నేడే ఎన్నికల నోటిఫికేషన్
ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ
ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
25వ తేదీ వరకూ నామినేషన్లకు అవకాశం
పుట్టపర్తి అర్బన్: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న గురువారం విడుదల కానుంది. ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగానే... జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ వెంటనే ఉదయం 11 గంటల నుంచే నామినేషన్లు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎంపీ స్థానానికి కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ..
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల నామినేషన్ల స్వీకరణ ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గానికి మాత్రం కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ కేంద్రంలో 5 నుంచి 9 వరకూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉండడంతో కేంద్రం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థి వెంట వచ్చే కార్యకర్తలు, వాహనాలు ఆర్ఓ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. కేంద్రం సమీపంలో పోలీస్ డిటెక్టర్ను ఏర్పాటు చేసి లోనికి వెళ్లే ప్రతి ఒక్కరినీ చెక్ చేసి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కో అభ్యర్థికి నాలుగు సెట్ల వరకూ అవకాశం..
అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సక్రమంగా పూర్తి చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ఏవైనా తప్పులుంటే మరోసారి నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు అందజేయవచ్చు. వివిధ పార్టీల తరఫున పోటీ చేసే వారికై తే నలుగురు, స్వతంత్ర అభ్యర్థులకై తే పది మంది బలపరిచే వ్యక్తులు అదే నియోజక వర్గానికి సంబంధించిన వారై ఉండాలి. నామినేషన్లో ఏవైనా పొరపాట్లు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అఫిడవిట్లో వివరాలు తప్పుగా నమోదు చేసి ఎన్నికల్లో విజయం సాధించినా... ప్రత్యర్థులు కోర్టులను ఆశ్రయించి ధ్రువీకరిస్తే పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల నామినేషన్ పత్రాల్లో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకే స్వీకరణ..
నామినేషన్ల ప్రక్రియ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 25వ తేదీ వరకూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీ వరకూ గడువు ఉంటుంది. ఓటింగ్ డే మే 13న ఉంటుంది.
144 సెక్షన్ అమలు
నామినేషన్లు దాఖలు చేసే అన్ని ఆర్ఓ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే కేంద్రంలోని అనుమతి ఇస్తాం. వాహనాలన్నీ నామినేషన్ కేంద్రం వంద మీటర్ల అవతలే నిలిపి వేయాలి. 3 వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. – అరుణ్బాబు,
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్