● కరోనా కష్టకాలంలో ప్రజలకు
భరోసా కల్పించిన బుగ్గన
● సొంత నిధులతో ప్రజలకు మాస్కులు,
శానిటైజర్ల పంపిణీ
● డోన్ ఆసుపత్రిలో
ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
● నాడు పత్తాలేని 50 ఏళ్ల
రాజకీయ ఉద్దండులు
డోన్: ప్రజా క్షేత్రంలో ఉన్న రాజకీయ నేతలు ప్రజల యోగ క్షేమాల కోసం బాధ్యతాయుతంగా పనిచేయడం కనీస ధర్మం. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అదే సమయంలో డోన్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధైర్యాన్ని ఇచ్చి ప్రాణాలు నిలిపారు. లాక్డౌన్ సమయంలో కూడా వీధివీధికి తిరిగి ప్రజల్లో నెలకొన్న ఆందోళనను పారద్రోలేందుకు ప్రయత్నించారు. కరోనా వైరస్ మూలంగా పిట్టల్లా రాలిపోతున్న ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం మండలానికి ఒక క్వారంటైన్ ఏర్పాటు చేయగా, మంత్రి బుగ్గన స్వయంగా ఆ క్వారంటైన్లోని రోగుల యోగ క్షేమాలను నిరంతరం పర్యవేక్షించారు. కరోనా వైరస్ బారిన ప్రజలు పడకుండా స్వీయ రక్షణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన 3 లక్షల మాస్కులు, శానిటైజర్లను సొంత ఖర్చులతో ప్రజలకు పంపిణీ చేశారు. ఎప్పటికప్పుడు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోగుల కోసం 3 వేల బెడ్ల స్థాయి నుంచి 5వేల బెడ్ల స్థాయికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేసేందుకు చొరవ చూపారు. లాక్డౌన్ మూలంగా జీవనోపాధి కరువై తింటి గింజల కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి అభినందనలను అందుకున్నారు. అలాగే వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేశా రు. ఇలా ప్రత్యేకంగా 30 పడకలకు 24 గంటలపాటు నిరంతరంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించే ఏర్పాటు చేశారు. తనవంతు బాధ్యతగా మంత్రి బుగ్గన ప్రజల మధ్యనే ఉంటూ కష్ట సుఖాలు పాలుపంచుకొని మనోధైర్యాన్ని కలిగించి ఆనాడు అండగా నిలిచిన విషయాన్ని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.
నాడు పరార్... నేడు ముసలి కన్నీరు
కరోనా కష్టకాలంలో విలవిలలాడుతున్న నియోజకవర్గ ప్రజలకు మనోధైర్యం కలిగించేందుకు ఇక్కడి నుంచి 50 ఏళ్లు ప్రాతినిథ్యం వహించానని చెప్పుకుంటున్న ఏ ఒక్క నాయకుడు ప్రయత్నించ లేదు. కనీసం కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించే తీరిక కూడా కోట్ల, కేఈ కుటుంబ సభ్యులకు లేకుండా పోయింది. నేడు ఎన్నికల వేళ అదే నాయకులు ఊరూరు తిరుగుతూ ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ మభ్య పెడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందినప్పుడు ప్రజల బాబోగులు పట్టించుకోకుండా ఎక్కడో దాచుకున్న ఆ రెండు కుటుంబాలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.