ఐదేళ్ల పాటు ఇంటి వద్దనే వలంటీర్లు పింఛన్లు అందజేశారు. ఇప్పుడు రెండు నెలల నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు అవస్థలు పడుతున్నాం. మే నెల పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో వేయడంతో డబ్బులు తీసుకునేందుకు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 2019 సంవత్సరానికి ముందు పడిన కష్టాలు గుర్తుకొచ్చాయి. పింఛన్ల పంపిణీలో చంద్రబాబు మాలాంటి వృద్ధులపై కక్ష కట్టడం సరికాదు. – నారాయణ, పింఛన్ లబ్ధిదారుడు,
సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం
ఎందుకు ఇలా చేస్తున్నాడో
వలంటీర్ ద్వారా వేరుగా ఇంటికే ఒకటో తేదీన పింఛన్ ఇస్తుంటే టీడీపీ నాయకులు ఎందుకు అడ్డుకున్నారో తెలియడం లేదు. ముసలోళ్లు బ్యాంకులకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే ఆటో ఖర్చులు ఎవరు ఇస్తారు. నాకు గోస్పాడు బ్యాంక్లో ఖాతా ఉంది. అందులో నా పింఛన్ డబ్బు వేశారని సచివాలయ సిబ్బంది చెప్పారు. వెళ్లాలంటే నాకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముసలోల్లను ఇలా ఇబ్బంది పెట్టే వారికి ఓటుతో గుణపాఠం చెబుతాం.
– సెబాస్టిన్, పసురపాడు, గోస్పాడు మండలం
బాబు ఎంత పని చేశావయ్యా..
మా మనవడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాటు పింఛన్ సొమ్ము కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఠంఛన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికి తీసుకువచ్చి ఇచ్చేవారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇబ్బందులు పడుతున్నాం. బాబుకు మా ఉసురు తగులుతుంది. వలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకుండా అడ్డుకోవడం దారుణం. పింఛన్ తీసుకునేవాళ్లంతా ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతారు. – చింతా సుశీలమ్మ, వెంకటలక్ష్మమ్మ, ఉయ్యాలవాడ
ఆధార్ లింక్ కాలేదట
వలంటీర్లను రాకుండా చంద్రబాబునాయుడు అడ్డుకోవడం బాధాకరం. నాకు ఆత్మకూరు బ్యాంక్లో అకౌంట్ ఉండటంతో పొద్దునే పోయా. రెండు గంటల పాటు క్యూలో ఉండి అడిగితే నా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాలేదని పింఛన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరినీ అడిగాలో దిక్కుతోచడం లేదు. చంద్రబాబుకు పేదలు బాగుపడితే సహించదు. కరివేన నుంచి ఆత్మకూరుకు వచ్చిపోవాలంటే రూ. 50 ఖర్చు అవుతుంది.
– వెంకటలక్ష్మమ్మ, కరివేన,ఆత్మకూరు మండలం