![బొల్లారంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర నాయకులు జాన్వెస్లీ - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/15/14wnp550-210098_mr_0.jpg.webp?itok=3n9czTue)
వీపనగండ్ల: సీపీఎం సిద్ధాంతాల కోసం అహర్నిశలు పనిచేసి, పేదల కష్టాల్లో పాలుపంచుకున్న నాయకులు మరణిస్తే, వారి ఆశయాల కోసం పనిచేసినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించిన వారం అవుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ అన్నారు. ఆదివారం బొల్లారంలో సీపీఎం నాయకులు రాములు ఇటీవల మృతిచెందగా.. ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాములు విద్యార్థి ఉద్యమంతో పాటు ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారన్నారు. కులతత్వ నిర్మూలన కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యపరిచిన మహామనిషి అని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంతో పేద ప్రజలకు అండగా నిలిచినవారం అవుతామన్నారు. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. హిందూ ముస్లింల మధ్య తగాదాలు సృష్టించి ఓట్లు రాబట్టాలని చూస్తున్న బీజేపీ విధానాలను ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణజ్యోతి, జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, సీనియర్ నాయకులు రాంరెడ్డి, నాగిరెడ్డి, భాస్కర్రెడ్డి, పుట్ట ఆంజనేయులు, లక్ష్మి, మేకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.