వజ్రకరూరు: శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యంలో గురువారం సాయంత్రం సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం స్థానిక ధర్మప్ప దేవాలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అధిష్టింపజేశారు. అనంతరం రథానికి పూజలు నిర్వహించి... జై శ్రీరామ్ అంటూ ఆలయం నుంచి గురుదేవా ఆశ్రమం వరకూ లాగారు. అనంతరం యథాస్థానానికి చేర్చారు.
బైక్ అదుపుతప్పి.. ఒకరి మృతి
పావగడ: అడవిపందుల గుంపు తగిలి బైక్ అదుపుతప్పి కిందపడటంతో పావగడ తాలూకా బెళ్లి బట్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, గ్రామ పంచాయతీ సభ్యుడు బోయ కృష్ణప్ప(40) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. బోయ కృష్ణప్ప తన భార్య గుండమ్మతో కలిసి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బంధువుల ఊరు అచ్చమ్మనహళ్లికి బయల్దేరాడు. శైలాపురం – కోటగుడ్డ మధ్య మద్రేనహళ్లి అటవీ ప్రాంతంలో అడవిపందుల గుంపు రోడ్డుకు అడ్డంగా వచ్చి బైకును తోశాయి. అదుపుతప్పి కిందపడటంతో కృష్ణప్ప తలకు తీవ్రగాయమైంది. గ్రామస్తులు గమనించి వెంటనే ఆయన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి విషమించి కృష్ణప్ప మృతి చెందారు. ఇదే ప్రమాదంలో భార్య గుండమ్మ స్వల్ప గాయాలతో బయటపడింది.