వన్డేల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన కేదార్‌ జాదవ్‌.. కోహ్లితో కలిసి..! IND VS ENG: THE MOST MEMORABLE INNINGS OF KEDAR JADHAV CAREER | Sakshi
Sakshi News home page

వన్డేల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన కేదార్‌ జాదవ్‌.. కోహ్లితో కలిసి..!

Published Mon, Jun 3 2024 5:32 PM | Last Updated on Mon, Jun 3 2024 7:01 PM

IND VS ENG: THE MOST MEMORABLE INNINGS OF KEDAR JADHAV CAREER

టీమిండియా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జూన్‌ 3) ప్రకటించాడు. వైవిధ్యభరితమైన ఆటగాడిగా పేరున్న కేదార్‌.. టీమిండియా తరఫున పలు మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేదార్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో అతనాడిన ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది.

2017లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్‌ చేసిన మెరుపు శతకాన్ని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. భారత ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి అది తొలి మ్యాచ్‌. పూణే వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కేదార్‌ సొంత అభిమానుల (కేదార్‌ స్వస్థలం పూణే) మధ్యలో పేట్రేగిపోయాడు. కేవలం 65 బంతుల్లోనే శతక్కొట్టి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.  

ఆ మ్యాచ్‌లో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో బరిలోకి దిగిన లోకల్‌ బాయ్‌ కేదార్‌.. ఎవరూ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. 

కేదార్‌కు జతగా మరో ఎండ్‌లో కోహ్లి కూడా శివాలెత్తిపోయాడు. కోహ్లి 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను విజయపు అంచుల వరకు తీసుకెళ్లారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (40 నాటౌట్‌) లాంఛనంగా మ్యాచ్‌ను ముగించాడు. కేదార్‌, కోహ్లి చెలరేగడంతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 

ఈ మ్యాచ్‌లో కేదార్‌ ఆడిన ఇన్నింగ్స్‌ వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. కేదార్‌, కోహ్లి శతక్కొట్టుడు ముందు 351 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. కేదార్‌ ఆడిన ఆ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు.

కేదార్‌ కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్‌తో పాటు మరో మరపురాని ఇన్నింగ్స్‌ కూడా ఉంది. 2018 ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించిన కేదార్‌.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన సీజన్‌ తొలి మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే ఆఖర్లో వచ్చి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. 

ఆ మ్యాచ్‌లో గాయం బారిన పడిన కేదార్‌.. సీఎస్‌కే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మ్యాచ్‌ను ముగించాడు. కేదార్‌ దేశవాలీ కెరీర్‌లో సైతం ఇలాంటి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు చాలా ఉన్నాయి.

39 ఏళ్ల కేదార్‌.. టీమిండియా తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్‌ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి.

ఐపీఎల్‌లో 2010 నుంచి 2023 సీజన్‌ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్‌.. తన కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.

కేదార్‌ దేశవాలీ ట్రాక్‌ రికార్డు విషయానికొస్తే.. పూణేలో పుట్టి మహారాష్ట్రకు ప్రాతినిథ్యం​ వహించే కేదార్‌.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 186 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

: 5

    Rohit-Kohli: ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితేనే ఇలా జరిగింది..!

    Published Mon, Jun 3 2024 7:45 PM | Last Updated on Mon, Jun 3 2024 8:13 PM

    T20 World Cup 2024: Team India Scored 224 Runs Last Time When Rohit Sharma And Virat Opened In T20s

    టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా తరఫున ఓపెనర్‌గా రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి బరిలోకి దిగాలని తారా స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

    అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి.. రోహిత్‌ శర్మతో కలిసి ఒకే ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా  జత కట్టాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌ జోడీ చెలరేగిపోయింది.

    2022 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వీరు కేవలం 54 బంతుల్లోనే 94 పరుగులు జోడించి, భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. టీ20ల్లో కోహ్లి అప్పటివరకు అడపాదడపా మాత్రమే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో కోహ్లి ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో అని అభిమానులు తెగ టెన్షన్‌ పడ్డారు.

    అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. అప్పటికే రెగ్యులర్‌ ఓపెనర్‌గా స్థిరపడిన రోహిత్‌ సైతం ఆ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు.

    వీరిద్దరితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (32 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (39 నాటౌట్‌) కూడా విజృంభించడంతో ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్‌ చేతులెత్తేయడంతో భారత్‌ ఆ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి-రోహిత్‌ ఓపెనర్లుగా జతకట్టాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ స్కోర్‌ కార్డు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోహ్లి-రోహిత్‌ జోడీ ఒక్క మ్యాచ్‌లో జతకడితేనే ఈ స్థాయి విధ్వంసం జరిగింది. అదే వీరిద్దరు ప్రతి మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితే వీరిని ఆపడం సాధ్యమా అని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు.

    ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఇదివరకే ప్రూవ్‌ చేసుకున్న విరాట్‌.. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనర్‌గా అదిరిపోయే ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్నాడు. విరాట్‌ టీ20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 9 మ్యాచ్‌ల్లో 57.14 సగటున, 161.29 స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2024 సీజన్‌లో అరివీర భయంకర ఫామ్‌లో (741 పరుగులతో సీజన్‌ టాప్‌ స్కోరర్‌) ఉన్న కోహ్లి.. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా జతకడితే ఈసారి టీమిండియా ప్రపంచకప్‌ గెలవడం ఖాయమని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

     

    No comments yet. Be the first to comment!
    Add a comment

    : 27

Advertisement
 
Advertisement