అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లావ్యాప్తంగా 23,532 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ వెల్లడించారు. నిర్దేశించిన తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన గురువారం తెలియజేశారు. ఎన్నికల విధులకు నియమించిన పోలింగ్ అధికారులు,అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వీడియోగ్రాఫర్లు, అదేవిధంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వేతర ఉద్యోగులు, డ్రైవర్లు, క్లీనర్లు, కండక్టర్లు, ఎన్నికల విధుల్లో పనిచేసే ఇతర అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు నియోజకవర్గానికి రెండు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర సేవల ఉద్యోగుల కోసం ఒక పోస్టల్ ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, ప్రభుత్వేతర ఉద్యోగులు తాము ఓటరుగా ఎన్రోల్ అయిన అసెంబ్లీ నియోజకవర్గంలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో, పోస్టల్ ఓటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పించామన్నారు.
● ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు,అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పించామని కలెక్టర్ చెప్పారు. వీరి కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
నిర్దేశించిన తేదీల్లో వెళ్లి ఓటు వేయాలి
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్కుమార్