కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల
కమిషనర్ నితేశ్ వ్యాస్
కాళోజీ సెంటర్ : లోక్ సభ ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్ వ్యాస్ అన్నారు. న్యూఢిల్లీ నుంచి పోలింగ్ నిర్వహణపై గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, ఉన్నతాధికారులు, వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ పి.ప్రావీణ్య, సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్ రవణవీర్ చంద్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ పరిశీలకుడు నీవన్ సైనీ, వ్యయ పరిశీలకుడు ఎ.దిలీబన్,ధీరజ్ సింఘా, డీఆర్ఓ శ్రీనివాస్, డీసీపీ అబ్దుల్బారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితేశ్వ్యాస్ మాట్లాడుతూ ఈసీ నిబంధనల ప్రకారం అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 65 శాతం మందికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని, మిగిలిన వారికి సైతం పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్ రవణవీర్చంద్ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించామని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ఝా మాట్లాడుతూ ఈవీఎంల తరలింపు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
5కే రన్ను విజయవంతం చేయాలి
కాళోజీ సెంటర్ : ఓటరు చైతన్యంపై ఈనెల 5న నిర్వహించనున్న 5కే రన్ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికాగుప్తా, జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా యువజన, క్రీడల అధికారి అశోక్కుమార్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, అధికారులతో కలిసి గురువారం 5కే రన్ పోస్టర్ ఆవిష్కరించారు.