Sakshi News home page

జూలై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

Published Wed, Jun 8 2022 10:22 AM

Hyderabad: Balkampet Yellamma Kalyanam On July 5th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని జూలై 5న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జూలై 4న ఎదుర్కోళ్లు, 5న అమ్మవారి కళ్యాణం, 6న రథోత్సవం ఉంటుందన్నారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని వసతులూ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

భారీ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాల్లో సివరేజీ లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని వాటర్‌వర్క్స్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. రహదారుల మరమ్మతులను ఇప్పటినుంచే చేపట్టాలని చెప్పారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌ లైన్లను సరిచేయడం, చెట్ల కొమ్మలను తొలగించాలని మంత్రి సూచించారు. అమ్మ వారి దర్శనం, కల్యాణం కోసం ఇచ్చే పాస్‌లను డూప్లికేట్‌కు ఆస్కారం లేకుండా బార్‌ కోడింగ్‌తో కూడిన పాస్‌లను జారీ చేయాలని ఆదేశించారు.

కల్యాణం, రథోత్సవం సందర్భంగా ఆలయం వైపు రహదారులను మూసివేసి వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, పోలీసు అధికారులను ఆదేశించారు. దేవాలయ పరిసరాలలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అయిదు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని డీఎం అండ్‌ హెచ్‌ఓ వెంకటికి సూచించారు. భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ, ఈఓ అన్నపూర్ణ, వాటర్‌వర్క్స్‌ డైరెక్టర్‌ ఆపరేషన్‌ కృష్ణ, సీజీఎం ప్రభు, సికింద్రాబాద్‌ ఆర్డీఓ వసంత, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్, అడిషనల్‌ ట్రాఫిక్‌ డీసీపీ రంగారావు, పంజగుట్ట ఏసీపీ గణేష్‌ పాల్గొన్నారు.
చదవండి: ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది!

Advertisement

homepage_300x250