![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/15/14nrpt110-210082_mr_1.jpg.webp?itok=4S79fpXj)
నారాయణపేట: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం 6 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు రానున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి తరపున ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనజాతరకు నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ, ధన్వాడ, మరికల్, దామరగిద్ద, నారాయణపేట టౌన్, మండలాల నుంచి జనాన్ని భారీఎత్తున తరలించేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి ఏర్పాట్లు చేశారు. జనజాతరకు దాదాపు 50 వేల మందిని తరలించి సభను విజయవంతం చేసేందుకు సంకల్పించారు. సభకు సీఎం రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి మహబూబ్నగర్లోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక, ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పర్యవేక్షించి ఏర్పాట్లు పరిశీలించారు.
సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం
జనజాతర సభకు ఉమ్మడి జిల్లా నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ యోగేష్ గౌతమ్ భద్రతాపరమైన సూచనలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో బందోబస్తు 12 సెక్టార్లుగా విభజించి పకడ్బందీగా భద్రత కల్పించాలని, పోలీస్ అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధులు నిర్వర్తించే సమయంలో సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు. పబ్లిక్ గ్యాలరీ, పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ సెక్టార్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీలు నాగేంద్రుడు, రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు లింగయ్య, మహేష్, శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ‘పేట’కు సీఎం రేవంత్రెడ్డి రాక
భారీగా జనసమీకరణకు శ్రేణుల
తలమునకలు
670 మంది పోలీసులతో బందోబస్తు
ఏర్పాట్లను పర్యవేక్షించిన
ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి
పటిష్ట బందోబస్తు..
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి జనజాతర బహిరంగ సభకు రానుండటంతో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీస్శాఖ 670 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పకడ్బందీగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 65 మంది ఎస్లు, 75 మంది ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు 415, మహిళా పోలీసులు 50, 2 రోప్ పార్టీలు, 2 టీఎస్ఎస్సీ ప్లాటున్స్, స్పెషల్ పార్టీ పోలీసులు, 2 ఐటీబీపీ ప్లాటూన్స్తో బందోబస్తు నిర్వహించనున్నారు.
![జన జాతరకు సిద్ధమవుతున్న సభావేదిక](/sites/default/files/gallery_images/2024/04/15/14nrpt108-210082_mr_0.jpg)
జన జాతరకు సిద్ధమవుతున్న సభావేదిక