బనశంకరి: కన్నడనాడు నిప్పుల కుంపటిగా మారుతోంది. రోజురోజుకు ఎండలు భగభగ మండిపోతున్నాయి. చల్లగా ఉంటుందనే బెంగళూరులో మొదటిసారిగా రికార్డుస్థాయిలో 41.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే హడలిపోతున్నారు.
ఉత్తరాన 46 డిగ్రీల పైనే
ఉత్తర కర్ణాటకలో కలబుర్గి, రాయచూరులో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత 46.7 డిగ్రీలకు చేరడం విశేషం. బుధవారం 28 జిల్లాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటేయడంతో జనం సతమతమయ్యారు. ఉత్తర కర్ణాటకలో కొన్ని జిల్లాల్లో 45–46 డిగ్రీలకు చేరి మండే పెనంలా మారాయి. మామూలు కంటే 5–6 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత వస్తోంది. దక్షిణ కర్ణాటక, కరావళి ప్రాంత జిల్లాల్లో ఉష్ణోగ్రత 40 పైగా చేరుకుంది.
18 జిల్లాల్లో రెడ్ అలర్ట్
బెళగావి, బాగల్కోటే, ధారవాడ, గదగ, హావేరి, కొప్పళ, బళ్లారి, కలబుర్గి, విజయపుర, రాయచూరు, చిత్రదుర్గ, దావణగెరె, కోలారు, చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు, తుమకూరు, యాదగిరిలో 6వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపింది.
ఉద్యాననగరిలో కొత్త రికార్డు
41.3 డిగ్రీలతో బెంగళూరులో భానుడు గతంలోని అన్ని రికార్డులను మార్చేశాడు. 2019లో ఇదే నెలలో 39.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి, ఏప్రిల్, మే నెల మూడోవారం వరకు గరిష్ట ఉష్ణోగ్రత 37–38 డిగ్రీలుగా ఉండింది. నగరంలో వేసవిలో సాధారణ ఉష్ణోగ్రత 34–35 డిగ్రీలను మించేది కాదు. కానీ ఇప్పుడు 7 డిగ్రీలపైన ఎగబాకింది. గాలిలో తేమ పడిపోయి రోజురోజుకు ఉష్ణోగ్రత హెచ్చుమీరుతుంది. రానున్న ఐదురోజుల పాటు ఇలాగే ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 41.2 డిగ్రీల తాపం నమోదైంది. మండుటెండలతో ప్రజల్లో తలనొప్పి, వాంతులు, అలసట వంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో విపరీతంగా ఎండలు
బెంగళూరులో 41.3 డిగ్రీల నమోదు
ఇప్పటివరకూ ఇదే అత్యధికం
ఉత్తర కర్ణాటకలోనూ సూర్యతాపం