కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు
ఎ.దిలీబన్, ధీరజ్సింగా
కాళోజీ సెంటర్ : పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను విధిగా అందజేయాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.దిలీబన్, ధీరజ్సింగా అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో అభ్యర్థుల వ్యయ సంబంధిత రిజిస్టర్లను ఖర్చుల పరిశీలకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల బరిలో ఉన్న 42 మంది అభ్యర్థుల్లో 32 మంది మాత్రమే రిజిస్టర్లను సమర్పించినట్లు తెలిపారు. ప్రజాప్రాతినిథ్యం చట్టంలోని సెక్షన్–77 ప్రకారం అభ్యర్థులు విధిగా హాజరై ఎన్నికల ఖర్చులు పరిశీలించుకోవాలని, హాజరు కాని 10 మంది అభ్యర్థులకు నోటీసులు అందజేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం దృష్ట్యా అభ్యర్థులే కాకుండా వారి ప్రతినిధులు కూడా రిజిస్టర్లను పరిశీలనకు పంపించే వెసులుబాటు ఉందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యయ పరిశీలన నోడల్ అధికారి రామిరెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సహాయ వ్యయ అధికారులు, పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు.