ఎన్నికల కంట్రోల్రూమ్ను పరిశీలించిన అబ్జర్వర్, డీఐజీ అజిత్సింగ్
నరసరావుపేట: పల్నాడు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలకు చేపడుతున్న ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఎన్నికల పోలీస్ అబ్జర్వర్, డీఐజీ అజిత్సింగ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ కంట్రోల్ రూమ్ సందర్శించి ఎన్నికల కమిషన్ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేందుకు జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా జిల్లాలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా వెంటనే ఎస్పీ దృష్టికి తీసుకువచ్చి త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా ఎలక్షన్ కంట్రోల్ రూము ఏర్పాటు చేశారని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఓటర్లు, ప్రజలు ఎలక్షన్ కంట్రోల్ రూమ్కి ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఐజీ, జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. నరసరావుపేట మండలంలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూములను పరిశీలించారు. అక్కడ పోలీసులు చేపట్టిన భద్రత చర్యల పట్ల డీఐజీ సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల తరలింపు, ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ముగిసేంతవరకు పై అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీఐజీ కోరారు.