East Godavari
-
రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్ల ఎంపిక
తుని రూరల్: తిరుపతి బోనగిరిలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు ఎంపికయ్యాయి. బుధవారం తుని మండలం హంసవరం మోడల్ స్కూల్ మైదానంలో ఎంపికలు చేసినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిండి సత్యనారాయణరాజు తెలిపారు. ఇరు జట్ల నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఎస్ జాబ్స్, జిల్లా కార్యదర్శి గంటా విక్టర్బాబు, స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. పురుషుల జట్టు: ఆర్.రాహుల్, వై.వెంకట సాత్విక్, టి.కార్తికేయ, ఎం.అరవింద్, జి.శ్రీనాగ వీరసాయితేజ, పి.దుర్గాఅరవింద్, కె.రామ్చరణ్, జి.జగన్ప్రకాష్, టి.ఉమేష్, ఎం.యశ్వంత్, జి.పవన్, జి.ఆకాష్. మహిళల జట్టు: ఎస్.రేణుక, పి.నవ్యశ్రీ, ఎస్.సాయిరేఖ, జె.హరిణి, కె.మౌనిక, సీహెచ్ దేవి, కె.కనకదుర్గ, వి.విజయ దుర్గాభవాని, జి.దుర్గాసత్యశ్రీ, ఎం.త్రినేత్రదేవి, బి.వెన్నెల, పి.గంగ. -
డిజిటల్ అసిస్టెంట్లకు రెండో రోజు శిక్షణ
సామర్లకోట: సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ రెండో రోజు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం(ఈటీసీ)లో బుధవారం కొనసాగింది. ఎన్ఐఆర్డీపీఆర్(హైదరాబాద్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని డిజిటల్ అసిస్టెంట్లకు సాంకేతిక నైపుణ్యంపై శిక్షణ ఇస్తున్నారు. గురువారంతో ఈ శిక్షణ ముగుస్తుంది. ప్రతి జిల్లా నుంచి నలుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఈ.కృష్ణమోహన్ తెలిపారు. ఎన్ఐఆర్డీపీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ రవిబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్వర్ శిక్షణ ఇస్తున్నారు. యువకుడి అదృశ్యం రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బైక్ లభ్యం కొవ్వూరు: దొమ్మేరు గ్రామానికి చెందిన గగ్గురోతు సాయి తేజ(25) బుధవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి మోటార్ బైక్పై బయలుదేరిన అతడి వాహనాన్ని రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బంధువులు గుర్తించారు. గోదావరి నదిలో దూకాడా, లేక బైక్ను ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికై నా వెళ్లాడా అన్నది తెలియడం లేదని, అతడి సెల్ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఓ గేదెల ఫామ్లో సాయి తేజ పనిచేస్తున్నాడు. నిత్యం దొమ్మేరు నుంచి ఉదయాన్నే వెళ్లి, మళ్లీ 11 గంటల సమయానికి ఇంటికి తిరిగొస్తాడు. ఎప్పటిలాగే బుధవారం ఇంటి నుంచి వెళ్లిన అతడు మళ్లీ తిరిగిరాలేదు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న బంధువులకు స్థానికుల ద్వారా బైక్ వివరాలు తెలిశాయి. ఈ క్రమంలో గోదావరి నదిలో జాలర్ల సాయంతో గాలింపు చేపట్టారు. సాయితేజ సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. -
అర్ధరాత్రి దొంగల హల్చల్
షట్టర్లు పగులగొట్టి పది దుకాణాల్లో చోరీ తుని: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రచ్చతో ఆందోళనకు గురైన ప్రజలకు దొంగలు కంటిపై కునుకు లేకుండా చేశారు. తుని పట్టణంలో రద్దీగా ఉండే జీఎన్టీ రోడ్డులో ఒకేసారి పది దుకాణాల షట్టర్లను పగులగొట్టి, అందిన కాడికి దోచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా ఏకకాలంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆయా దుకాణాల్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. తుని పట్టణంతో పాటు, పాయకరావుపేటలోనూ చోరీలకు యత్నించారు. పెద్ద ముఠాయే ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆయా దుకాణాల్లో సీసీ ఫుటేజ్తో పాటు, దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు. వస్త్ర దుకాణంలో దుస్తులు పట్టుకెళ్లారని, మిగిలిన దుకాణాల్లో నగదును దొంగిలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చోరీలకు పాల్పడిన ముఠా ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా సీసీ ఫుటేజ్లో గుర్తించామన్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇన్చార్జి డీఐజీగా భీమవరం జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కాకినాడ జాయింట్ సబ్రిజిస్ట్రార్–1 ఆర్వీ రామారావు, జాయింట్ సబ్రిజిస్ట్రార్–2 పీఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వెంకటేశ్వర్లు 2022–24 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ఇక్కడ నుంచి భీమవరం జిల్లా రిజిస్ట్రార్గా బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లా డీఐజీగా ఉన్న బి.శివరామ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జిల్లా కె.ఆనందరావుకు ఇన్చార్జి డీఐజీగా నియమించారు. అయితే అదనపు బాధ్యతలుగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు ఈయన పరిధిలోకి వస్తాయి. -
ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే..
జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమేనని జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ ఆరో ఉప కులపతిగా బుధవారం మధ్యాహ్నం వీసీ చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సీఎం, విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వర్సిటీలతో కొత్త కోర్సులపై ఒప్పందం, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనాంశాలు కీలకంగా ఉండేలా ప్రక్షాళన చేపడతానన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టాప్–100లో ఉంచడంతో పాటు, మెరుగైన ఎన్బీఐ ర్యాంకింగ్ సాధనకు కృషి చేస్తామన్నారు. అధ్యాపకులు పరిశోధన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, విద్యార్థులను స్టార్టప్స్, ఆవిష్కరణలకు ఆసక్తి కలిగించేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం సెనెట్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, మాజీ వీసీ ప్రసాదరాజు, పద్మరాజు, మురళీకృష్ణ, డైరెక్టర్లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
104, 108 వ్యవస్థల నిర్వీర్యం
అత్యవసర వైద్య సేవలు అందించే 104, 108 వ్యవస్థలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన, వేతనాల కోసం ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం: అత్యవసర సేవలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే 104, 108 వ్యవస్థలను నిర్వీర్యం చేసిన సర్కారు తాజాగా మూగజీవాలపై ‘పచ్చ’పాతం చూపుతోంది. పశువులకు అత్యవసర వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార వైద్య సేవలకు మంగళం పాడింది. ఉన్న పళంగా ఆరోగ్య సేవలు నిలిపివేసి వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 16 సంచార పశువైద్య వాహనాలు ఆగిపోయాయి. ఫేజ్–1లో వాహనాలు తిరిగి ఆయా పశువైద్య శాఖ ఏడీ కార్యాలయంలో అప్పగించి తమకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిలో పనిచేసే పైలట్, పారావిట్, డాక్టర్, పైలట్ రిలీవర్లు సుమారు 48 మంది విధులకు హాజరు కాకూడదని వాట్సాప్ మెసేజ్ ద్వారా సూచించారు. ఉద్యోగాలు తిరిగి ఇస్తారా? లేక ఇంతటితో ఆగిపోవాలా? అన్న స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అకస్మాత్తుగా తొలగింపు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022 మే మాసంలో అంబులెన్స్ సేవలు ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒక వాహనం కేటాయించారు. అందులో డాక్టర్కు నెలకు రూ.37,000, పారావిట్స్కు రూ.13,400, డ్రైవర్కు రూ.10,500 వేతనం చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలు అందిస్తున్నారు. ఉన్నపళంగా వెళ్లమని.. పశు అంబులెన్స్ సేవలను జీవీకేఈఎంఆర్ఐ సంస్థ నిర్వహిస్తోంది. ఈనెల 16వ తేదీ నాటికి సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసిందని, విధుల నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం ఉద్యోగులకు నోటీసులు పంపింది. ఒక్క సారిగా చెప్పడంతో ఉద్యోగులు అవాక్కవుతున్నారు. ఉద్యోగాల తొలగింపు అంశంతో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెరుగుతాయని భావించిన తమకు చేదు అనుభవం ఎదురైందని వాపోతున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. పశువైద్య శాఖ ఏడీ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉద్దేశం ఇదీ.. పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్లు తీసుకురాగా.. తూర్పుగోదావరి జిల్లాకు 16 అంబులెన్సులు కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు 108 అంబులెన్సుల తరహాలో.. అత్యాధునిక సౌకర్యాలతో పశువుల ఆంబులెన్సులు తీర్చిదిద్దారు. వీటి నిర్వహణ ఖర్చులు సైతం ప్రభుత్వమే భరించింది. అంబులెన్స్ సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్ ఫ్రీ నంబరు సైతం ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్లో రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువును సమీపంలోని ఏరియా పశువైద్యశాల, వెటర్నరీ పాలీక్లినిక్కు తరలించి మరీ వైద్యం అందించారు. తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేర్చేవారు. సేవలు ప్రాంభించిన మూడేళ్లల్లో లక్షల సంఖ్యలో పశువులకు మెరుగైన వైద్యం అందించారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలను కూటమి ప్రభుత్వం ఉన్నపళంగా ఆపేయడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. వైద్యం పొందాలంటే కిలోమీటర్ల దూరంలోని పశువైద్య శాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. అంబులెన్స్లో అధునాతన వసతులుపశువుల అంబులెన్స్లో అధునాతన వసతులు కల్పించారు. అవసరమైన వైద్య సిబ్బంది నియామకం చేపట్టారు. ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రో స్కోప్తో కూడిన చిన్న ప్రయోగశాలను ఆ వాహనంలో ఏర్పాటు చేశారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేం దుకు హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం ఉంది. ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్ర చికిత్స చేసే సౌలభ్యం వాహనాల్లో కల్పించారు. పశువులకు అత్యవసర వైద్య సేవలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్దపీట ఆయా గ్రామాల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా వాహనాలు కూటమి ప్రభుత్వం వచ్చాక సేవల నిర్వీర్యం సంచార వైద్య వాహనాలు ఆపేయాలని నిర్ణయం ఉన్నపళంగా ఉత్తర్వులు జిల్లాలో 16 వాహనాల ద్వారా సేవలు ఇప్పటికే 104, 108 వ్యవస్థల నిర్వీర్యం -
ఇసుక డ్రెడ్జింగ్ను అడ్డుకున్న కార్మికులు
కొవ్వూరు: భారీ డ్రెజ్జింగ్ యంత్రాలను వినియోగించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు తక్షణం నిలిపివేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట బోటు కార్మికులు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. పౌర హక్కుల సంఘం నేతలు,ఐఎఫ్టీయు,దళి ప్రజా వేదిక నాయకులు ఈ ధర్నాకి సంఘీభావం ప్రకటించారు.గోదావరి నదిలో డ్రెజ్జింగ్ చేస్తున్న బోటును పట్టుకుని పోలీసులు,ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్పగించామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ ప్రకటించారు.వేలాది మంది కార్మికుల ఉపాధి ని దెబ్బతీస్తూ నది అక్రమంగా డ్రెజ్జింగ్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించు కోవడం లేదని దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు పేర్కోన్నారు.ఇసుక సేకరించే కార్మికులు చిన్న పడవల సాయంతో ఇసుక సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారని అన్నారు.పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలను వినియోగించి నది గర్భంలో డ్రెజ్జింగ్ చేయడం మూలంగా కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారని అన్నారు.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా నదిలో భారీ డ్రెజ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నరన్నారు.గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాలను విస్మరించి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని,దీనిపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే గ్రీన్ ట్రిబ్యూనల్ను,హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.అక్రమం గా తవ్వుతున్న యంత్రాలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు స్పందించి కేసులు నమోదు చేయకపోవడం బాధకరం అన్నారు.కార్మికులే స్వయంగా రంగంలోకి దిగి పట్టుకుని ఫిర్యాదు చేస్తే తప్పా స్పందించే పరిస్ధితి లేకపోవడం విచారకరం అన్నారు. చోళ్ల రాజు మాట్లాడుతూ కార్మికులు అర్ధరాత్రి భారీ బోటుని పట్టుకుని తెల్లవారేంత వరకు కాపలా ఉండి తీసుకోచ్చారన్నారు.అనంతరం నీటి పారుల శాఖ విభాగం ఆర్డీవోకి ఈ డ్రెజ్జింగ్ ప్రక్రియ పై రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చారు.ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ఇసుక పడవల కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని కోరారు.నది అక్రమంగా డ్రెజ్జింగ్ను ఆరికట్టడంతో పాటు డ్రెజ్జింగ్ ప్రక్రియ నిర్వహాకులపైన,ర్యాంపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ డ్రెజ్జింగ్ నిర్వహాకులపై చర్యలు తీసుకుంటామని, కార్మికులకు ఉపాధి కల్పనలో భాగంగా పడవల ర్యాంపులు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాణిసుస్మిత ప్రకటించారు.గోదావరి ఇసుక కార్మికుల సంఘం అధ్యక్షుడు చీరా అప్పారావు, ఇసుక కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా -
పాత నేరస్తులపై నిఘా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, గ్రేవ్ ఎక్విటల్, మిస్సింగ్, పోక్సో, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎన్బీఎం మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నవరం ఆలయానికి కోడ్ నుంచి మినహాయింపు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎల్సీ ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు కోరుతూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించిన లేఖకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అనుమతి మంజూరు చేశారు. దానికి సంబందించిన ఆర్డర్స్ బుధవారం దేవస్థానానికి చేరాయి. అన్నవరం దేవస్థానంలో మార్చి 30 వ తేదీన జరుగనున్న ఉగాది వేడుకలు, ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి, మే నెల ఏడో తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే శాసనసమండలి ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంది. దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడానికి వీలు లేదు. ఈ పనులు అత్యవసరంగా చేయాల్సినవి అయినందున వీటికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు లేఖ రాశారు. ఆ లేఖను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించగా ఆ మేరకు ఎన్నికల సంఘం మినహాయింపు వచ్చింది. త్వరలోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు కాకినాడ సిటీ: తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్న దృష్ట్యా కాకినాడ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 163(2) ప్రకారం ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ గుమికూడడం నిషిద్ధమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సభలు సమావేశాలు పెట్టకూడదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించామని కలెక్టర్ వివరించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 25వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు ఎవరు సమావేశాలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా తిరగడం చేయకూడదన్నారు. -
వేగంగా డేటా నవీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సర్వే సమయంలో ఇంటి వద్ద లేని సిటిజన్ల హౌస్ హోల్డ్ డేటా పెండింగ్ లేకుండా ప్రతి శాఖకు చెందిన లబ్ధిదారుల, అర్హుల జాబితాను అనుసరించి క్రమబద్ధీకరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో మిస్సింగ్ హౌస్ హోల్ర్స్డ్ పై సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1,65,278 మంది మిస్సింగ్ హౌస్ హోల్డ్ ఉన్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికీ ఇంకా 48,232 మంది వివరాలను గుర్తించి డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉందన్నారు. నూరుశాతం మిస్సింగ్ హౌస్ హోల్డ్ గుర్తించడంలో భాగంగా వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు సచివాలయాలు వారీగా గుర్తించి నవీకరించాలన్నారు. విద్యుత్ శాఖ 16,082, పౌర సరఫరాల శాఖ 7,889 , విద్యా శాఖ 5,799 , ఆరోగ్యశ్రీ 5,426 , డ్వామా 4,685 , సర్వే 4,677 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఆధారంగా వారి వివరాలు సేకరించి నవీకరణ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి టీ సీతారామమూర్తి , డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు పి వీణాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి చొరవ రానున్న ఆగస్టు నాటికి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధానం చొరవ తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యాటక కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించగా, ఇంచార్జి జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర దామా, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీలను గుర్తించి చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి 216–ఏ పర్యాటక ప్రాంతంగా నర్సరీల స్టాల్స్ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని గుర్తించాలన్నారు. కడియం నర్సరీలు, ఫ్లవర్ మార్కెట్ వర్గాలు, స్వయం సహక సంఘాలు, చేనేత కుటుంబాలను గుర్తించి లీజ్ పద్ధతిలో షాప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కడియపులంక ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం ఒక కిలోమీటర్ తో చేపట్టి, దశల వారీగా నిడివి పెంచుకోవాలన్నారు. -
ఉన్నపళంగా ఆగిపోమన్నారు
మూడేళ్లుగా సంచార అంబులెన్స్లో పనిచేస్తున్నాం. సీనియారిటీ ఉంది కదా వేతనాలు పెరుగుతాయని భావించాం. కానీ ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒక్కసారిగా రోడ్డున పడ్డాం. ఏ పనిచేసుకుని మా కుటుంబాలను పోషించాలో అర్థం కావడం లేదు. – రాజేష్, డ్రైవర్ 16వ తేదీ నుంచి రావద్దన్నారు పాత సంస్థ కాంట్రాక్ట్ అయిపోయింది. 16వ తేదీ నుంచి ఉద్యోగాలకు రావద్దన్నారు. ముందస్తు సమాచారం లేకుండా టెర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు. జిల్లాలో 16 వాహనాల్లో 48 మంది పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగాలు చూపించి ఆదుకోవాలి. –రాజారత్నం, డ్రైవర్ -
క్రీడా స్ఫూర్తిని చాటిన హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం క్రీడా స్ఫూర్తిని చాటాయి. పురుషుల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై 7–1 స్కోర్తో ఛత్తీస్గఢ్ సెక్టార్, ఆర్బీఎస్ భువనేశ్వర్పై ఆర్బీఎస్ ఉత్తరాఖండ్ 5–0తో, ఆర్బీఎస్ ఛండీగఢ్పై ఆర్బీఎస్ బెంగళూరు 4–1తో, గోవా సెక్టార్పై తెలంగాణ సెక్టార్ 21–0 స్కోర్తో విజయం సాధించాయి. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్తో, కేరళ సెక్టార్పై ఛత్తీస్గఢ్ సెక్టార్ 13–0 స్కోర్తో, మధ్య ప్రదేశ్ సెక్టార్పై ఏపీ సెక్టార్ 18–0 స్కోర్తో గెలుపొందాయి. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, మ్యాచ్లను ప్రారంభించారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, సూరిబాబు పర్యవేక్షించారు. -
నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
కోనసీమ జిల్లా డీఈఓ సలీం బాషా సాక్షి, అమలాపురం: రానున్న పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతకు సమన్వయంతో పాటుపడాలని కోనసీమ జిల్లా డీఈఓ షేక్ సలీం బాషా ఉపాధ్యాయులు, ఎంఈఓలకు ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారు చేసి, విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. టెన్నికాయిట్ పోటీలకు సర్వం సిద్ధం గోపాలపురం: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు చిట్యాల జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలతో పాటు, రెండు కొత్తవి కలిపి మొత్తం 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దే చంద్రశేఖర్, హెచ్ఎం ఎస్ఎల్ఎన్ శాస్త్రి తెలిపారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పోటీలు 22వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. రేయింబవళ్లు పోటీలు జరుగుతాయని తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
లిల్లీని పిండినల్లిపేస్తోంది
పెరవలి: తూర్పుగోదావరి జిల్లాలో లిల్లీపూల సాగు 300 ఎకరాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో జరుగుతోంది. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటలో వివిధ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులను కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుమచ్చ లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకు వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణ చర్యలు ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి (మీల్బగ్) ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీదుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వలన తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లిపురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలుచు పురుగు పుష్పగుచ్ఛాన్ని మొగ్గతొలిచే పురుగులు ఆశించి, గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోయి గుచ్ఛ అలాగే ఉండిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగుల నివారణకు.. లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్డిజం గ్రాము లీటరు నీటికి పిచికారీ చేయాలి. క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే, రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు. 300 ఎకరాల్లో లిల్లీ పూల సాగు దుష్ప్రభావం చూపుతున్న తెగుళ్లు సస్యరక్షణ చర్యలు తప్పవంటున్న నిపుణులుఎరువుల యాజమాన్యం సేంద్రియ ఎరువులతో పాటు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఇలా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి, ఎకరాకి 60 వేల నుంచి 70 వేలు పుష్పగుచ్చాలొచ్చి 3 నుండి 7 టన్నుల పూల దిగుబడి వస్తుంది. -
టీడీపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు
తుని: సుధీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విరుచుకుపడ్డారు. బుధవారం తుని యనమల కృష్ణుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుని మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీకి చెందిన ఒక్క కౌన్సిలర్ లేరని, బలం లేని చోట అధికార మదంతో పోలీసులు, అధికారులను ఉపయోగించుకుని బలవంతంగా లాక్కుకోవడానికి యత్నంచడం దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. టీడీపీలో మంత్రిగా, స్పీకర్గా ఉన్నత పదవుల్లో ఉన్న యనమల రామకృష్ణుడు నీచ రాజకీయాలకు పాల్పడి సభ్య సమాజం నివ్వెర పోయే విధంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను బలవంతంగా టీడీపీలో చేర్చుకుని ప్రజా స్వామ్య వ్యవస్ధను నిర్వీర్యం చేశారన్నారు. మంగళవారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా టీడీపీ కుట్రను దీటుగా ఎదుర్కొన్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన చోటా నాయకులతో నాపై విమర్శలు చేస్తున్నారని, ముందు మీరు నైతిక విలువలు పాటించి తర్వాత నీతులు చెబితే బాగుంటుందన్నారు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాలుగు సార్లు వాయిదా పడేవిధంగా అధికారులను ప్రభావితం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని విర్ర వీగిపోతే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హితవు పలికారు. బలం లేకపోయినా వైస్ చైర్మన్కు పోటీ పడతారా? వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు -
గామన్ బ్రిడ్జిపై కారు దగ్ధం
కొవ్వూరు: పట్టణ శివారున ఉన్న గామన్ ఇండియా బ్రిడ్జిపై 33వ పిల్లర్ వద్ద బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. బ్యానెట్ నుంచి మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై, వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన బందెల కృష్ణ ఆ కారులో రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు – రూ.1.77 లక్షల నగదు, బైక్ స్వాధీనం అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని పేరూరు వై.జంక్షన్లో ఈ నెల 4న ఓ బైక్ నుంచి రూ.1.50 లక్షల నగదును కాజేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద నుంచి రూ.1.77 లక్షల నగదు, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. వై.జంక్షన్లోని ఓ టిఫిన్ సెంటరులో అల్పాహారానికి ఇద్దరు వ్యక్తులు బైక్ పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు బైక్పై వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్ సైడ్ డిక్కీలో పెట్టిన రూ.1.50 లక్షల నగదును దొంగిలించి పరారైన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీడివలస గ్రామానికి చెందిన మేకల బాలరాజును అరెస్ట్ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు పర్యవేక్షణలో, పట్టణ ఎస్సై టి.తిరుమలరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలరాజు రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ చెప్పారు.