చదువుతోనే సమాజంలో గుర్తింపు
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, విద్యార్థినులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే అశించిన ఫలితాలు వస్తాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. హనుమకొండ రాంనగర్లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం, వార్డెన్ 24 గంటలు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఎస్సీడీఓను ఆదేశించారు. వంటమనిషి ఆరు గంటలకే రాత్రి భోజనం వండుతుందని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. కుక్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతిగృహాన్ని రాంనగర్ నుంచి వరంగల్కు మార్చాలని విద్యార్థులు కలెక్టర్ను కోరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు. పరీక్ష ప్యాడ్లు అందజేశారు. తనిఖీల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుమతి, వార్డెన్ హరిత పాల్గొన్నారు.
ఆరెల్లి బుచ్చయ్య ఉన్నత పాఠశాలలో..
ఖిలా వరంగల్: మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment