#Marcus Stoinis: స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Published
Wed, Apr 24 2024 6:30 AM
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ విరోచిత శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి వారు విఫలమైన చోట స్టోయినిష్ తన బ్యాట్కు పనిచెప్పాడు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లను స్టోయినిష్ ఓ ఆట ఆడుకున్నాడు.
తన విధ్వంసకర సెంచరీతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న స్టోయినిష్ 13 ఫోర్లు, 6 సిక్స్లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సీఎస్కేపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
ఇక సెంచరీతో మెరిసిన స్టోయినిష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖిచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో 124 పరుగులు చేసిన స్టోయినిష్.. వాల్తాటి ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.