breaking news
-
ప్రజ్ఞానంద, విదిత్ విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఆరో రౌండ్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీ విజయాలు అందుకోగా... దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరిగిన గేమ్లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్లో మహారాష్ట్రకు చెందిన విదిత్ 40 ఎత్తుల్లో గెలుపొందారు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన గేమ్ను గుకేశ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ నాలుగు పాయింట్లతో నిపోమ్నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. మహిళల విభాగం ఆరో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి ఓటమి పాలయ్యారు. హంపి 48 ఎత్తుల్లో లె టింగ్జీ (చైనా) చేతిలో... వైశాలి 29 ఎత్తుల్లో కాటరీనా లాగ్నో (రష్యా) చేతిలో ఓడిపోయారు. -
ముగిసిన అన్నె సంతోష్ అంత్యక్రియలు
కాటారం: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ అలియాస్ శ్రీధర్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం కాటారం మండలం అంకుషాపూర్ జీపీ పరిధిలోని దస్తగిరిపల్లిలో పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పలు సంఘాలు, మాజీ మావోయిస్టు నేతలు అన్నె సంతోష్కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు విప్లవ గీతాలు, నినాదాలతో అంకుషాపూర్ నుంచి దస్తగిరిపల్లిలోని తన ఇంటి వరకు సంతోష్ మృతదేహాన్ని ర్యాలీగా తీసుకువచ్చారు. 23 ఏళ్ల తర్వాత సంతోష్ విగతజీవిగా రావడం చూసి గ్రామస్తులు బోరున విలపించారు. కాగా, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతక్క, సత్యవతి, విరసం నాయకులు బలసాని రాజయ్య, మహేందర్, శంకర్, ప్రగతిశీల నాట్యమండలి కళాకారులు నవత, పౌరహక్కుల సంఘం నాయకుడు వినోద్, ప్రజాఫ్రంట్ నాయకులు కొంరయ్య, రవి, తదితరులు.. సంతోష్కు నివాళులర్పించారు. సాయంత్రం స్వగ్రామం చేరుకున్న సంతోష్ మృతదేహం.. కర్రెగుట్ట అడవుల్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మృతి చెందినట్లు బీజాపూర్ పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కాటారం పోలీసులు సాయంత్రం అధికారికంగా నిర్ధారించారు. సంతోష్ మృతదేహాన్ని గుర్తించడానికి ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రజాప్రతినిధి ద్వారా తల్లిదండ్రులు అన్నె ఐలయ్య, సమ్మక్కను బీజాపూర్కు పంపించారు. వారు ఉదయం అక్కడికి చేరుకునే లోగా సంతోష్గా భావించే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రుల గుర్తింపు కోసం ఉంచారు. వారు తమ కుమారుడే అని గుర్తించడంతో మృతదేహాన్ని అప్పగించారు. దీంతో సంతోష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి సాయంత్రమైంది. కొనసాగిన పోలీసుల నిఘా.. సంతోష్ అంత్యక్రియల సమయంలో అడుగడుగునా పోలీసులా నిఘా కొనసాగింది. ఇంటెలిజెన్స్, సివిల్ పోలీసులు మఫ్టీలో సంతోష్ అంత్యక్రియలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ నిఘా పెట్టారు. -
ముగిసిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ప్రస్థానం
హన్మకొండ: విప్లవ గీతాలకు ఆకర్షితుడై, నమ్మిన సిద్ధాంతం కోసం 23 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్కు చెందిన మావోయిస్టు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మృతి చెందాడు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులతో పాటు కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి.. సంతోష్ మృతిని నిర్ధారించారు. 18 ఏళ్ల వయసులో అడవి బాట.. కాటారం మండలం అంకుషాపూర్కు చెందిన అన్నె సమ్మక్క, ఐలయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె. వారిలో మొదటి కుమారుడు సంతోష్ కాగా, ఇద్దరు కవలలు రామ్ లక్ష్మణ్, కుమార్తె హైమావతి. సంతోష్ బాల్యం తన అమ్మమ్మ ఇంటి వద్ద మహాముత్తారం మండలం దుంపిళ్లపల్లిలో కొనసాగగా 7వ తరగతి వరకు అంకుషాపూర్లో చదువుకున్నాడు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివాడు. పలు కారణాలతో చదువు మానేసిన సంతోష్.. డ్రైవింగ్ నేర్చుకుని జీప్, కారు డ్రైవింగ్కు వెళ్తుండేవాడు. తన 18వ ఏట దుంపిళ్లపల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి పీపుల్స్వార్ విప్లవ రచనలు, గీతాలకు ఆకర్షితుడై వివాహం జరిగి ఆరు నెలలు గడవక ముందే 2001లో అడవి బాట పట్టాడు. గ్రామ పరిసరాల్లోకి అన్నలు వచ్చారనే సమాచారం తెలుసుకున్న సంతోష్.. అక్కడికి వెళ్లి వారితో పాటు వెళ్లిపోయాడు. విషయం తెలియని తల్లిదండ్రులు డ్రైవింగ్కు వెళ్లాడని అనుకోగా ఆ సమయంలో కాటారం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సదానందం గ్రామంలోకి వచ్చి మావోలతో వెళ్లినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. 23 ఏళ్లుగా పలు బాధ్యతల్లో.. 2001లో మావోయిస్టుల్లో చేరిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ 23 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. మొదట దళసభ్యుడిగా, కొన్ని ఏళ్ల తర్వాత అసిస్టెంట్ దళ కమాండర్గా, డివిజనల్ కమిటీ మెంబర్గా బాధ్యతలు నిర్వర్తించారు. సంతోష్ కమిట్మెంట్ను గుర్తించిన మావోయిస్టు అగ్రనాయకత్వం.. ఇటీవల దండకారణ్య తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్తో పాటు సెకెండ్ సీఆర్సీ కమాండర్గా బాధ్యతలు అప్పగించింది. 23 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు పోలీసులకు చిక్కని సంతోష్ శనివారం జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాశాడు. కాగా, ఎన్కౌంటర్లో సంతోష్ మృతి చెందాడనే వార్త ఉదయమే గ్రామంలో విస్తరించింది. బీజాపూర్ పోలీసులు సంతోష్గా నిర్ధారించి స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. సంతోష్ మృతి విషయం గ్రామంలో చక్కెర్లు కొట్టినా తల్లిదండ్రులు మాత్రం ఇందులో చనిపోయింది తమ కొడుకు కాదని ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా వారు ఐనవోలు జాతరకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. సంతోష్ ఫైల్ ఫొటో చూపించినా వారు గుర్తుపట్టలేదు. దీంతో సాయంత్రం వరకు పోలీసులు సైతం సంతోష్ మృతిని నిర్ధారించలేకపోయారు. చివరకు మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో సంతోష్ మృతిని అధికారికంగా నిర్ధారించారు. పేదరికంలో తల్లిదండ్రులు.. వృద్ధులైన సంతోష్ తల్లిదండ్రులు సమ్మక్క, ఐలయ్య పేదరికంలో కాలం వెల్లదీస్తున్నారు. సరైన ఇళ్లు కూడా లేకపోవడంతో గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. చేతికి వచ్చిన కొడుకు 18 ఏళ్లలో అడవి బాట పట్టగా.. రెండో కొడుకు కొంత కాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్న కొడుకు పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నాడు. దీంతో వారు కూలీ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. పోలీసుల సహకారం.. పేదరికంలో కొనసాగుతున్న సంతోష్ తల్లిదండ్రులకు కాటారం పోలీసులు పలుమార్లు సాకారం అందిస్తూ వస్తున్నారు. నిత్యం వారి బాగోగోలు తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తుంటారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసమైన సంతోష్ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు అనేకమార్లు సందేశమందించారు. 22 ఏళ్ల క్రితం చూసినం.. మా కొడుకు అన్నల్లోకి పోయి 23 ఏళ్లు అవుతుంది. 18 ఏళ్లు ఉన్నప్పుడు అన్నల్లోకి పోయిండు. ఏడాది అయినాక ఓ రోజు రాత్రి అన్నలతోని గ్రామంలోకి వచ్చాడు. అప్పుడు చీకట్లో చూసినం. ఇది వరకు ఏ రోజు కూడా మా కొడుకు మొఖం తెల్వదు, మాట తెల్వదు. ఏదో కానరాని అడువుల్లో ఉంటాండు అని వాళ్లు, వీళ్లు చెబుతుంటే విన్నం. ఎప్పుడైన ఇటు దిక్కు వస్తే కాళ్లు పట్టుకొని ఇంటికాడనే ఉంచుకుందామని చూసినం. కానీ ఆ దేవుడు ఒక్కసారి కూడా కనికరించలే. ఏడేళ్ల కిందట పక్క రాష్ట్రంల ఎన్కౌంటర్ జరిగితే పోలీసోళ్లు మమల్ని ఠాణాకు తీసుకుపోయి మీ కొడుకేనా అని ఫొటోలు చూపించిండ్రు. మా కొడుకు కాదని వచ్చినం. ఇప్పుడు కూడా ఫొటోలో గుర్తుపట్టలేం. మా కడుపు గట్టిది అయితే మా కొడుకు బతికి ఉంటడు. లేకపోతే ఆ దేవుడి దగ్గరికి పోతడు. – అన్నె ఐలయ్య, సమ్మక్క -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
ఎంపీ సంతోష్పై కబ్జా కేసు
బంజారాహిల్స్ (హైదరాబాద్): బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్పై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఈ కేసు రిజిస్టర్ కాగా... విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని సర్వే నెంబర్ 129/54, ప్లాట్ నంబర్–4లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కు (ఎన్ఈసీఎల్) 1350 గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని 2010లో కరణ్ దూబే అనే వ్యక్తి నుంచి ఎన్ఈసీఎల్ కొనుగోలు చేసింది. 2023 నవంబర్ 2 వరకు ఈ స్థలం ఎన్ఈసీఎల్కు చెందినదిగానే రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల్లో ఉండటంతో పాటు ఈ మేరకు ఈసీ కూడా జారీ అయింది. 2023 వరకు ఈ స్థలం ఎన్ఈసీఎల్కు చెందినదే అని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఇతర పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇటీవల ఈ స్థలంలో రెండు రూమ్లు నిర్మించినట్లుగా గుర్తించిన ఎన్ఈసీఎల్ ప్రతినిధి చింతా మాధవ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము జీహెచ్ఎంసీలో విచారించగా ఈ స్థలాన్ని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లుగా తెలిసిందన్నారు. సంతోష్ కుమార్తో పాటు లింగారెడ్డి శ్రీధర్ అనే వ్యక్తి కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీ, బోగస్ ఇంటి నంబర్లను తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడని ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే తాము బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారించామని, ఈ నేపథ్యంలోనే జోగినపల్లి సంతోష్కుమార్, లింగారెడ్డి శ్రీధర్లు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తేలిందని చింతా మాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా అందులోకి అక్రమంగా ప్రవేశించి రెండు గదులు నిర్మించడం, జీహెచ్ఎంసీలో ఫోర్జరీ డాక్యుమెంట్లు దాఖలు చేసి బోగస్ ఇంటి నెంబర్లను తీసుకున్న జోగినపల్లి సంతోష్ కుమార్, లింగారెడ్డి శ్రీధర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు వీరిపై క్రిమినల్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019