breaking news
-
కృష్ణబిలాల అన్వేషణలో
‘టైమ్’ మేగజీన్ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం. మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్స్టీన్ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్ వీలర్ అనే ఫిజిసిస్ట్ ‘బ్లాక్ హోల్’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి. చిన్న చిన్న బ్లాక్హోల్స్ నుంచి అతి భారీ (సూపర్ మాస్) బ్లాక్ హోల్స్ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్’ మేగజీన్లో ‘హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పీపుల్’లో ఒకరుగా నిలిచారు. ఆమె పరిశోధన ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్–రే, సున్యావ్–జెల్డోవిక్ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్ సెంటర్ వారి ‘జీనియస్ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోయంబత్తూరులో జన్మించి... ప్రియంవద రంజరాజన్ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ ‘మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోప్రోఫెసర్గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. -
సమయం ఆదియందు... మెల్లిగా సాగెను...!
ఎంతకూ రాని బస్సు కోసం అసహనంగా ఎదురు చూస్తున్నప్పుడో, చేస్తున్న పని పరమ బోరుగా అనిపిస్తున్నప్పుడో ఎలా ఉంటుంది? టైం అస్సలు సాగడం లేదని అనిపిస్తుంది. కదూ! కానీ ఆదియందు, అంటే బిగ్ బ్యాంగ్ జరిగి, ఆ మహా విస్ఫోటనం నుంచి ఈ మహా సృష్టి పురుడు పోసుకుంటున్న తొలినాళ్లలో సమయం నిజంగానే నింపాదిగా సాగేదట! ఎంతగా అంటే, ఇప్పటి వేగంలో అది కేవలం ఐదో వంతు మాత్రమేనని అంతరిక్ష శాస్త్రవేత్తలు తాజాగా సూత్రీకరించారు...! సృష్టి తొలినాళ్లలో సమయ విస్తరణ (టైం డైలేషన్) తీరుతెన్నులపై సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం జరిపారు. కాసర్స్ అని పిలిచే సృష్టిలోకెల్లా అతి తేజోమయమైన, అత్యంత చురుకైన బృహత్ కృష్ణబిలాల సమూహాలను లోతుగా పరిశీలించారు. దాదాపు 1,230 కోట్ల ఏళ్ల క్రితం కాలం ఇప్పుడు సాగుతున్న వేగంలో కేవలం ఐదో వంతు వేగంతో నడిచేదని తేల్చారు. ఇలా చేశారు: పరిశోధక బృందం తమ అధ్యయనానికి కాసార్స్ను కాలమానినిగా మార్చుకుంది. బిగ్ బ్యాంగ్ తరువాత దాదాపు 150 కోట్ల ఏళ్ల కాల పరిధిలోని మొత్తం 190 కాసర్స్ నుంచి వెలువడే దురి్నరీక్ష్య కాంతులను పరిశోధనలో వాడుకుంది. పలు తరంగధైర్ఘ్యాల్లో వాటి ప్రకాశాన్ని నేడు ఉనికిలో ఉన్న కాసర్స్తో సరిపోల్చారు. కాల ప్రవాహ గతిలో చోటు చేసుకునే కీలక నిర్దిష్ట మార్పుల్లో కొన్ని నేటితో పోలిస్తే అప్పట్లో కేవలం ఐదో వంతు వేగంతో జరిగేవని తేల్చారు. కోటి సూర్య సమప్రభలు... కాసర్స్ అని పిలిచే కాంతిపుంజ సమూహంలోని ఒక్కో కృష్ణ బిలం పరిమాణం అత్యంత భారీగా ఉంటుంది. ఎంతగా అంటే, కొన్ని కృష్ణ బిలాలు సూర్యుని కంటే ఏకంగా కొన్ని వందల కోట్ల రెట్లు పెద్దవి! అవి తమ పరిధిలోకి వచ్చిన ఎంతటి పదార్థాన్ని అయినా అనంత ఆకర్షణ శక్తితో లోనికి లాగేసి అమాంతంగా మింగేస్తాయి. ఆ క్రమంలో లెక్క లేనన్ని వెలుతురు పుంజాలను సృష్టి మూలమూలలకూ వెదజల్లుతుంటాయి. చుట్టూ అనంత కాంతి వలయాలతో వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. ‘కాలమనే కాన్సెప్ట్ మనకింకా పూర్తిగా అర్థమే కాలేదని చెబితే అతిశయోక్తి కాబోదు. కాలం తీరుతెన్నులు, పరిమితులు తదితరాల గురించి కూడా మనకు తెలిసింది బహు స్వల్పం. అందుకే టైం ట్రావెల్ ( భూత, భవిష్యత్తులోకి వెళ్లగలగడం) వంటివి సాధ్యం కాదని చెబితే అది తొందరపాటే అవుతుంది‘ – గెరైంట్ లెవిస్, అధ్యయన బృంద సారథి, సిడ్నీ యూనివర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
మామా.. చందమామా మరింత దూరమా?
చంద్రునితో భూమికి అవినాభావ సంబంధం. భూమికి ఉపగ్రహమైతే మనకేమో ఏకంగా చంద‘మామ’. భూమిపైనా, మనిషితో పాటు జంతుజాలం మీదా చంద్రుని ప్రభావమూ అంతా ఇంతా కాదు. సముద్రంలో ఆటుపోట్లు మొదలుకుని అనేకానేక విషయాల్లో ఆ ప్రభావం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. భూమిపై ప్రాణం ఆవిర్భావానికి చంద్రుడే కారణమన్న సిద్ధాంతమూ ఉంది. మన రోజువారీ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసే పలు కీలక వాతావరణ వ్యవస్థల్లో కూడా భూమి చుట్టూ చంద్రుని కక్ష్య తాలూకు నిర్మితి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అలాంటి చంద్రుడు భూమిపై రోజు తాలూకు నిడివి రోజురోజుకూ పెరిగేందుకు కూడా ప్రధాన కారణమట...! చాలాకాలం క్రితం. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. భూమ్మీద రోజు నిడివి ఎంతుండేదో తెలుసా? ఇప్పుడున్న దాంట్లో దాదాపు సగమే! సరిగ్గా చెప్పాలంటే 13 గంటల కంటే కాస్త తక్కువ!! అప్పట్నుంచీ అది క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉందట! చంద్రుడు క్రమంగా భూమికి దూరంగా జరుగుతుండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు తేల్చారు!! భూమికి చంద్రుడు దూరంగా జరుగుతున్న తీరును శాస్త్ర పరిభాషలో ల్యూనార్ రిసెషన్గా పిలుస్తారు. ఇది ఎంతన్నది అపోలో మిషన్లలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లు ఇటీవల దీన్ని కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు భూమికి ఏటా 3.8 సెంటీమీటర్ల మేరకు దూరంగా జరుగుతున్నట్టు తేల్చారు. అందువల్లే భూమిపై రోజు నిడివి అత్యంత స్వల్ప పరిమాణంలో పెరుగుతూ వస్తోందట. మహాసముద్రాలతో, అలలతో చంద్రుని సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్ లండన్ రాయల్ హోలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్టాం చెబుతున్నారు. ఆయన భూమి, చంద్రుని మధ్య సంబంధంపై చిరకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ‘‘ఇటు భూమి, అటు చంద్రుడు ఎవరి కక్ష్యలో వారు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ వల్ల మహాసముద్రాల్లో ఆటుపోట్లు (అలల్లో హెచ్చు, తగ్గులు) సంభవిస్తూ ఉంటాయి. సదు అలల ఒత్తిడి భూ భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్ప పరిమాణంలో తగ్గిస్తుంటుంది. అలా తగ్గిన శక్తిని చంద్రుడు తన కోణీయ గతి కారణంగా గ్రహిస్తుంటాడు. తద్వారా చంద్రుడు నిరంతరం హెచ్చు కక్ష్యలోకి మారుతూ ఉంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడన్నమాట’’ అని ఆయన వివరించారు. అప్పట్లో రోజుకు రెండు సూర్యోదయాలు ‘‘అప్పట్లో, అంటే ఓ 350 కోట్ల ఏళ్ల క్రితం ఇప్పటి రోజు నిడివిలో ఏకంగా రెండేసి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరిగేవి! ఎందుకంటే రోజుకు 12 గంటలకు అటూ ఇటుగా మాత్రమే ఉండేవి. ఈ నిడివి క్రమంగా పెరుగుతూ వచ్చింది, వస్తోంది’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్ షిల్లర్ యూనివర్సిటీ జెనాలో జియోఫిజిసిస్టుగా చేస్తున్న టామ్ ఈలెన్ఫెల్డ్ వివరించారు. మరో విశేషం ఏమిటంటే, భూమికి చంద్రుడు దూరం జరుగుతున్న వేగం కూడా ఎప్పుడూ స్థిరంగా లేదు. అది నిత్యం మారుతూ వస్తోందట. ఉదాహరణకు 60 కోట్ల ఏళ్ల కింద చూసుకుంటే ఆ వేగం ఇప్పటికి రెట్టింపుండేదట. అంటే అప్పుడు చంద్రుడు భూమికి ఏటా సగటున 7 సెంటీమీటర్లు దూరం జరిగేవాడట! అలాగే ఈ వేగంలో భవిష్యత్తులో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ఈలెన్ఫెల్డ్ చెబుతున్నారు. ‘‘మహాసముద్రాల, ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రపు పరిమాణమే ఇందుకు కారణం కావచ్చు. అది గనక ఇప్పుడున్న దానికంటే కాస్త సన్నగా గానీ, వెడల్పుగా గానీ ఉంటే మూన్ రిసెషన్ వేగంలో పెద్దగా మార్పులుండేవి కావని నా అభిప్రాయం’’ అని చెప్పారాయన. కొసమెరుపు: ఏదెలా ఉన్నా, చంద్రుడు మాత్రం భూమికి ఎప్పటికీ శాశ్వతంగా దూరమైపోడంటూ సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు! ‘‘అలా జరిగేందుకు కనీసం మరో 500 నుంచి 1,000 కోట్ల ఏళ్లు పట్టొచ్చు. కానీ అంతకు చాలాముందే సౌర కుటుంబమంతటికీ మహారాజ పోషకుడైన సూర్యుడే లేకుండా పోతాడు! సూర్యునితో పాటే భూమి, మొత్తం సౌరకుటుంబమే ఆనవాలు లేకుండా పోతాయి’’ అంటూ వారు చమత్కరించారు!! శతాబ్దానికి 1.09 మిల్లీ సెకను పెరుగుతున్న రోజు... చంద్రుడు క్రమంగా దూరం జరుగుతున్న కారణంగా భూమిపై రోజు నిడివి క్రీస్తుశకం 1,600 నుంచి ప్రతి శతాబ్దానికి సగటున 1.09 మిల్లీసెకన్ల మేరకు పెరుగుతూ వస్తోందని తాజా విశ్లేషణలు తేల్చాయి. ఇది 1.78 మిల్లీసెకన్లని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూట్టానికి మిల్లీసెకన్లే అయినా, 450 కోట్ల భూ పరిణామ క్రమంలో రోజు తాలూకు నిడివిని ఇది ఊహాతీతంగా పెంచిందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడు ఒకప్పుడు భూమికి ఇప్పటికంటే చాలా చాలా దగ్గరగా ఉండేవాడని ఇప్పటికే నిరూపితం కావడమే ఇందుకు రుజువని చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రుడు ప్రస్తుతం భూమికి 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల ఏళ్ల కింద ఈ దూరం కేవలం 1,70,000 మైళ్లే ఉండేదని పలు అధ్యయనాల్లో తేలింది! ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉన్నాయి. నాసా తాలూకు చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కృష్ణ బిలం వినిపించింది! వైరల్ వీడియో.. సముద్ర అలల ధ్వనిలా
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉండే కృష్ణ బిలాలు(బ్లాక్ హోల్స్) గురించి మనకు తెలుసు. వాటిలోనుంచి నిరంతరం శబ్దాలు వెలువడుతూ ఉంటాయి. అవి ఎలాంటి శబ్దాలు అన్న సంగతి తెలియదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు ఈ విషయంలో కొంత పురోగతి సాధించారు. బ్లాక్ హోల్ నుంచి చిన్నపాటి ప్రతిధ్వనులను రికార్డు చేసి, స్పష్టమైన శబ్దంగా మార్చారు. ఇందుకోసం సొనిఫికేషన్ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. సంబంధిత శబ్దంతో కూడిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇది భూమికి 7,800 కాంతి సంత్సరాల దూరంలో ఉన్న వీ404 సైగ్నీ అనే బ్లాక్హోల్కు సంబంధించినదని వెల్లడించారు. నాసా విడుదల చేసిన వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. కొన్ని గంటల వ్యవధిలోనే 40 లక్షల మందికిపైగా జనం వీడియోను తిలకించారు. కృష్ణ బిలం శబ్దం కొత్తగా ఉందంటూ నెటిజన్లు పోస్టు చేశారు. ఇసుకపై నుంచి దూసుకొచ్చే సముద్ర అలల ధ్వనిలా ఉందని కొందరు పేర్కొన్నారు. -
కృష్ణబిలం ‘వినిపిస్తోంది’.. ఆడియో క్లిప్ విడుదల చేసిన నాసా
కృష్ణబిలం.. ఆయువు తీరిన తార తనలోకి తాను కుంచించుకుపోయే క్రమంలో ఏర్పడే అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం. సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కాంతితో సహా సర్వాన్నీ శాశ్వతంగా తనలోకి లాక్కుంటుంది. దాని గుండా కాంతి కూడా ప్రసరించలేదు గనక కృష్ణబిలం (బ్లాక్హోల్) ఎలా ఉంటుందో మనం చూసే అవకాశం లేదు. అలాంటి కృష్ణబిలం నాసా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి ‘వినిపించింది’. ఇందుకోసం 2003లో సేకరించిన ఒక కృష్ణబిలం తాలూకు డేటాకు శాస్త్రీయ పద్ధతిలో నాసా శబ్ద రూపమిచ్చింది. దాని కేంద్రం నుంచి అన్నివైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్ద రూపంలోకి మార్చి విడుదల చేసింది. శబ్దం శూన్యంలో ప్రయాణించదన్నది తెలిసిందే. అంతరిక్షం చాలావరకూ శూన్యమయం. కానీ పాలపుంతల సమూహాల్లో అపారమైన వాయువులుంటాయి. వాటిగుండా ప్రయాణించే కృష్ణబిలపు ఒత్తిడి తరంగాలకు నాసా తాలూకు చంద్ర అబ్జర్వేటరీ స్వర రూపమిచ్చింది. ఈ శబ్దం అచ్చం హారర్ సినిమాల్లో నేపథ్య సంగీతం మాదిరిగా ‘హూం’.. అంటూ వినిపిస్తోంది. నాసా విడుదల చేసిన వీడియోలో దీన్ని స్పష్టంగా వినవచ్చు. సైన్స్ను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతోనే ఈ శబ్ద సృష్టి చేసినట్టు నాసా తెలిపింది. ఇదీ చదవండి: మిస్టరీ గెలాక్సీ చిక్కింది
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019