breaking news
-
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
అన్నవరం రైల్వేస్టేషన్కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్లోనే తొలిసారిగా టెంపుల్ టౌన్ స్టేషన్లలో ఒకటైన అన్నవరం రైల్వేస్టేషన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ సాధించింది. ఇది డివిజన్లోనే మొదటిది కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ (నాంపల్లి) తర్వాత రెండోదిగా నిలిచింది. ఈ సర్టిఫికెట్ సాధించేందుకు డివిజన్ అధికారులు అన్నవరం రైల్వేస్టేషన్ను ఎంపిక చేశారు. ఆ స్టేషన్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం క్యాటరింగ్ విక్రేతలు, స్టాల్ యజమానులు, సరఫరాదారులకు ఎఫ్ఏఎస్టీఏసీ (ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్)లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కమర్షియల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టేషన్లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్లో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రేతల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఉషోగ్రత నియంత్రణ, వ్యర్ధాల తొలగింపు, తడి–పొడి చెత్త విభజన వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షించేవారు. ప్రారంభంలో ప్రీ–ఆడిట్ నిర్వహించి చివరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐచే ఆరు నెలల పాటు పర్యవేక్షణ, మూల్యాంకనం అనంతరం వారి ప్రమాణాలకు అనుగుణంగా అన్నవరం స్టేషన్కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ వరించింది. ఈ సర్టిఫికెట్ సాధించడానికి కృషిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓ మహ్మతుల్లా, ఇతర అధికారులను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
FSSAI: న్యూస్ పేపర్లో ఆహారం ప్యాక్ చేయొద్దు
న్యూఢిల్లీ: వార్తా పత్రికలను (న్యూస్ పేపర్) ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ పేపర్ను ఆహార పదార్థాల ప్యాకింగ్కు వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. అలాగే, న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నిబంధనల కఠిన అమలుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు న్యూస్ పేపర్ వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమలవర్ధనరావు కోరారు. ‘‘వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్లో ఎన్నో బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఆహారాన్ని కలుíÙతం చేస్తాయి. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రింటింగ్కు వాడే ఇంక్లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని వెల్లడించింది. ‘‘వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను కలిగించొచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వార్తా పత్రికలను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వినియోగించకుండా నిషేధిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2018లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికల్లో సాయంతో తొలగించడాన్ని కొందరు చేస్తుంటారు. ఇలా చేయడాన్ని సైతం చట్టం నిషేధించింది. కస్టమర్ల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్నే ఆహార పదార్థాలకు వినియోగించాలని కమలవర్ధనరావు కోరారు. -
న్యూస్ పేపర్లలో ఆహారం తింటున్నారా? కేంద్ర సంస్థ హెచ్చరిక!
రోడ్డు పక్కన విక్రయించే చిరుతిళ్లు, ఆహార పదార్థాలను సాధారణంగా పాత న్యూస్ పేపర్లలో పొట్లం కట్టి ఇస్తుంటారు. ఇలా న్యూస్ పేపర్లలో ఆహారం తింటే తీవ్రవైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, సర్వింగ్ కోసం న్యూస్ పేపర్లను ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని వ్యాపారులను, వినియోగదారులను కోరింది. ఈ విషయంలో నిబంధనలను పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి రాష్ట్ర ఆహార అధికారులతో ఎఫ్ఎస్ఎస్ఏఐ కలిసి పని చేస్తోంది. ఆహార పదార్థాలను ప్యాకింగ్, సర్వింగ్ చేయడానికి న్యూస్ పేపర్లను ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, ఆహార విక్రేతలను ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో కమల వర్ధనరావు గట్టిగా కోరారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఆహార పదార్థాల ర్యాపింగ్, ప్యాకేజింగ్ చేయడానికి న్యూస్ పేపర్లు ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దీనివల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. న్యూస్ పేపర్లలో ఉపయోగించే ఇంక్ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగించే బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేసి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ప్రింటింగ్ ఇంక్లలో సీసం, ఇతర భారీ లోహాలతో సహా రసాయనాలు ఉండవచ్చని, ఇవి ఆహారంలో కలసి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని వివరించింది. అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధికారక క్రిములు న్యూస్ పేపర్ల ద్వారా ఆహారంలోకి ప్రవేశించి అనారోగ్యాలకు కారణమవుతాయని తెలిపింది. కఠిన నిబంధనలు ఆహార పదార్థాల ప్యాకింగ్కి న్యూస్ పేపర్ల వాడకాన్ని నిషేధించే ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనలు-2018ని నోటిఫై చేస్తూ న్యూస్ పేపర్లను ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్గా ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా వినియోగదారులు, ఆహార విక్రేతలు, వాటాదారులను ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది. సురక్షితమైన, ఆమోదించిన ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్లతో పాటు ఫుడ్-గ్రేడ్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలని సిఫార్సు చేసింది. -
వంట నూనె ఒంటికి మంచిదా? ఎంతవరకు! ఐఐసీటీ మాజీ శాస్త్రవేత్త క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: వంట నూనె వినియోగంపై భిన్న వాదనలు ఉన్నాయి. నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని కొందరు అంటారు. అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారి తీస్తుందని మరికొందరు చెబుతుంటారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు గానుగ (కోల్డ్ ప్రెస్) నూనెనే ఎక్కువగా వినియోగించేవారు. క్రమంగా రిఫైన్డ్ (శుద్ధి చేసిన) ఆయిల్స్ మార్కెట్ను ఆక్రమించాయి. ప్యాకేజ్డ్ నూనెల వినియోగం పెరిగిపోయింది. కొన్నాళ్లకు శుద్ధి చేసిన నూనెలు మంచివి కావనే వాదన మొదలైంది. దీంతో మళ్లీ గానుగ నూనె వినియోగం మొదలైంది. అయితే గానుగ నూనెలే మంచివని, శుద్ధి చేసిన నూనెలు మంచివి కావన్న ప్రచారం ఏమాత్రం సరికాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్ సైంటిఫిక్ ప్యానెల్ జాతీయ చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్ అంటున్నారు. ‘అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకు 2 వేల వరకు కేలరీలు కావాలి. కష్టపడి పని చేసేవారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అయితే అందులో 25 నుంచి 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి..’అని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి నూనె మంచిది, ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 85 శాతం శుద్ధి చేసిన వంట నూనెలే.. ప్రస్తుతం ప్రపంచంలో వాడుతున్న వంట నూనెల్లో 85 శాతం శుద్ధి చేసినవే. రిఫైన్డ్ నూనెల్లో వాడే రసాయనాలు అన్నీ కోడెక్స్ (నాణ్యతా ప్రమాణాలు నిర్ధారించే అంతర్జాతీయ సంస్థ) నిర్ధారించినవే. కోడెక్స్ సహా మన దేశంలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఫారసు చేసిన హాని చేయని రసాయనాల్ని రిఫైనింగ్లో వాడుతున్నారు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా రిఫైన్డ్ ఆయిల్స్ వాడుకోవచ్చు. అందులో విషం ఉంటుందనేది ఏమాత్రం నిజం కాదు. అంతేకాదు కొన్ని గింజల నుంచి గానుగ పద్ధతిలో నూనెను తయారు చేయలేం. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, కుసుమ గింజలనే గానుగ చేసి నూనె తీయవచ్చు. కానీ పామాయిల్, సోయాబీన్ నూనెలను ఆ పద్ధతిలో తీయలేం. వాటిని రిఫైన్ చేయకుండా వాడలేం. ప్రపంచంలో మూడింట రెండో వంతు పామాయిల్, సోయాబీన్ నూనెలనే వాడతారు. మన దేశంలో ఏడాదికి 23 మిలియన్ టన్నుల నూనె వాడతారు. కానీ మనం 8 మిలియన్ టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలినది దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి గానుగ నూనె అందరికీ ఇవ్వలేం. గానుగ నూనె మంచిది కాదని కూడా చెప్పడం లేదు. శుద్ధి చేసిన నూనెలు మంచివి కావని ప్రచారం చేయడమే తప్పు. ఎక్కువ రాదు కాబట్టి గానుగ నూనె ధర ఎక్కువ గింజలను గానుగ ఆడించినప్పుడు వాటి నుంచి నూనె మొత్తం రాదు. దాదాపు 25 శాతం చెక్కలోనే ఉండిపోతుంది. కాబట్టి వాటి ధర ఎక్కువ ఉంటుంది. ఇక శుద్ధి చేసిన నూనెలను తయారు చేసే కంపెనీలు పెద్దమొత్తంలో తక్కువ ధరకు ముడిపదార్థాలు కొంటాయి. పైగా యంత్రాలతో నూనె మొత్తాన్నీ తీస్తాయి. అందువల్ల వాటి ధర తక్కువగా ఉంటుంది. ఇక గానుగ చేసేందుకు వాడే గింజల్లో పుచ్చిపోయినవి ఉంటే వాటి నూనె విషంగా మారుతుంది. ఉదాహరణకు పుచ్చిపోయిన పల్లీలతో నూనె తీస్తే అందులో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతుంది. అయితే అవే గింజలను రిఫైన్ చేస్తే ఎఫ్లాటాక్సిన్ పోతుంది. అప్పుడు అది మంచిదవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే రిఫైన్డ్ నూనెల్లో కల్తీ జరుగుతుందని చెప్పడం నిజం కాదు. ఆమ్లాలు సమాన నిష్పత్తిలో ఉండాలి నూనెల్లో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడూ సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. ఈ మూడూ సమతూకంలో లేకపోతే అనేకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుండాలి. ఒమెగా–3 ఆమ్లాలు అన్ని నూనెల్లో ఉండవు. కేవలం సోయాబీన్, ఆవనూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉంటాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. కాబట్టి ఒమెగా–3 ఉన్న నూనెలను వాడనివారు, ఇతర నూనెలు వాడుతున్నవారు తప్పనిసరిగా అవిసె గింజలు దోరగా వేయించినవి రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది. అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి ఒమెగా–3 లభిస్తుంది. కానీ మన వద్ద నిత్యం చేపలు తినే పరిస్థితి ఉండదు. అలాగే అందరూ చేపలు తినరు. కాబట్టి ఆ ఆమ్లాలున్న నూనెలు వాడాలి. ఆలివ్నూనెలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు దాదాపు 75 శాతం ఉంటాయి. సన్ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్లో 50 శాతం వరకు సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. నూనెల మిక్సింగ్ మంచిది రెండు అంతకంటే ఎక్కువ నూనెలను కలిపి వాడాలి. ఒక నూనెలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు సమాన నిష్పత్తిలో లేనప్పుడు, సమాన నిష్పత్తిలోకి తీసుకొచ్చేలా ఏవైనా రెండు అంతకంటే ఎక్కువ నూనెలు ఇంట్లోనే కలిపి వాడుకోవచ్చు. ప్రతి నూనె ప్యాకెట్ మీద ఆ మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తి ఉంటుంది. మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తితో పాటు నూనెల్లో అతి తక్కువ పరిమాణంలో ఉండే కొన్ని గామా ఒరిజినాల్, టోకోఫిరాల్స్ (విటమిన్–ఈ), పైటోస్టిరాల్ వంటి పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు రైస్బ్రాన్లో ఒరిజనాల్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది. దాదాపు అన్నింటిల్లోనూ పైటోస్టిరాల్ ఉంటుంది. దీనికి కొలెస్టరాల్ తగ్గించే స్వభావం ఉంది. నువ్వుల నూనెలో సిసీమోల్, సిసీమోలిన్ అనే యాంటీæ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ లేబిలింగ్లో చూసుకోవాలి. ప్యాకింగ్పై ఉన్న అధికారిక సమాచారంతోనే దాన్ని వాడాలా లేదా తెలుసుకోవచ్చు. నూనె లూజ్గా అమ్మకూడదు లూజ్ ఆయిల్ అమ్మడం నిషేధం. చట్ట ప్రకారం నేరం. లూజ్ అంటే ప్యాక్ చేయకుండా కొలిచి అమ్మే నూనె. దీనిని కొనకూడదు. ప్యాకేజ్డ్ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకెట్లు, ప్లాస్టిక్ సీసాల్లో విక్రయించే నూనెలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉండాలి. పోషక విలువలు, కొలెస్ట్రాల్ వంటివి ఎంతున్నాయో ముద్రించాలి. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉన్న బ్రాండెడ్ కంపెనీలవే వాడాలి. ప్యాకింగ్ను ట్యాంపరింగ్ చేసినట్లు ఉంటే బ్రాండెడ్ కంపెనీల నూనెలనైనా కొనకూడదు. సైంటిఫిక్ రిఫరెన్స్ లేబిలింగ్ ఉందో లేదో చూసుకోవాలి. గడువు తేదీ కూడా చూసుకోవాలి. లైసెన్స్ లేకున్నా, నిబంధనల ప్రకారం నూనె ప్యాకెట్లపై వివరాలు లేకున్నా ఎఫ్ఎస్ఎస్ఏఐ టోల్ ఫ్రీ నంబర్ (1800112100) కు ఫోన్ చేయవచ్చు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019