తిరుపతి సిటీ: ఎన్నికల విధుల నిర్వహణలో పీఓ, ఏపీఓలు ప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించిన ప్రతి ఉద్యోగి హాజరు కావాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. గురువారం పద్మావతి మహిళా వర్సిటీలోని ధృతి ఆడిటోరియంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పీఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈవీఎంలు, పోలింగ్ కేంద్రాలలో సమస్య ఏర్పడితే వెంటనే సెక్టోరల్ అధికారికి సమాచారం అందించాలని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి ఓటరు స్లిప్పులు బీఎల్ఓలకు అందజేశామని, వారు నిర్ణీత సమయంలోపు ఓటరుకు అందజేయాలని ఆదేశించారు. చంద్రగిరి ఆర్ఓ నిషాంత్రెడ్డి, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.
92,79 శాతం మందికి పింఛన్లు
తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ 92.79 శాతం పూర్తయినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం 69,522 మంది లబ్ధిదారులకు గాను 64,506 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రూ.20,21,73,000లకుగాను బుధ, గురువారాల్లో రూ.18,79,05,000 లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు. శుక్రవారానికి వంద శాతం పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
నేడు డయల్ యువర్ ఈఓ
తిరుమల: డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుపతి టీటీడీ పరిపాలనా భవంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు టీటీడీ పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయన్నట్టు వెల్లడించింది. భక్తులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈఓ ఏవీ.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవని సూచించింది. భక్తులు 0877–2263261 నంబర్లో సంప్రదించాలని టీటీడీ పేర్కొంది.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 16 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,510 మంది స్వామివారిని దర్శించుకోగా 30,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.62 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.