Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
ఛాంపియన్ దేశం
భారత చదరంగ క్రీడావనికి ఇది మరో శుభవార్త. మన దేశం నుంచి మరో చిచ్చరపిడుగు వచ్చాడు. తెలుగు కుటుంబానికి చెందిన దొమ్మరాజు గుకేశ్ పట్టుమని 17 ఏళ్ళ వయసులో ప్రపంచస్థాయిలో సత్తా చాటాడు. అరంగేట్రంలోనే ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) వారి ‘క్యాండిడేట్స్ 2024’లో గెలిచాడు. అదీ... చదరంగపుటెత్తుల్లో చలాకీతనం చూపుతూ, చులాగ్గా గెలిచాడు. కొద్ది నెలల్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ పోటీలకు ఎన్నికయ్యాడు. 138 సంవత్సరాల ప్రపంచ ఛాంపి యన్షిప్ చరిత్రలోనే చిన్న వయసువాడిగా వరల్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. ఒకవేళ ఆ విశ్వవేదిక పైనా గెలిస్తే, అతి పిన్నవయస్కుడైన వరల్డ్ ఛాంపియన్గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఒక్క గుకేశ్ విజయమే కాక భవిష్యత్ ఆశాకిరణాలూ అనేకం ఉండడం గమనార్హం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్, విదిత్, ఆర్. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్లో టాప్ 25లో అయిదుగురు భారతీయ పురుషులే. ఇక, మహిళల ర్యాకింగ్స్లో టాప్ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్ ర్యాకింగ్స్కు వస్తే టాప్ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్ 30 జూనియర్స్ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం. ‘చదరంగంలో భారత్ విశేష కృషి చేస్తోంది. అనతికాలంలో ప్రపంచంలో అగ్రశ్రేణి చదరంగ దేశమవుతుంది’ అని ప్రపంచ మాజీ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ గత ఏడాది వ్యాఖ్యానించారు. ఇప్పుడదే నిజమవుతోంది. నిజానికి, మన దేశంలో చదరంగ క్రీడ ఇంత శరవేగంతో విస్తరించడానికీ, విస్ఫోటనం చెందడానికీ అనేక కారణాలున్నాయి. ఇంటర్నెట్ డేటా ప్యాక్లు చౌక కావడం, మొబైల్ ఫోన్లలో సైతం సులభంగా అందుబాటులో ఉన్న చెస్ యాప్లు వగైరా వల్ల జనసామాన్యంలో ఈ క్రీడ వేగంగా, బలమైన పునాది వేసుకుంటోందని నిపుణుల విశ్లేషణ. ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని పిల్లలు సైతం మెట్రో నగరాల్లోని అత్యుత్తమ కోచ్ల నుంచి ఆన్ లైన్ చెస్ పాఠాలు నేర్చే వీలొచ్చింది. కరోనా అనంతరం ఆన్లైన్ టోర్నమెంట్లు పెరగడం కూడా భారతీయ యువకిశోరాలకు కలిసొచ్చింది. సూపర్ గ్రాండ్ మాస్టర్ల తోనూ, చివరకు ప్రపంచ మాజీ ఛాంపియన్లతోనూ తలపడి అనుభవం, ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించే అవకాశం దక్కింది. అగ్రశ్రేణి క్రీడాకారులు ఆట మానేశాక, కోచ్లుగా మారడమూ కొత్త తరానికి వరమైంది.గ్రాండ్ మాస్టర్లు ఆర్బీ రమేశ్ (ప్రజ్ఞానంద, వైశాలికి కోచ్), విష్ణుప్రసన్న (గుకేశ్కు కోచ్), శ్రీనాథ్ నారాయణన్ (అర్జున్, నిహాల్ సరీన్ల ట్రైనర్), సూర్యశేఖర్ గంగూలీ (విదిత్కు కోచ్) లాంటి వారు, వారి శిక్షణలో ఆరితేరిన ఆటగాళ్ళే అందుకు నిదర్శనం. గ్రాండ్ మాస్టర్లు కాకపోయినప్పటికీ, మంచి చదరంగం ఆటగాళ్ళు దాదాపు 50 వేల మందికి పైగా భారత్లో ఉన్నారని సాక్షాత్తూ ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) డైరెక్టర్ జనరల్ ఎమిల్ సుతోవ్స్కీ అనడం విశేషం. ఇవన్నీ కలసి దేశంలో చదరంగ క్రీడకు సంబంధించిన సువ్యవస్థిత వాతావరణ కల్పనకు దోహదం చేశాయి. ‘ఫిడే’ సహకారంతో టెక్ మహీంద్రా ధనసాయంతో నడుస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ లాంటి టోర్నమెంట్లు సైతం ఆటకూ, ఆటగాళ్ళకూ కొత్త ఉత్సాహం, ఉత్తేజం తెచ్చాయి. వీటన్నిటి ఫలితంగా ఇవాళ 64 చదరపు గడుల ఆటలో భారత్ అపూర్వంగా ముందుకు దూసుకుపోతోంది. ‘ఈ ప్రపంచంలో ఈ క్షణంలో అత్యంత అస్థిరమైనది ఏమిటంటే, చదరంగంలో భారత నంబర్ 1 స్థానం’ అని అజర్బైజాన్కు చెందిన ఓ గ్రాండ్ మాస్టర్ ఈ ఏడాది జనవరిలో ట్వీట్ చేశారు. ఛలోక్తిగా చెప్పినా, చెస్లో నిత్యం కొత్త ప్రతిభావంతులు రంగంలోకి దూసుకువస్తున్న మన దేశంలో ఇప్పుడది అక్షరసత్యం. ఈ ఏడాదిలో ఈ నాలుగు నెలల్లోనే ఆ నంబర్1 కిరీటం మన ఆటగాళ్ళు అయిదుగురి (విశ్వనాథన్ ఆనంద్, గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్) మధ్య ఎప్పటికప్పుడు మారుతూ వచ్చిందంటే మనవాళ్ళలో పెల్లుబుకుతున్న ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. యువజన – క్రీడాశాఖ సమకూరుస్తున్న నిధులు, ఆటగాళ్ళ శిక్షణకు అఖిల భారత చదరంగ సమాఖ్య అందిస్తున్న సహకారం, ప్రైవేట్ సంస్థల సహాయం ప్రతిభను పెంచి పోషించడంలో ప్రధానపాత్ర వహించాయి. ఇవాళ దేశంలో 84 మంది గ్రాండ్ మాస్టర్లు, 124 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, 23 మంది మహిళా గ్రాండ్ మాస్టర్లు, 42 మంది మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారంటే కారణం అదే! దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా రేటింగ్ పొందిన రెగ్యులర్ టోర్నమెంట్ చెస్ ఆటగాళ్ళు న్నారని ఒక లెక్క. ప్రపంచమంతటిలో ఇందరు ప్రతిభావంతులున్నది మన దేశంలోనే! ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ లాంటివారు చిరకాలంగా ఆదర్శంగా నిలవడంతో, ఎంతో మంది చెస్ వైపు ఆకర్షితులయ్యారన్నది నిజం. సమాజంలోని ఆ ధోరణుల్ని గమనించి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగినంత సహాయ సహకారాలు అందించి, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే ఏ క్రీడలోనైనా ఎంతటి అద్భుతాలు చేయవచ్చో భారతీయ చదరంగావని చాటిచెబుతోంది. కఠోర పరిశ్రమతో, కాలగతిలో ఆ ఆటలో ఛాంపియన్ దేశంగా ఆవిర్భవించిన మనం ఈ పాఠాలను ఇతర క్రీడలకూ అనువర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమూ, ఇతర క్రీడా సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తే మన క్రీడాలోకం మరిన్ని శుభవార్తలు అందించడానికి సదా సిద్ధంగా ఉంటుంది! -
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
ప్రమాదపుటంచున...
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ రెండు దేశాల మధ్య నాలుగు దశా బ్దాల పైగా లోలోపల సాగుతున్న కుమ్ములాట బయటపడింది. ముందుగా ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి, ఒక జనరల్ సహా పలువురు సైనికాధికారుల మృతితో అగ్గి రాజుకుంది. ప్రతీకారంగా గత శనివారం ఇరాన్ పంజా విసరడంతో వ్యవహారం ముదిరింది. యుద్ధం ఊసెత్తకపోయినా దెబ్బకు దెబ్బగా టెహరా న్పై తగిన చర్య చేపడుతామంటోంది టెల్ అవీవ్. అసలే అస్థిరతలో మునిగిన పశ్చిమాసియా ఈ శరవేగ పరిణామాలు, వ్యాఖ్యలతో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధంలో చిక్కుకుపోవచ్చు. చాలాకాలంగా ఇరాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలకై పరోక్ష సహకారం అందిస్తూ ప్రాంతీయ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పౌరులపైన, వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఆస్తులపైన ప్రయోగిస్తూ వచ్చింది. అయితే, ఇజ్రాయెల్తో ఎన్నడూ నేరుగా ఘర్షణకు దిగలేదు. తెర వెనుక నుంచి తాను చేసినవి ఒప్పుకోనూ లేదు. ఇజ్రాయెల్దీ అదే పంథా. మూడేళ్ళ క్రితం ఇరాన్కు చెందిన ముగ్గురు అణుశాస్త్రవేత్తల హత్యలో తన పాత్రను ఆ దేశమూ అంగీకరించ లేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులతో గాజా భూఖండం సంక్షోభంలో పడింది. సదరు హమాస్ దాడుల వెనుక ఇరాన్ పాత్ర గురించి కథలు కథలుంటే, అదే అదనుగా పాలెస్తీనీయుల గాజాను ఇజ్రాయెల్ సమూలంగా ధ్వంసం చేసేసింది. ఐరాస సహా ఎవరెన్ని చెప్పినా నెలల తరబడి ఇజ్రాయెల్ ఆగలేదు, గాజాపై దాడులు ఆపనూ లేదు. ఈ నేపథ్యం నుంచి తాజా ఘటనల్ని చూడాలి. చివరకిప్పుడు ఇరాన్ నేరుగా తన గడ్డ మీద నుంచే ఇజ్రాయెల్పై దాడికి దిగింది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎన్నడూ లేనంతటి ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రయోగించిన 360 క్షిపణుల్లో చాలావాటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ల సహకారంతో ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిగా స్వీయ రక్షణ కోసమే తాము దాడి చేశామనీ, విషయం ఇంతటితో ముగిసిందనీ ఇరాన్ అంటోంది. ఇక, క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నందున సంయమనం పాటించి, పరిస్థితి ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా చూడాలని అమెరికా సహా ఇతర మిత్రదేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అభ్యర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరేనన్నట్టు ఉంటూనే, ఇరాన్కు తగిన బదులిస్తామంటోంది. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్లు దేనికది మధ్యప్రాచ్యంలో తమదే పై చేయి అని చూపేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగమే రెండు దేశాలూ ఇప్పుడు దాదాపు నేరుగా కయ్యానికి దిగడం! పశ్చిమాసియాలో పరిస్థితికి ఇరు దేశాల బాధ్యతా ఉంది. ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా పాలెస్తీనా భూభాగాల్ని బలవంతాన దిగ్బంధించి, కథ నడుపుతుంటే ప్రపంచపు పెద్దన్నలెవరూ ఎన్నో ఏళ్ళుగా పెదవి విప్పలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. నిరుడు హమాస్ దాడితో ఇజ్రాయెల్ అహం దెబ్బ తిని, గాజాలో సామూహిక ఊచకోతకు దిగినప్పుడూ అమెరికా సహా ఎవరూ దాన్ని ఆపలేక పోయారు. ఇరాన్ సంగతికొస్తే, అదీ ఇష్టానుసారం వ్యవహరించింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటివన్నీ అది పరోక్షంగా పోషిస్తున్న పాములే. కొన్నేళ్ళుగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ పరోక్ష సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ తీవ్ర వాద మూకలను నిలువరించడమే ఇజ్రాయెల్, అమెరికాల పని అయింది. వెరసి, ఇరాన్, ఇజ్రాయెల్ల తప్పిదాలు, స్వార్థంతో పక్కన చేరిన దేశాలతో పశ్చిమాసియా చిక్కుల్లో పడింది. తాజా ఘటనలతో యుద్ధం అంచున నిల్చుంది. ప్రతి యుద్ధం ప్రపంచంలో అనిశ్చితిని పెంచేదే. మరీ ముఖ్యంగా, ప్రపంచానికి ఇంధన భాండా గారం లాంటి పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారితే ఇక చెప్పేదేముంది! తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ – ఇజ్రాయెల్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొన్నది అందుకే! వ్యవహారాన్ని తెగేదాకా లాగి, ప్రపంచం రెండు శిబిరాలుగా చీలితే కష్టం. ఇరాన్ దాడితో పని లేకుండా గాజాలో యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అంటే, ఇరాన్ – ఇజ్రాయెల్ సంక్షోభం ముగియనే లేదని స్పష్టమవుతోంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం బరిలోకి దిగి, ముందు గాజాలో దాడులు, పాలెస్తీనాలో అమాయక పౌరుల మరణాలు ఆగేలా చూడాలి. ఇజ్రాయెల్కు 66 శాతం మేర ఆయుధాలిస్తున్న అమెరికా, అలాగే ఇతర ఆయుధ సరఫరా దేశాలు తమ సరఫరాలు తగ్గించగలిగితే మేలు. అంతకంతకూ అంతర్జాతీయంగా తాను ఒంటరి అవుతున్నానని ఇజ్రాయెల్ గుర్తించాలి. ‘అబ్రహమ్ ఒడంబడికల’ ద్వారా మితవాద అరబ్ దేశాలు నెయ్యానికి ముందుకు రావడంతో దానికి కలి గిన ప్రయోజనం పోతుంది. అయినా, ఇంతకు ముందు, ఇకపైన కూడా మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లు రెండు ప్రధాన సైనిక శక్తులు. ఇరుపక్షాలూ లక్ష్మణరేఖ దాటాయి. వాటి మధ్య ఘర్షణ చివరకు యుద్ధంగా పర్యవసిస్తే అది రెంటికీ నష్టమే. కాబట్టి, మంకుపట్టు వీడి, వెనక్కు తగ్గాలి. ప్రస్తుత ఉద్రిక్తతను చల్లార్చాలి. పొంచివున్న పెను యుద్ధం ముప్పును నివారించాలి. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు కొనసాగితే, ప్రపంచ చమురు సరఫరాలు సైతం అస్తవ్యస్తమై, ధరలు పెరుగు తాయి. రష్యా నుంచి చమురు సరఫరా కోసం ఎర్రసముద్రంపై ఆధారపడే మన దేశానికీ ఇబ్బందే. భారత్ సూచించినట్టు మళ్ళీ దౌత్యమార్గాన్ని ఆశ్రయించడమే అన్ని వివాదాలకూ పరిష్కారం. -
సంకల్పం సరిపోతుందా?
కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్కు దేశం సిద్ధమవుతున్న వేళ పాలక బీజేపీ తన ‘సంకల్ప పత్రం’తో ముందుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక రాగల అయిదేళ్ళలో తన ప్రణాళికలు ఎలా ఉంటాయో ప్రజల ముందు ఉంచింది. దశాబ్ద కాలంగా ఢిల్లీ గద్దెపై ఉంటూ, రాజకీయాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సైతం అందుకు తగినట్టే సాగింది. విశేష ప్రజాకర్షక పథకాల జోలికి పోలేదు. ప్రస్తుత విధానాల కొనసాగింపునే ప్రధానంగా ఆశ్రయించింది. పార్టీ కన్నా ప్రధాన రథసారథికే అధిక ప్రాధాన్యమిస్తూ, ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ ప్రచారం చేస్తోంది. ఇది మునుపెన్నడూ కాషాయపార్టీలో కనిపించని చిత్రం. ఎన్నికల్లో విజయం కోసం మోదీపై ఆ పార్టీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రచారంలో ప్రతిచోటా ప్రవచిస్తున్న ‘వికసిత భారత్’ స్వప్నానికి అనుసంధాయకంగా అభివృద్ధి, ప్రాథమిక వసతి కల్పన, సంక్షేమం, విద్య, పారిశ్రామిక రంగం, అంకుర వ్యవస్థ, ఉత్పాదక రంగం, రైల్వే వగైరాలకు సంబంధించి ‘మోదీ గ్యారెంటీ’లను ఈ మేనిఫెస్టోలో జొప్పించడం విశేషం. వరుసగా మూడోసారి సైతం తమ పార్టీకి అధికార పగ్గాలు దక్కడం ఖాయమన్న ఆత్మవిశ్వాసంతోనో ఏమో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను కొనసాగిస్తే చాలనే భావన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించింది. గడచిన కేంద్ర బడ్జెట్లో ఎన్నికల ముందస్తు వరాలు కురిపించకుండా ఆర్థికంగా పొదుపు మంత్రాన్ని పఠిస్తూ, పాత విధానాల కొనసాగింపునే కమలనాథులు ఆశ్రయించారు. ఇప్పుడీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే ధోరణిని అనుసరించారు. ప్రజల నుంచి వచ్చిన దాదాపు 15 లక్షల దాకా సూచనలను పరిగణనలోకి తీసుకొని, ‘వికసిత భారత్’ స్వప్నానికి అనుగుణంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని బీజేపీ చెబుతోంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి దిశానిర్దేశంగా ఈ ‘సంకల్ప పత్రం’ పనిచేస్తుందని కమలనాథుల ఉవాచ. వచ్చే 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా, విశ్వశక్తిగా మారుస్తామనేది వారు చూపిస్తున్న సుందర స్వప్నం. మోదీ ఆదివారం విడుదల చేసిన ఈ ‘సంకల్ప పత్రం’ ఇప్పటికే సర్కారు అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకం, సురక్షిత మంచినీటి సరఫరా, గృహనిర్మాణం లాంటి దారిద్య్ర నిర్మూలన పథకాలను ఏకరవు పెట్టింది. గత పదేళ్ళలో 25 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడేశామనీ, సామాజిక న్యాయానికి కట్టుబడి ఇతర వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, దళితులకు ప్రభుత్వంలో భాగం కల్పించామని చెప్పుకుంది. అదే సమయంలో ఈ ‘సంకల్పం’లో కొన్ని వివాదాలూ ఉన్నాయి. ఈసారి ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ ప్రారంభం చేసి చూపిన బీజేపీ మూడోసారి గద్దెనె క్కితే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తేవాలని చూస్తోంది. అయితే, తెలివిగా యూసీసీ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’, సార్వత్రిక ఎన్నికల జాబితా తదితర విస్తృత చర్చనీయాంశాలను తన సైద్ధాంతిక ఎంపికలుగా కాక, సుపరిపాలనకు తప్పనిసరి అన్నట్టు చిత్రిస్తూ మేనిఫెస్టోలో పెట్టింది. అదే సమయంలో 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న వివాదాస్పద ‘పౌరుల జాతీయ చిట్టా’ అంశాన్ని ఈసారి ప్రస్తావించలేదు. వ్యవసాయ చట్టాలపై ఎదురుదెబ్బ తగిలేసరికి, ఈ తడవ వాటి ఊసెత్తకుండా జాగ్రత్తపడింది. రైతులకు గట్టి హామీలివ్వకుండా దాటేసింది. ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ల ఎన్నికల వాగ్దానపత్రాలను విశ్లేషకులు సహజంగానే పోల్చి చూస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టో విధానాల కొనసాగింపు ధోరణిలో సాగితే, కాంగ్రెస్ మేని ఫెస్టో ప్రజాకర్షక బాటన నడిచింది. ముందుగా ప్రకటించిన కాంగ్రెస్ది ‘న్యాయ్ (గ్యారెంటీల) పత్రం’ అయితే, ఆనక వచ్చిన బీజేపీది ‘సంకల్ప పత్రం’. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్లు అయిదు ప్రధానాంశాలుగా, 25 గ్యారెంటీలతో కాంగ్రెస్ ముందుకొచ్చింది. మహిళలు, యువతరం, అణగారిన వర్గాలు, రైతులు... ఈ నాలుగు వర్గాలూ దేశాభివృద్ధికి నాలుగు స్తంభాలని బీజేపీ సంకల్పం చెప్పుకుంది. కనీస మద్దతు ధరకు ‘చట్టపరమైన గ్యారెంటీ’ ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంటే, బీజేపీ మాత్రం పంటలకు కనీస మద్దతు ధరల్ని ‘ఎప్పటికప్పుడు’ పెంచుతామన్నదే తప్ప, చట్టంగా భరోసా ఇవ్వలేదు. కులగణనకు కాంగ్రెస్ కట్టుబడితే, అలాంటి డిమాండ్లపై బీజేపీ తన అభిప్రాయం పంచుకోనే లేదు. రెండు మేనిఫెస్టోల్లో కొన్ని మంచి విషయాలూ లేకపోలేదు. రాగల అయిదేళ్ళలో వ్యవసాయ పరిశోధనలకు రెట్టింపు నిధులిస్తామన్నది కాంగ్రెస్ వాగ్దానం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద త్వరితగతిన చెల్లింపులు జరుపుతామనీ, పంట నష్టాన్ని మరింత కచ్చితంగా అంచనా వేసేలా సాంకేతికతను వినియోగిస్తామనీ బీజేపీ హామీ ఇస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ రెండు పార్టీలూ వ్యవసాయ రంగానికి సరైన దిశానిర్దేశంలో విఫలమయ్యాయి. నీరు, ఎరువులు, ఇంధనాలను తక్కువగా వినియోగిస్తూనే ఎక్కువ దిగుబడి లాంటి వాటిపై అవి దృష్టిపెట్టలేదు. ఇక, సాంస్కృతిక జాతీయవాదంతో తమిళుల్ని ఆకర్షించేలా ‘తిరువళ్ళువర్ సాంస్కృతిక కేంద్రాల’ ఏర్పాటు, సామా న్యుల సాధారణ రైలు ప్రయాణ కష్టాల్ని పక్కనబెట్టి ఖరీదైన ‘వందేభారత్ రైళ్ళ’ విస్తరణ లాంటివి బీజేపీ అనవసర ప్రాధాన్యాలే. దేశంలో ప్రస్తుత ప్రధాన సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల అని సర్వేలన్నీ తేల్చినందున ఏ పార్టీ అయినా వాటిపై దృష్టి పెట్టడం ప్రయోజనం. ఆ మాటకొస్తే ఓటర్లను ఆకర్షించడమే కీలకమైన ఎన్నికల్లో, మేనిఫెస్టోలను తప్పనిసరిగా అమలు చేసి తీరాలన్న చట్టం లేని భారత్లో... ‘సంకల్పం’ శుష్కవచనమైతే నిష్ప్రయోజనం. -
కుట్రదారుల పనిబట్టాలి!
ప్రారంభమైంది మొదలు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు పోటెత్తుతున్న జనవాహినిని చూసి పుట్టగతులుండవని ఎంచిన ప్రత్యర్థులు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పన్నిన కుట్ర వెంట్రుకవాసిలో భగ్నమైంది. పైనున్న దేవుడి ఆశీస్సులూ, అశేష ఆంధ్ర ప్రజానీకం ఆశీర్వాదాలూ తనకు పుష్కలంగా వున్నాయని జగన్ తరచు చెబుతుంటారు. విజయవాడ సింగ్ నగర్లో గుర్తుతెలియని దుండగులు చీకటిచాటున పదునైన వస్తువును గురిచూసి ప్రయోగించినప్పుడు అదే రుజువైంది. నేరుగా కణతకు గురిపెట్టి హాని తలపెట్టాలన్న ఉన్మాదుల పన్నాగం ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగటంతో త్రుటిలో తప్పింది. ఎడమకన్ను పైభాగాన గాయమైంది. పక్కనే వున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సైతం ఈ దాడిలో గాయపడ్డారు. అంతక్రితం పాలనానుభవం లేని ఒక ముఖ్యమంత్రి అయిదేళ్ల అనంతరం ‘మీ ఇంట్లో మంచి జరిగుంటేనే ఓటేయండి’ అని అడుగుతుంటే ఇంత పెద్దయెత్తున ప్రజలు ఎదురేగి నీరాజనాలు పట్టడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే కూటమి నేతలు తట్టుకోలేకపోయారు. ఎడమవైపు కనుబొమ్మ పైభాగాన లోతుగా పడిన గాయం బాధిస్తున్నా... వాపు పూర్తిగా తగ్గకపోయినా జగన్ సోమవారం యధావిధిగా కొనసాగించిన బస్సుయాత్రకూ, గుడివాడలో నిర్వహించిన బహిరంగసభకూ మరిన్ని రెట్లు ఎక్కువగా జనవాహిని తరలిరావటం గమనించాక త్రికూటమికి, ప్రత్యేకించి టీడీపీకి తత్వం బోధపడి వుండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్నీ, పార్టీనీ కబ్జా చేసినప్పటికన్నా చాలా ముందే చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య, కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హతమార్చటం, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం వగైరాల్లో బాబుపై ఆరోపణలు రావటం యాదృచ్ఛికం కాదు. కేంద్రంలో తొలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వాజపేయి అంతటి నాయకుడే బాబు తీరుతెన్నులు గమనించి దిగ్భ్రాంతి చెందేవారని ఆ రోజుల్లో కథనాలొచ్చేవి. తెరవెనక పావులు కదపడం, జరిగింది ఒకటైతే బయటకు వేరేలా చూపటం, మంచిని తన ఖాతాలో వేసుకుని, పొరపాట్లు అవతలివారిపై రుద్దటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఫలానావారిని ప్రధానిని చేశాను... ఇంకొకరిని రాష్ట్రపతిని చేశాను అని చెప్పుకోవటం ఆయనకు అలవాటైన విద్య. రాజకీయాల్లో శత్రువులుండరని, ప్రత్యర్థులు మాత్రమే వుంటారని ఇన్నేళ్ల అనుభవం తర్వాత కూడా బాబు గ్రహించలేకపోయారని ఆయన తరచుగా మాట్లాడే మాటలు, చేసే ప్రసంగాలు రుజువు చేస్తున్నాయి. కనీసం ఈ అవసాన దశలోనైనా నలుగురికీ ఆదర్శంగా వుండాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా మరింత అధమస్థాయి రాజకీయాలు చేసే సినీ నటుడు పవన్ కల్యాణ్ను వెంటేసుకుని ఆయన ఉన్మాదిలా రెచ్చిపోతున్న తీరు అందరికీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. సరిగ్గా ముఖ్యమంత్రిపై దాడి జరగడానికి కొన్ని గంటల ముందు తాడికొండలో బాబు చేసిన ప్రసంగమే అందుకు తార్కాణం. ‘ప్రతి ఒక్కరూ రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని ఆ దున్నపోతుపై దాడి చేయండి’ అంటూ ఆయన రెచ్చగొట్టారు. సొంత పార్టీ కార్యకర్తలను ఇలా గూండాలుగా, హంతకు లుగా మార్చాలనుకోవటం ఏ మార్కు రాజకీయమో ఆయనకు అవగతమవుతున్నట్టు లేదు. వయసు ముదిరిన ఈ దశలో బాబుకు పరిణతి రావటం అసంభవం. కనీసం చట్టమైనా దుండ గులను శిక్షించగలిగితే ఇతరులకు జ్ఞానోదయమవుతుంది. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేయదు’ అంటారు. రాజకీయాల్లోకొచ్చి దాదాపు పదేళ్లవుతున్నా, ఒకటి కాదు– రెండు మంత్రి పదవులు వెలగబెట్టినా ఏ భాషలోనూ తప్పుల్లేకుండా పలకడంరాని లోకేష్ వంచనలో, వాచాలత్వంలో మాత్రం తండ్రిని మించారు. ఇలాంటివారంతా ప్రజాస్వామ్యం మాటున వీరంగం వేస్తుంటే అవాంఛనీయ ఉదంతాలు జరగటంలో ఆశ్చర్యమేముంది? ఏం నేరం చేశారు జగన్? ఏ పథకం పెట్టినా దళారుల భోజ్యంగా మారే తీరును సమూలంగా మార్చారు. వాలంటీర్ల వ్యవస్థను నెలకొల్పి నేరుగా నిరుపేదల ముంగిటకే పథకాలు వెళ్లే సరికొత్త విధానం తీసుకొచ్చారు. గ్రామసచివాలయాలు ఏర్పాటుచేశారు. ఇళ్లులేని పేదలను గుర్తించి దరఖాస్తు చేయించి రూ. 10 నుంచి 15 లక్షల విలువైన ఆస్తుల్ని కట్టబెట్టారు. వాగ్దానం చేసిన నవరత్నాలే కాదు... మరిన్ని పథకాలు ప్రజలకందించారు. విద్య, వైద్యరంగాల ప్రక్షాళనకు నడుం బిగించారు. రైతుభరోసా కేంద్రాలు నెలకొల్పారు. రైతులకు అండగావున్నారు. విలేజ్ క్లినిక్లు, ఆరోగ్యశ్రీ తదితరాలతో జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి నేతను దుర్భాషలతో, దుశ్చర్యలతో ప్రజలకు దూరం చేయాలని చూడటం తెలివితక్కువతనమని ఆ ముఠాకు మరో నెలరోజుల్లో అర్థమవుతుంది. సత్సంకల్పంతో రాజకీయాలు నెరపేవారినీ, మంచి పాలన అందిస్తున్నవారినీ ప్రజలనుంచి వేరుచేయటం అసాధ్యం. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా బస్సు యాత్ర పొడవునా బడి పిల్లలు మొదలుకొని వృద్ధులవరకూ అన్ని తరాలవారూ, అన్ని వర్గాలవారూ కనబడటం జగన్ మంచి పనులకు నిదర్శనం. విజయవాడ దురంతం వెనకున్న సూత్రధారులనూ, పాత్రధారులనూ సత్వరం బంధించి, కఠినశిక్ష పడేలా చేసినప్పుడే హత్యారాజకీయాలకు అడ్డుకట్టపడుతుంది. నాయకులు బాధ్యతాయుతంగా మెలగటం నేర్చుకుంటారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019