![సింగారంలో మాట్లాడుతున్న డీకే అరుణ
- Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/16/15nrpt202-210084_mr_0.jpg.webp?itok=TBr5PcrU)
నారాయణపేట రూరల్: సంక్షేమ పథకాలు అందించడం కాకుండా ప్రజలను మోసం చేయడమే రేవంత్ సర్కార్ ఇచ్చిన అసలు గ్యారెంటీ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. నారాయణపేట మండలంలోని సింగారం, జలాల్పూర్ గ్రామాల్లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఆయన హయాంలోనే దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు కలిసి రావాలని కోరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మోదికి ఎవరు సాటిరారని, ఎంపీగా తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. పలువురు వివిద పార్టీల నాయకులు బీజేపీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు.
కమలంలోనే రతంగపాండురెడ్డి..
ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొత్తకాపు రతంగపాండురెడ్డి తిరిగి కమలంలోనే కొనసాగనున్నారు. పట్టువీడిన ఆయన సోమవారం డీకే అరుణతో కలిసి తన సొంత గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సాయిబన్న, గణపశ్రీనివాస్, నాగిరెడ్డి, నారాయణరెడ్డి, అశోక్, హన్మంతు, చంద్రప్ప, నర్సింహా, ఎల్లప్ప, భరత్, లక్ష్మప్ప, అనిల్ తదితరులు పాల్గొన్నారు.