● జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్
వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 13న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలకు ముందురోజు నుంచే సెలవు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఓటరు తన ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పోలింగ్ రోజున సెలవు మంజూరు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి కలెక్టరేట్లోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటువేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫెసిలిటేషన్ సెంటరుకు వచ్చి ఓటు వేసేందుకు ఉద్యోగికి ఒకరోజు ప్రత్యేక సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్) మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.