Sakshi News home page

మహా జాతర షురూ

Published Fri, Mar 8 2024 3:27 AM

Maha Shivratri celebrations in Vemulawada - Sakshi

వేములవాడలో కనులపండువగా మహా శివరాత్రి వేడుకలు 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ

వేలాదిగా తరలివస్తున్న భక్తులు

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్వామి వారికి  పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున ఆ ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఉద యం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాక మొదలైంది.

ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలా బాద్‌ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్న ను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు.

రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అడిషనల్‌ కలెక్టర్‌ గౌతమి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పరిశీలించారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.

Advertisement

homepage_300x250