రెండోసారి అధికారంపై వైఎస్సార్‌సీపీ ధీమా! | Sakshi
Sakshi News home page

రెండోసారి అధికారంపై వైఎస్సార్‌సీపీ ధీమా!

Published Mon, Jun 3 2024 7:11 PM

YSRCP Complete Trust Coming To Power Again In AP

సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టీడీపీతో అప్రమత్తంగా ఉండాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన కౌంటింగ్‌ ఏజెంట్లను అప్రమత్తం చేసింది. వ్యవస్థలను మేనేజ్ చేయడం ప్రావీణ్యం సాధించిన టీడీపీ ఎటువంటి అక్రమాలకైనా తెగిస్తుందని హెచ్చరించారు. విజయం పట్ల ఎంత ధీమాగా ఉన్నా ప్రత్యర్థుల విషయంలో అజాగ్రత్తగా ఉండరాదనే విధంగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తోంది. గడచిన ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమకు మరోసారి అధికారాన్ని అందిస్తాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌లకు సునామీలా ఉవ్వెత్తున వచ్చిన మహిళలే ఇందుకు నిదర్శనమంటున్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు..దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్ళలో జరిగినన్ని సంక్షమే, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదనే విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ గుర్తు చేస్తోంది. అందుకే ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం కనిపిస్తోందని అంటున్నారు.

రాష్ట్రంలో నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 81.86 శాతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది గత ఎన్నికల కంటే 2 శాతం ఎక్కువ. సహజంగా పోలింగ్ భారీగా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వెల్లువలా వచ్చారనే టాక్ ఉంది. అయితే గతంలో  అనేక అనుభవాలు చూసినా..తాజా ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూసినా..ఇది ప్రభుత్వానికి పాజిటివ్ ఓటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందాయి. ప్రతి కుటుంబం లక్షలాది రూపాయల లబ్ది పొందింది. వారంతా వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి రావాలనే కోరుకున్నారు. పైగా పేదలకు సంక్షేమం ఇచ్చే విషయంలో, గడచిన మూడు మాసాల్లో పెన్షన్ విషయంలో వృద్ధులను చంద్రబాబు టీమ్ పెట్టిన కష్టాలు ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


తమ ఓటమి ఖాయం అని ఖరారు చేసుకున్న పచ్చ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు..వ్యవస్థను మేనేజ్ చేయవచ్చనే దురాలోచనతోనే నానా తిప్పలు పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగానే ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికల్లో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున కూడా అక్రమాలకు తెగబడతారనే ఆలోచనతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా..అసలైన ఫలితాల విషయంలో తమ శ్రేణులను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే తమ పార్టీ శ్రేణులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారీగా శిక్షణ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు ఎంత కీలకమైనదో వివరిస్తూ..కౌంటింగ్‌ సమయంలో ప్రత్యర్థులు తమ చూపు మరల్చడానికి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని సూచించింది. అదేవిధంగా ప్రతి కౌంటింగ్ కేంద్రంలోనూ అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటించేవరకు ఎవరూ బయటకు రావద్దని కూడా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మొత్తం మీద మరికొద్ది గంటలలోనే తేలిపోనున్న ఎన్నికల ఫలితాల కోసం దేశం యావత్తూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోంది. ఏపీలో మరోసారి అధికార పీఠం ఎక్కేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.
 

Advertisement
 
Advertisement