బాన్సువాడ రూరల్: బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా ఈనెల 4న బాన్సువాడలో భారీ రోడ్షో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రోడ్షోను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మంగళవారం ఆయన బాన్సువాడలోని తన నివాసంలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోగానే కొంతమంది నాయకులు డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. నిజమైన నాయకులు, కార్యకర్తలు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ తనకు అండగానే ఉన్నారన్నారు. ఈనెల 7వ తేదీన కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారని, ఆ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, జంగం గంగాధర్, దాసరి శ్రీనివాస్, మోహన్నాయక్, సంగ్రాంనాయక్, ఎన్.నర్సింలు, కమటాల శ్రీనివాస్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.