అనంతపురం: ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో గురువారం బీఎస్ఎఫ్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. పారదర్శక, ప్రశాంత ఎన్నికలే లక్ష్యమని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకెళ్లి చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అంబేడ్కర్ కాలనీ వాసులకు ఓటు హక్కుపై చైతన్యం కలిగించారు. అనంతరం గౌసుల్ వారా వీధిలో ఉన్న మొరార్జీ మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. డీఎస్పీ జి.వీర రాఘవ రెడ్డి, బీఎస్ఎఫ్ అధికారి ధర్మేంద్రసింగ్, 14వ బెటాలియన్ డీఎస్పీ వెంకట రెడ్డి, సీఐలు రెడ్డప్ప, ధరణికిశోర్, నారాయణ రెడ్డి, జయంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బందోబస్తు పటిష్టంగా ఉండాలి
బుక్కరాయసముద్రం: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. గురువారం బీకేఎస్, చెన్నంపల్లి, వెంకటాపురం, కేకే అగ్రహారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలను తరచూ సందర్శించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.