పుట్టపర్తి అర్బన్: జిల్లాలో రహదారుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. జాతీయరహదారులతో పాటు రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, పీఎంజీఎస్వై, జాతీయ ఉపాధి హామీ పథకం, ఎంపీపీ, జెడ్పీ నిధుల కింద రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో చాలా వరకూ పూర్తయ్యాయి. వీటి కోసం ప్రభుత్వం ఏకంగా రూ.6,057 కోట్లు వెచ్చిస్తోంది. జిల్లాలో మొత్తం 1,529 కిలోమీటర్ల మేర రోడ్లు ఏర్పాటు చేసింది. వందేళ్ల నుంచి తారు రోడ్డుకు నోచుకోని గ్రామాలకు సైతం రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ల పురోగతి ఇలా...
జిల్లా పరిధిలో 250 కిలోమీటర్లకు పైబడి జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు. ఈ రోడ్లతో బెంగళూరు, హైదరాబాద్, కడప, కర్నూలు, చిత్తూరు ప్రాంతాలకు కనెక్టవిటీ పెరుగుతుంది. 80 కిలోమీటర్లు 342వ జాతీయరహదారి నిర్మించేందుకు రూ.1,745 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 90.58 కిలోమీటర్లు 716జీ జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.1648.70 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇక జిల్లా మీదుగా 75 కిలోమీటర్లు వెళ్లే గ్రీనఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం భూ సేకరణ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం రూ.850 కోట్లు ఖర్చు చేయనున్నారు.
● రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 32 మండలాల పరిధిలో 804 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలకు రూ.366 కోట్లు వెచ్చిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 233 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
● పీఓంజీఎస్వై కింద 131.18 కిలోమీటర్లకు పైగా రోడ్ల నిర్మాణాలకు రూ.52.55 కోట్లు ఖర్చు పెట్టారు. 12.58 కిలోమీటర్ల కదిరి బైపాస్ రోడ్డుకు రూ.220.66 కోట్లు, 7.7 కిలోమీటర్ల ముదిగుబ్బ బైపాస్కు రూ.116.81 కోట్లు ఖర్చు చేస్తోంది. 20.04 కిలోమీటర్ల హిందూపురం– పరిగి రోడ్డుకు రూ.98.16 కోట్లు, 42.37 కిలోమీటర్ల మడకశిర–శిరరోడ్డుకు రూ.207.79 కోట్లు, 33 కిలోమీటర్ల బత్తలపల్లి–ముదిగుబ్బ రోడ్డుకు రూ.401.72 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
పరిశ్రమల రాకకు మార్గం సుగమం..
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. జాతీయ రహదారులతో పాటు పలు పరిశ్రమలు ఒకదానితో ఒకటి పోటీ పడి వస్తున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యం, ప్రభుత్వ సహకారం, నీటి వసతి, అనుకూలమైన వాతావరణం ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో 3,257 ఎకరాల భూమి సేకరించి అభివృద్ధి చేయంతో పలు పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 1,138 యూనిట్ల కోసం భూమిని సిద్ధం చేశారు. 249 యూనిట్లు నెలకొల్పడానికి ప్లాట్లు కేటాయించారు.
శరవేగంగా రోడ్ల నిర్మాణం
గ్రామీణ నుంచి జాతీయ
రహదారుల వరకు అభివృద్ధి
అన్ని ప్రాంతాల రాకపోకలకూ
మార్గం సుగమం
శ్రీసత్యసాయి జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. గడిచిన ఐదేళ్లలో
వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు
సంక్షేమ పథకాల అమలుతో పాటే
అభివృద్ధి పనులపైనా దృష్టి సారించింది. రహదారుల నిర్మాణాలతో జిల్లా
రూపురేఖలు పూర్తిగా మారాయి.
అన్ని ప్రాంతాలకూ రాకపోకలు,
రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి.