ఏర్పేడు/రేణిగుంట: రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో జాతీయ విద్యాసంస్థలైన ఐఐటీ, ఐజర్లను నెలకొల్పుతున్నట్లు కేంద్రం 2014లో ప్రకటించింది. ఏర్పేడు సమీపంలోని మేర్లపాక రెవెన్యూ పరిధిలో 548 ఎకరాలు ఐఐటీ కోసం భూసేకరణ చేశారు. అలాగే ఐజర్ కోసం ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలో 260 ఎకరాలు సేకరించారు. ఇదే అదునుగా 2015లో అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అడ్డదారులు ఎంచుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనయుడు బొజ్జల సుధీర్రెడ్డి రెచ్చిపోయారు. అప్పటి తహసీల్దార్ లక్ష్మీనరసయ్యతో కలసి దాదాపు 150 ఎకరాల భూమికి పట్టాలు లేకపోవడంతో అప్పటికప్పుడు పాత తేదీలతో నకిలీ పట్టాదార్ పాసుపుస్తకాలను తయారు చేశారు. ఇంకేముంది.. రూ.కోట్ల పరిహారం మొత్తాన్ని కాజేశారు. అప్పట్లో ఎకరా భూమికి రూ.10లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. ఈ కుంభకోణంలో జంగాలపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు అన్నీ తానై వ్యవహరించారు. ఇలా అక్రమాలకు పాల్పడి అవినీతి సొమ్మును బొజ్జల సుధీర్రెడ్డికి ముట్టజెప్పినట్లు అప్పట్లోనే చెడ్డపేరు మూటగట్టుకున్నారు. దీంతో జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందడంతో అప్పటి తహసీల్దార్పై చర్యలు తీసుకున్నారు. అలాగే తొట్టంబేడు మండలంలో ఏర్పాటు చేసిన ఖజారియా పరిశ్రమకు కేటాయించిన భూములకు సంబందించి పొందిన పరిహారంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మన్నవరంలో ఆక్రమించి చదును చేసిన ప్రభుత్వ భూమి
పవిత్ర పుణ్యక్షేత్రంలోని ప్రజలు నమ్మి 30 ఏళ్ల పాటు పాలించే అవకాశాన్ని కల్పించారు..
ఓటేసిన ప్రజలను నడిసంద్రంలో ముంచేసి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా సొంత ఆస్తులను కూడబెట్టుకున్నారు..
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జాతీయ విద్యాసంస్థలు ఏర్పేడు ఐఐటీ, ఐజర్ భూసేకరణలో భాగంగా రైతులకు అందాల్సిన పరిహారాన్ని బినామీ పేర్లతో కొట్టేశారు.
ఆ తర్వాత కూడా ప్రభుత్వ భూములపై కన్నేసి వందలాది ఎకరాలను తన అనుచరుల పేర్లతో పట్టాలు చేసుకుని దర్జాగా అనుభవిస్తున్నారు.. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి.
బినామీ పేర్లతో అన్యాక్రాంతం
శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం, ఇనగలూరు, ఎంపేడు గ్రామాల్లో తన బినామీల పేర్లతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను బొజ్జల సుధీర్రెడ్డి కూడగట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి పట్టాలు చేసుకుని పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడినట్లు అప్పట్లో జిల్లా అధికారులకు ఫిర్యాదులందాయి. ఆ భూములకు సంబంధించి పట్టాదార్ పాసుపుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి పంటరుణాలు పొంది బ్యాంకులను బురిడీ కొట్టించారు. తొట్టంబేడు మండలంలో సైతం తన అనుచరుల పేర్లతో ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకుని వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఏర్పేడు మండలం కోబాక రెవెన్యూ పరిధిలో గోవు పోరంబోకు భూములను బొజ్జల సుధీర్రెడ్డి అనుచరులు అక్రమించి పట్టాలు చేసుకుని సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. అనేకమార్లు ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు చేసినా ఆక్రమణదారులు ఈ భూములను వదిలిపెట్టలేదు. మళ్లీ బొజ్జల సుధీర్రెడ్డికి అధికారం ఇస్తే నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను వదిలిపెట్టడని ప్రజలు చర్చించుకుంటున్నారు.