుడు రిజిస్ట్రేషన్లు -
బైకును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి
మరో యువకుడు పరిస్థితి విషమం అద్దంకి: బైకును ట్రాక్టర్ ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని పార్వతీపురం గ్రామ శివార్లలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన యెనికపాటి చౌదరి (19) మార్బుల్ కూలీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మద్దు అనిల్తో కలసి బుధవారం రాత్రి పార్వతీపురం గ్రామం వైపు నుంచి సొంతూరుకు బైక్పై వస్తున్నాడు. పార్వతీపురం గ్రామ శివారు దగ్గర మోదేపల్లి వెళ్తున్న కట్టెల ట్రాక్టరు ఢీకొట్టడంతో బైకు వెనుక వైపున కూర్చున్న చౌదరి మృతి చెందాడు. బైకు నడుపుతున్న అనిల్కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ సుబ్బరాజు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కట్టెల ట్రాక్టరు డ్రైవరు పరారీలో ఉన్నాడు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
విజ్ఞాన్, బౌలింగ్ గ్రీన్ వర్సిటీల మధ్య ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ – యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీల (బీజీఎస్యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని, ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్తో పత్రాలను మార్చుకున్నట్టు వివరించారు. ఒప్పందం వల్ల తమ వర్సిటీ విద్యార్థులకు బీజీఎస్యూతో కలిపి జాయింట్ డిగ్రీలను అందజేయవచ్చునని పేర్కొన్నారు. సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం ఉంటుందని వివరించారు. యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతోపాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కొల్ల, కెన్ (జాన్), సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు. -
మరణించినా.. నలుగురికి పునర్జన్మ
మహిళ అవయవదానం మంగళగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన మహిళ అవయదానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది. తాను మట్టిలో కలిసినా.. నలుగురి జీవితాలకు వెలుగిచ్చింది. విజయవాడ భవానీపురానికి చెందిన ఎం.సరస్వతి(54) ఈనెల 14న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఎయిమ్స్కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం బ్రెయిన్ డెడ్ అయింది. కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అభినందించిన వైద్యులు జీవన్ధాన్ ద్వారా సరస్వతి శరీరం నుంచి కిడ్నీలు, కళ్లు, గుండె, లివర్, లంగ్స్ను సేకరించారు. లివర్, కిడ్నీ, లంగ్స్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించి అవసరమైన రోగులకు శస్త్రచికిత్సతో అమర్చారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు తరలించారు. సరస్వతి అవయదానం చేసి మరికొందరి జీవితాలకు పునర్జన్మ అందించడం అభినందనీయమని వైద్యులు కొనియాడారు. ఆమె బాటలో ప్రతిఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని కోరారు. అభినందనీయం అవయదానం అభినందనీయమని తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా, ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతమ్ శాంత సింగ్ పేర్కొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా అవయవ దాత సరస్వతి గౌరవార్థం ప్రభుత్వం అందజేసిన నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ నగదును ఆమె కుటుంబ సభ్యులు లేనివారి కోసం ఖర్చుచేయాలని ఎయిమ్స్ డైరెక్టర్కు అందజేశారు. -
కుటుంబ సమస్యలపైనా రాజకీయం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు జే.పంగులూరు: దంపతుల నడుమ సమస్యలను తెలుగుదేశం నాయకులు స్వలాభం కోసం రాజకీయం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు పేర్కొన్నారు. అలవలపాడులో పోలీసులు వేధింపులతో పురుగుల మందు తాగి ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న షేక్ గాలీబీని కనకారావు పరామర్శించారు. కుమారుడు ఇమామ్కు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులను టీడీపీ నాయకులు అడ్డం పెట్టుకొని వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను, సానుభూతిపరులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కోర్టులో ఉన్న కేసును పోలీసులు ఎలా సెటిల్ చేస్తారని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి నడుస్తున్న కుటుంబ కలహాల విషయంలో రాజకీయ నాయకుల మెప్పు కోసం పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించడం తగదన్నారు. రేణింగవరం ఎస్సై వినోద్బాబుపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలువుతోందన్నారు. బల్లికురవలో రైతులు మరణానికి కారణం అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసులు... అలవలపాడులో కూడా ఇలా చేయడం బాధాకరం అన్నారు. పోలీసుల తప్పుడు రిపోర్టు.. రేణింగవరం పోలీసుల వల్ల ఇబ్బంది పడి పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలీబీ వద్ద పోలీసులు తప్పుడు రిపోర్టు రాసి, వారితో సంతకం పెట్టించుకున్నారని అన్నారు. కోడలు ఇంటికి రాకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగారని రిపోర్టు రాసుకొని రేణింగవరం ఎస్సైను కాపాడుతున్నారని చెప్పారు. మొదటి నుంచి ఇమామ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తుండేవాడని, అతడిని టార్గెట్ చేసిన టీడీపీ నాయకులు ఇబ్బందికి గురిచేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ ఉన్నారు. -
కిడ్నాప్, హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్
పరారీలో మరో నిందితుడు తెనాలిరూరల్: కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన ఇద్దరు యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకువచ్చి దాడి చేసి హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెనాలి త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు తెలిపారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తెనాలి నందులపేటకి చెందిన మన్నే మణిదీప్కు కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన జానా సతీష్, మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని మణిదీప్ను అడుగుతున్నాడు. డబ్బులు ఇస్తాను రమ్మంటూ సతీష్ అతని స్నేహితుడు పండు ఈనెల 14న విజయవాడ వచ్చారు. మణిదీప్, అతని స్నేహితులు ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదం, కోటా ప్రేమ్చంద్, బచ్చలకూర రమేష్బాబుతో కలిసి విజయవాడ వెళ్లి సతీష్, పండును కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకువచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుండి తప్పించుకున్న సతీష్, పండు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో నలుగురుని అరెస్టు చేసినట్లు త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. బచ్చలకూర రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రకాశరావు సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి
క్రోసూరు: ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని బాలెమర్రులో జరిగింది. ఎస్ఐ నాగేంద్రరావు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నుంచి మిర్చి కోతలకు 40 మంది కూలీలు బాలెమర్రు గ్రామానికి వచ్చారు. వారు పనులకు వెళ్తున్న క్రమంలో నగేష్ సోదరుడు సిద్ధరామయ్య ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన కూర్చుని జారి పడిపోయాడు. తలకు గాయమైంది. 108 వాహనంలో సత్తెనపల్లికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడుకి భార్య, పాప ఉన్నారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సూర్యప్రకాశరావు మృతి తీరని లోటు కొరిటెపాడు: కోల్డ్ స్టోరేజెస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఫెడరేషన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ వైస్ ప్రెసిడెంట్గా, గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్గా గత 30 ఏళ్లుగా సేవలందించిన తడికమళ్ల సూర్యప్రకాశరావు బుధవారం ఉదయం మృతిచెందారు. సూర్యప్రకాశరావు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు పలు రకాల సేవలు అందించారని పలువురు ప్రముఖులు, మిత్రులు, బంధువులు కొనియాడారు. కోల్ట్ స్టోరేజ్ల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. రైతు సోదరుల కోసం ఆరు కోల్డ్స్టోరేజీలను సొంత ఖర్చులతో పలు ప్రాంతాల్లో నిర్మించి నడుపుతున్నారని గుర్తు చేశారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సూర్యప్రకాశరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి యువకుడిపై పోక్సో కేసు మంగళగిరి టౌన్: ఓ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బుధవారం మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి నగరానికి చెందిన ఓ బాలిక 9వ తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. పార్కురోడ్డుకు చెందిన శ్యామ్బాబు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్యామ్బాబు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాలిక అడగడంతో వివాహానికి నిరాకరించాడు. దీంతో బాలిక పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యార్డుకు 1,47,414 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,47,414 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,42,943 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,900 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.7,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 75,790 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
ఫర్టిలైజర్స్ దుకాణాల్లో విజిలెన్స్ దాడులు
చెరుకుపల్లి: ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయించినా.. అక్రమంగా నిల్వ ఉంచిన చర్యలు తప్పవని గుంటూరు విజిలెన్స్ సీఐలు చంద్రశేఖర్, శివాజీలు దుకాణాదారులను హెచ్చరించారు. మండల కేంద్రంలోని భువనశ్రీ ఫర్టిలైజర్స్, గుప్తా ట్రేడర్స్ ఎరువుల దుకాణాలలో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఏకకాలంలో మొదలైన విజిలెన్స్ అధికారుల దాడులు అర్ధరాత్రి వరకు నిర్వహించారు. ఈ దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న మండల కేంద్రంలోని ఎరువుల వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. దాడుల వివరాలు తెలియాల్సి ఉంది. కార్యక్రమంలో గుంటూరు అగ్రికల్చర్ ఏఓ ఆదినారాయణ, స్థానిక మండల వ్యవసాయ అధికారి ఎ.మహేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
మెదడు క్యాన్సర్ నివారణకు కేఎల్యూ విద్యార్థిని సరికొత్త విధానం
తాడేపల్లిరూరల్: గ్లియో బ్లాస్టోమా మల్టీ ఫార్మ్(జీబీఎం)ను అదుపులో ఉంచడం ద్వారా మెడడు క్యాన్సర్ను నివారించే సరికొత్త విధానాన్ని కేఎల్యూ విద్యార్థిని కనిపెట్టినట్లు వర్సిటీ బయో టెక్నాలజీ ఆచార్యులు డాక్టర్ ఎం.జానకి రామయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఔషధాల కొత్త కలయిక ద్వారా ఈ విధానాన్ని విద్యార్ధి సాహితి ఆర్ చామ కొనుగొందని వివరించారు. ఈ విధానంలో ప్రారంభ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో వర్శిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ కె.రాజశేఖరరావు,ప్రో వీసీ డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్ధి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ వి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అభినందించారు.