రాష్ట్ర రెవెన్యూ, సమాచార,
గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
కొత్తగూడెంరూరల్: ఎంపీగా నామ నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానంటూ ఖమ్మంలో జరిగిన బస్సు యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారని, దీనిని బట్టి బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని అర్థమవుతోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం చుంచుపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పలువురు నాయకులు ఊకంటి గోపాల్రావు, గడిపల్లి కవిత, వీరబాబు తదితరులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్లో చేరినవారికి అండగా ఉంటానని తెలిపారు. కేసీఆర్ పదేళ్లలో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టారని ఆరోపించారు. ఇక బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెడుతోందని, రామాలయాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని పేర్కొన్నారు. ఖమ్మం అభ్యర్ధి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈ నెల 4న సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, 7న సినీ హీరో వెంకటేష్ ప్రచారం చేయనున్నట్లు వివరించారు. కాంగ్రెస్లో చేరిన ఊకంటి గోపాల్రావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వేరే అభ్యర్థికి మద్దతు తెలిపి తప్పు చేశానని, ఇక నుంచి జీవితాంతం శ్రీనన్నతోనే ఉంటానని అన్నారు. అనంతరం ప్రకాశం స్టేడియంలో నిర్వహించే సీఎం సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు అళ్ల మురళి, తూము చౌదరి, తూళ్లురు బ్రహ్మయ్య, ఎడవల్లి కృష్ణ, నాగేంద్ర త్రివేది, నాగసీతారాములు, రాయల శాంతయ్య, గడిపల్లి కవిత, బిందు చౌహన్, జేవీఎస్ చౌదరి, మండె వీరహనుమంతరావు, పిడమర్తి రవి, వీరబాబు, పిచ్చిరెడ్డి, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.