ఆన్ ఫీల్డ్లో ఎప్పుడూ కూల్గా కనిపించే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా సహనం కోల్పోయాడు. అనవసరంగా వికెట్ పారేసుకున్నానన్న కోపంలో బ్యాట్ను గోడకేసి గట్టిగా కొట్టాడు. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే దారిలో ఈ తంతు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఈ మ్యాచ్లో 26 బంతులు ఎదుర్కొన్న పంత్.. 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 28 పరుగులు చేశాడు. రిథమ్ అందుకుంటున్న సమయంలో పంత్.. చహల్ బౌలింగ్ వికెట్కీపర్ సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రీఎంట్రీలో (యాక్సిడెంట్ నుంచి కోలుకున్న అనంతరం) పంత్కు ఇది రెండో మ్యాచ్. పంజాబ్ కింగ్స్తో ఆడిన తొలి మ్యాచ్లోనూ పంత్ విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో పంత్ అసహనాన్ని ప్రదర్శించాడు.
ఇదిలా ఉంటే, ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్లో రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.