రాష్ట్ర ప్రత్యేక వ్యయ
పరిశీలకులు నీనా నిగం
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే వ్యయ పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా నియమితులైన నీనా నిగం మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజుతో కలిసి ఎన్నికల వ్యయ పరిశీలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు కేఎస్ రమేష్ భారతి, సత్యేంద్ర సింగ్ మెహరా, రాజేష్ కుమార్ మీనా, జేసీ గణేష్ కుమార్, కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో గంగాధర్ గౌడ్, ఏఎస్పీ సుధాకర్ హాజరయ్యారు. సమావేశానికి ముందుగా జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత కోసం జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగంకు వివరించారు. జిల్లాలోని ఏడు నియోజక వర్గాలు, అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలతో కలిపి మొత్తం 2035 పొలింగ్ కేంద్రాలతోపాటు 22 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు.
ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న , విడుదల చేసిన డబ్బు, మద్యం తదితర అంశాలపై ఆమెకు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఎన్నికలలో పోటీ చేయబోయే ప్రతి ఒక్క అభ్యర్థికి సమాన అవకాశాలు ఉండాలన్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి తదితర బృందాల నిఘా ఏర్పాట్లు, పర్యవేక్షణ చర్యలు బాగున్నాయని, వీటిని ఇలాగే కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లాలో జరిగే ఎన్నికలకు విశేషమైన ప్రాముఖ్యత ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే వ్యయ పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాగా జిల్లాలో ఎన్నికల సన్నద్ధత బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్పెండించర్ కమిటీ సభ్యులు ఆనంద్ నాయక్, నాగరాజ రావు, వెంకటేశ్వర్లు, 16 విభాగాలకు చెందిన నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.