AP: సీఐ తిట్టాడని కానిస్టేబుల్ రాజీనామా.. కట్ చేస్తే సివిల్స్ ర్యాంకర్గా ఉదయ్..
Published
Wed, Apr 17 2024 11:03 AM
తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టుదలతో ఓ యువకుడు సివిల్స్ ర్యాంకు సాధించాడు. తన కోసం నానమ్మ పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించుకునేందుకు ఎంతో కృషి చేశాడు. తన లక్ష్యసాధనలో సివిల్స్లో 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్కృష్ణారెడ్డి.
వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్కృష్ణారెడ్డి సివిల్స్లో మంచి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. ఉదయ్ ఇంటర్ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు చనిపోయారు. తండ్రి అకాల మరణంతో ఉదయ్, తన సోదరుడు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో వారికి నానమ్మ కొండంత అండగా నిలిచారు. నానమ్మ రమణమ్మ అప్పటి నుంచి ఇద్దరు మనవళ్ల చదువు కోసం కష్టపడ్డారు.
దీంతో, 2013లో ఉదయ్ మొదట కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్లో ఉంటూ సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు. అయితే, తాను కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి, సివిల్స్ ప్రేపర్ అవడానికి గల కారణాలను ఉదయ్ వెల్లడించారు.
Telugu Police Constable resigns police job after humiliation, cracks UPSC
"CI humiliated me in front of 60 policemen. I resigned from the job the same day and started preparing for UPSC Civil Services." - Uday Krishna Reddy (780th rank in 2023 UPSC Civil Services)
కాగా, తాను కానిస్టేబుల్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక సీఐ తనను అకారణంగా 60 మంది పోలీసుల ముందు తిట్టారని చెప్పుకొచ్చారు. తన తప్పు లేకున్నా అలా తిట్టడంతో అదే రోజున ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. దీంతో, అప్పటి నుంచి సివిల్స్కు ప్రిపేర్ అయినట్టు స్పష్టం చేశారు. ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదవినట్టు చెప్పారు. ఐఆర్ఎస్ వస్తుందని.. ఆ జాబ్లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆ సమయంలో సీఐ చేసిన అవమానమే సివిల్స్ సాధించేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు.