breaking news
Ad - Sakshi_Home_Sticky
-
మేం 10 సీట్లు గెలిస్తే పాలిటిక్స్లో మార్పులు: కేటీఆర్
అలంపూర్: కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని సంకల్పిస్తే, దురదృష్టవశాత్తు 39 సీట్లలోనే గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 14 సీట్లలో వెయ్యి, రెండు, నాలుగు వేల తేడాతో ఓడిపోయామని, ఆ 14 సీట్లు గెలిచి ఉంటే మన దే ప్రభుత్వం ఉండేదని చెప్పారు. లేదా వాటిలో ఆరు సీట్లు గెలిచినా ప్రధాన పాత్ర పోషించేవారమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్కు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో, అలంపూర్ చౌరస్తాలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘సీక్వెల్ సినిమాల తరహాలో పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం రేవంత్రెడ్డి సీక్వెల్ మోసంతో రెడీగా ఉన్నారు. రేవంత్రెడ్డి మోసం పార్టు–1లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మీలో ఎవరైనా రుణాలు తీసుకోని వారు ఉంటే పరుగు పరుగునపోయి లోన్లు తీసుకోండి.. అని చెప్పిన ఆయన మే 9 వస్తున్నా రుణమాఫీ చేయలేదు. మోసం పార్ట్–2లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు’ అని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అవన్నీ ఇచ్చి మాట్లాడు.. ‘మొగోడివైతే ఒక్క సీటు గెలవమని మన పార్టీ గురించి మాట్లాడుతున్న రేవంత్రెడ్డి భాషలోనే అడుగుతున్నా... నీవు మొగోనివైతే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. మొగోడివైతే కోటీ 67 లక్షల ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వు. కేసీఆర్ ఒకరికే ఇస్తున్నాడు నేను ముసలవ్వకి ముసలాయనికి ఇద్దరికీ రూ.4వేలు ఇస్తానని చెప్పావు కదా.. మొగోడివైతే 46 లక్షల మందికి ఆసరా పింఛన్ ఇచ్చి మాట్లాడు’ అని కేటీఆర్ అన్నారు. మొన్న మహబూబ్నగర్కు వచ్చి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని ఒక సీఎం మాట్లాడని మాటలు రేవంత్ మాట్లాడారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘సూర్యాపేటలో రష్ ఉన్న బస్సులో ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా.. ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు జేబులు వెతికితే కత్తెర దొరికిందని అడిగితే.. సీఎం రేవంత్రెడ్డి కూడా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయను పట్టుకోండి సార్ అని చెప్పారు’ అని చమత్కరించారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికేమీ లేదు.. బీజేపీ వాళ్లు అక్కడక్కడ ఎగురుతున్నారని, పదేళ్లలో రాష్ట్రానికి మోదీ చేసిందేమి లేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ వాళ్లు చెప్పుకోవడానికి ఏవీలేదని, అందుకే జైశ్రీరాం అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. శ్రీరాముడు బీజేపీకి ఒక్కడే దేవుడు కాదని.. ఆయన అందరి వాడన్నారు. దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్లను నమ్మి మోసపోవద్దు: కేటీఆర్ రాజేంద్రనగర్ (హైదరాబాద్): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజేంద్రనగర్లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని ముందుకొస్తోందని... కాంగ్రెస్ దొంగ హమీలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి వచ్చిందన్నారు. రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అందుకే చేవెళ్ల పార్లమెంటులో మొదటిసారిగా బడుగు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాందీ, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు. రేవంత్ నిజం చెప్పారు సాక్షి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కిండు రేవంత్... అయితే తప్పు రేవంత్రెడ్డిది కాదు... ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా, నిజాయితీగా చెప్పిండు ఎన్నికలకు ముందు టీవీ చర్చా వేదికల్లో. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు... ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు... అందుకే మేం మోసం చేస్తాం అని చెప్పారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్, హనుమకొండలో మంగళవారం జరిగిన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. తప్పు ఎవరిదన్నా ఉందంటే మనదే తప్ప ఇంకెవరిదీ కాదన్నారు. -
రుణమాఫీ చేస్తా.. బీఆర్ఎస్ రద్దు చేస్తావా?: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, నాగర్కర్నూల్/కోస్గి/మద్దూరు: ‘జోగుళాంబదేవి సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోపు ఆరునూరైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. అదే రోజు నువ్వు, నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? నా రాజీనామా కాదు. నీ పార్టీ రద్దుకు సిద్ధంగా ఉండండి’అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే మాజీమంత్రి హరీశ్రావు తన సవాలును స్వీకరించాలని చెప్పారు. మంగళవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారా యణపేట జిల్లా మద్దూరులో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, అనంతరం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలకేంద్రంలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర భారీ బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతానని, రేవంత్రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటూందో నీ మామ కేసీఆర్ను అడుగు..ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రంలో రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, పదవి తీసుకున్న నాలుగు నెలల్లో నీ మామ చేసిన లక్షల కోట్ల అప్పులకు రూ. 26వేల కోట్ల కిస్తీలు చెల్లిస్తూ.. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నాం. కావాలంటే లెక్కలతో సహా నీకు, నీ మామకు చూపడానికి మేము సిద్ధంగా ఉన్నాం’అంటూ తనదైన శైలిలో మాజీ మంత్రి హరీశ్రావుపై మండిపడ్డారు. రుణమాఫీతోపాటు వచ్చే పంటకే వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. దొంగలకు సద్ది మోస్తున్నరు.. పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చి పదేళ్లలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కుర్చీ వేసుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఫామ్హౌస్లో పడుకున్నాడని చెప్పారు. పగోడి చేతులో చురకత్తులుగా మారి, ఇక్కడి నాయకులు దొంగలకు సద్ది మోస్తున్నారని మండిపడ్డారు. తమను రేవంత్రెడ్డి తిడుతున్నారని అరుణమ్మ, ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అంటున్నారని.. వారితో తనకేం తగాదా, పంచాయితీ లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సుముఖంగా ఉన్నప్పుటికీ మంత్రిగా ఉన్న డీకే.అరుణ నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు రాకుండా ప్రాజెక్టులను అడ్డుకున్నది వాస్తవం కాదా.. మరోమారు నరేంద్రమోదీ చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పోడుస్తున్నావంటూ ప్రశ్నించారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఈ ఐదేళ్లు రాజకీయాలకతీతంగా జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో దేశంతో పోటీపడేందుకు తనకు సహకరించాలని కోరారు. అభివృద్ధి ఆలోచన చేయకుండా కాళ్లలో కట్టెలు పెట్టడం ధర్మమా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు ఓటేస్తే.. మోదీకి అమ్ముకుంటడు.. ‘ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కేసీఆర్ ఇబ్బందులు పెడితే మేం అండగా ఉన్నాం. ప్రజాజీవితంలోకి వచ్చి దొరలకు వ్యతిరేకంగా ప్రవీణ్కుమార్ పోరాటం చేశాడు. ఆరు నెలల్లో ఏం మారింది.. ఎందుకు కేసీఆర్ను నమ్ముతుండో సమాధానం చెప్పాలి. 4 కోట్ల మంది తిరస్కరించి కేసీఆర్కు గొయ్యి తవ్వితే, ఆ సమాధికి పూలదండలు వేసి భుజాలపై మోస్తున్నవు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశాడు. ఆయనతో చేరిన నువ్వు వర్గీకరణకు వ్యతిరేకమా? ఏనుగు తిరిగి దోమ దగ్గరకు ఎందుకు పోయిందో చెప్పాలి. దోమకు ఎంతపెద్ద తొండం ఉన్నా ఏనుగు అవుతుందా’అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నామని, కానీ ఎందుకు తిరస్కరించారో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవీణ్కుమార్ డీజీపీ అయ్యేవారని, ముఖ్యమంత్రి స్థాయి పదవితో గౌరవించుకునే వారమని చెప్పారు. సన్’స్ట్రోక్ దెబ్బతో ఎంపీ రాములును ఆయన కొడుకు పదవి కోసం ఇంట్లో పెట్టి తాళం వేస్తే.. బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఓటేస్తే తిరిగి మోదీకే అమ్ముకుంటాడని, గత పదేళ్లలో ప్రతిసారి ఈ కేడీ మద్దతు పలికింది మోదీకే కదా అని వ్యాఖ్యానించారు. పాలమూరు అభివృద్ధి నా జీవితాశయం.. పాలమూరులో తనకు ఎవరూ శత్రువులు లేరని, తనకెవరూ పోటీ కాదని చెప్పారు. పాలమూరు జిల్లా అభివృద్ధి తన జీవిత ఆశయమన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు ఖర్చయినా నాలుగున్నర ఏళ్లలోనే పూర్తిచేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులును ఎంపీలుగా గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏ గ్రూపులోకి, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే పని కోసం తనకు సహకారం అందించాలని రేవంత్రెడ్డి చెప్పారు. – మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించి రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన పాలమూరు ప్రజలు తనను కూడా ఎంపీగా ఆశీర్వదిస్తే.. ముఖ్యమంత్రికి సోదరుడిగా రేవంత్రెడ్డి గొంతుకనై ఢిల్లీలో పాలమూరు ప్రజల కోసం పోరాడుతానన్నారు. నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఆయా సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మనోహర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర పోలీస్ హౌసింస్బోర్డు చైర్మన్ గురున్నాథ్రెడ్డి, మాజీమంత్రి చిత్తరంజన్దాస్ పాల్గొన్నారు. -
దేవుళ్లపై ఒట్లు పెట్టుడు..కేసీఆర్ను తిట్టుడు.. ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి
సాక్షి, హైదరాబాద్: ‘దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు’ అనే రీతిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు విమర్శించారు. కేసీఆర్ను బదనాం చేయడం ద్వారా పబ్బం గడుపుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్కు సుదీర్ఘంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై కేసీఆర్ మాట్లాడారు. పదేళ్ల పాలనలో విద్యుత్, తాగునీటి రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్లలో ఏర్పడిన సమస్యను పరిష్కరించకుండా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం తెలియని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. తన కళ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోదీ పాప కృత్యానికి పాల్పడ్డారు ఢిల్లీ లిక్కర్ కేసు ప్రధాని మోదీ పొలిటికల్ స్కామ్లో భాగమని కేసీఆర్ పేర్కొన్నారు. తన కూతురు కవిత అరెస్టు ద్వారా మోదీ పాప కృత్యానికి పాల్పడ్డారని విమర్శించారు. లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి పిడికెడు మంది నేతలు మాత్రమే బయటకు వెళ్లారని, కడియం శ్రీహరి రాజకీయంగా తనను తానే భూస్థాపితం చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ ఏక్నాథ్ షిండే అవుతాడని బీజేపీ నేతలు అంటున్నా ఆయన ఖండించడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారతాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై చిల్లర ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ సీఎంకు సంబంధించిన వ్యవహారం కాదని, తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారంటూ కేసీఆర్ కొట్టి పారేశారు. కేసీఆర్ ఇమేజీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం నెరవేరదని, ప్రజలు అన్నీ గమనించి బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్కు చెందిన కొందరు నాయకులు తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని, సందర్భాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును కొట్టి పారేయలేమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేనే సీఎం అవుతా.. కేసీఆర్ ప్రజ్వలంగా, ఉజ్వలంగా రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వస్తాడని, మళ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 98 స్థానాల్లో గెలుస్తుందని, తానే సీఎంను అవుతానని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. సమయం సందర్భాన్ని బట్టే నాయకులు తయారవుతారని, కేటీఆర్, హరీశ్రావు సహా ఎవరినీ తాను ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించలేదని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీకి ఒక సీటుకు మించి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆంధ్రాలో ఎవరు గెలిచినా తమకు సంబంధం లేదని, ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు బాధలేదని పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే సమాచారం తమకు ఉందని కేసీఆర్ తెలిపారు. -
లోక్సభలో నారీ పవర్..
(మేకల కళ్యాణ్ చక్రవర్తి) : రాజకీయాల్లో రాణించడం.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయతీరాలకు చేరడం అంత సులువేమీ కాదు. భారత్లాంటి సాంప్రదాయ దేశాల్లో మహిళాలోకం రాజకీయంగా అభివృద్ధి చెందడం కొద్దిగా కష్టమే. అయినా ఉక్కు మహిళలుగా పేరొందిన మన దేశ నారీమణులు ప్రత్యక్ష ఎన్నికల్లో బ్రహా్మండంగా రాణిస్తున్నారు. సమకాలీన పరిస్థితులు, పురుషాధిపత్య రాజకీయాలను అధిగమిస్తూ అనేకస్థాయిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ మొదలు దేశ ప్రధాని, రాష్ట్రపతి లాంటి మహోన్నత స్థానాల్లో కూడా కూర్చున్న ఘనత మన భారతీయ మహిళలది. మండల పరిషత్ అధ్యక్షురాలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా, ఆర్థికం లాంటి కీలకశాఖలు నిర్వహించిన ధీర వనితలుగా మన దేశ మహిళలకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి భారతీయ మహిళల ప్రాతినిధ్యం పార్లమెంట్ దిగువసభ అయిన లోక్సభలో నానాటికీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 4–5 శాతం ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఇప్పుడు లోక్సభలో ఏకంగా 14 శాతం దాటింది. క్షేత్రస్థాయిలోనే కాదు జాతీయస్థాయిలో జరిగే లోక్సభ ఎన్నికల్లో నారీమణులు పురుషులను ఢీ కొడుతూ, రాజకీయ దిగ్గజాలను ప్రజాక్షేత్రంలో మట్టికరిపిస్తూ ప్రజల మన్ననలు పొంది దేశంలోనే అత్యున్నత చట్టసభలో అడుగుపెడుతున్నారు. మాటలే కాదు... చేతల మాస్కరీన్ యానీమాస్కరీన్...వాక్ స్వాతంత్య్రం, విద్యావికాసం, తిరుగుబాటు, మహిళా సాధికారతకు ప్రతీక ఈ పేరు. ప్రస్తుత కేరళ రాష్ట్రం, అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో జన్మించిన ఈమె రాజకీయాల్లో మహిళాప్రాతినిధ్యానికి 20వ శతాబ్దం తొలినాళ్లలోనే బీజం వేసిన యోధురాలు. 1902 జూన్ 6న లాటిన్ కాజిnథలిక్ కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వఉద్యోగి అయిన తండ్రి గాబ్రియెల్ పెంపకంలో తిరువనంతపురంలోని మహారాజాస్ కళాశాల నుంచి డబుల్ పీజీ (ఎకనామిక్స్, హిస్టరీ) చేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. ఆ తర్వాత 1938లో ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్లో చేరిన మాస్కరీన్ సంస్థానా«దీశులు, దివాన్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. దివాన్గా పనిచేసిన రామస్వామి అయ్యర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జరిపిన పోరాటంలో ఆమె క్రియాశీలపాత్ర పోషించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆమె పోలీసు దెబ్బలు తిన్నారు. ఆమె ఇంటిని కూలగొట్టి, ఇంట్లోని వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత 1939లో ఆమె ట్రావెన్కోర్ సంస్థానంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న మాస్కరీన్కు 1946, ఫిబ్రవరి 21న మహాత్మాగాంధీ రాసిన లేఖ అప్పట్లో సంచలనమైంది. బాంబేలో ఆమె ఇచ్చిన ఉపన్యాసానికి స్పందిస్తూ ‘మీ నాలుక అదుపులో లేదు. బుద్ధికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు.’అని రాస్తూనే ట్రావెన్కోర్ ప్రభుత్వం నుంచి ఆమెను తొలగించాలని గాందీజీ ఆ లేఖలో కోరడం గమనార్హం. ఇక, ఆ తర్వాత 1946లో ఏర్పాటైన 299మంది సభ్యులతో కూడిన కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో నియమితులయ్యారు. 1951లో మొదటి లోక్సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఆరుగురి అదృష్టం ఏంటో? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఎంపీ ఎన్నికలు జరగ్గా 2014 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత(టీఆర్ఎస్) నిజామాబాద్ నుంచి, 2019 ఎన్నికల్లో మాలోతు కవిత(టీఆర్ఎస్) మహబూబాబాద్ నుంచి గెలుపొందారు. ఇక, 2024 ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మళ్లీ మహబూబాబాద్ నుంచి పోటీలో ఉండగా, బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే.అరుణ మహబూబ్నగర్ నుంచి బరిలో నిలిచారు. హాస్పిటల్ రంగానికి చెందిన కొంపెల్లి మాధవీలత (బీజేపీ) హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, మల్కాజ్గిరి నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డిలను రంగంలోకి దింపింది. జాతీయస్థాయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటున్న నారీమణులు ♦ 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 22 మంది మహిళలు ♦ 2009లో 50 దాటిన మహిళా ఎంపీల సంఖ్య... 2019లో అత్యధికంగా 78 మంది గెలుపు -
'కమలం టార్గెట్' రెండంకెల బలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండంకెల (డబుల్ డిజిట్) ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. 17 ఎంపీ సీట్లకు గాను 10 నుంచి 12 స్థానాలు గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక లోక్సభా స్థానాల్లో గెలుపొందిన పార్టీగా రికార్డు సృష్టించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో వెనక్కి నెట్టేలా ఫలితాలు రాబట్టాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఆ రెండు పార్టీల కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ అదే దూకుడుతో ముందుకెళ్లాలని భావిస్తోంది. అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాల్లో జాతీయ స్థాయి నేతలు పాల్గొనేలా వ్యూహరచన చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోన్న కమలదళం, అగ్రనేతల పర్యటనలతో ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించే ప్రయత్నాల్లో ఉంది. మోదీ మ్యాజిక్పైనే ఆశలు రాష్ట్రంలో గత రెండు నెలల్లో ఐదు సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఓ విడత ప్రచారం పూర్తి చేయడంతో రాష్ట్ర పార్టీకి ఊపు వచ్చింది. మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రోజులు ఐదు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే రాష్ట్రంలో తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేశారు. గత పదేళ్ల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు, గతంతో పోల్చితే వివిధ వర్గాల అభ్యున్నతి కోసం పెద్దయెత్తున అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. గత పదేళ్లలో తెలంగాణకు వివిధ పథకాల ద్వారా కేంద్రం చేకూర్చిన లబ్ధి, వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు తదితరాలు వెల్లడించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి లభిస్తున్న మద్దతు, వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారనే అభిప్రాయం.. తెలంగాణలోనూ గట్టిగా పనిచేస్తుందని, పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు సాధించి పెడుతుందని జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీపరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ సర్వేల్లో పార్టీకి ప్రజల్లో మద్దతు పెరిగిందని, మెజారిటీ ఎంపీ సీట్లలో గెలుపొందుతామని ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యాచరణ వేగవంతం డబుల్ డిజిట్ లక్ష్య సాధనకు ఇప్పటికే ప్రాథమిక కసరత్తును పూర్తిచేసిన బీజేపీ.. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేసింది. వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతోంది. జిల్లాలు, పార్లమెంట్ నియోజక వర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల స్థాయిలో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను పలుమార్లు కలవడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, స్వయంగా ఓటర్లను కలవడం, కార్నర్ మీటింగ్లు లాంటి ఔట్ రీచ్ కార్యక్రమాల ద్వారా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్) లాంటివి అందజేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండోవిడత, వచ్చేనెల 9,10,11 తేదీల్లో మూడోవిడత ప్రచారాన్ని పూర్తిచేయనున్నారు. 4, 6, 8 తేదీల్లో మోదీ పర్యటన రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపేలా ఆయన పర్యటన ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇండోర్ స్టేడియంలో ఐటీ వృత్తి నిపుణులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ఓ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఓటర్లలో యాభై శాతం మంది దాకా మహిళలు ఉండడంతో వీరిని ఆకట్టుకునేలా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మోదీతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది. నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్; ఖమ్మం ఎంపీ సీట్లలో ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేసేలా జనగామలో లేదా అక్కడికి దగ్గరలో మోదీ పాల్గొనేలా ఓ సభ నిర్వహించాలని భావిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్లో లేదా నగర శివార్లలో జరిపే భారీ బహిరంగ సభతో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నట్టు సమాచారం. రేపు రాష్ట్రానికి అమిత్ షా బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సిద్దిపేట చేరుకుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు సభ ఉంటుంది. అనంతరం 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడ ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి భువనేశ్వర్కు వెళ్తారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019