నంద్యాల(అర్బన్): ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ఓటు హక్కుపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామన్నారు. 2019 ఎన్నికల్లో నంద్యాల పట్టణంలో 70 శాతం పోలింగ్ జరిగిందని, ఈ విడత ఎన్నికల్లో 85 నుంచి 90 శాతం పోలింగ్ కావాలని సూచించారు. మద్యం, నగదు ఇతర ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. 18–19 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరూ పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో ఓటర్ స్లిప్లు ఇంటింటికీ పంపిస్తామన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలందరి చేత ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి