Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

శివ.. శివా.. ఆ ఎమ్మెల్యే నల్లతాచు

Published Fri, Apr 19 2024 3:54 AM

TDP MLA Shivudu list of irregularities: Andhra pradesh - Sakshi

ఎన్‌ఆర్‌ఐల నల్లధనంతో ఎన్నికల బరిలోకి దొంగ ఓట్లు చేర్చడంలో నేర్పరి  

ఓట్ల కొనుగోలులోనూ దిట్ట

అగ్రిటెక్‌ ద్వారా నాసిరకం బయో మందుల విక్రయం 

గత ప్రభుత్వంలో నీరు–చెట్టు ద్వారా ప్రజాధనం దోపిడీ 

దళితుల భూముల ఆక్రమణకు యత్నం..  ఇప్పటికే ఎన్నోకేసుల్లో నిందితుడు

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క’ అంటూ ఓ సినిమాలో డైలాగ్‌ ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాకు చెందిన ‘దేశం’ ఎమ్మెల్యే నిజంగా ‘నల్ల’తాచు లెక్క.. ఆయన దురాగతాలకు అంతేలేదు. నాసిరకం బయో మందులు విక్రయిస్తూ రైతులను వంచిస్తారు. ఎన్‌ఆర్‌ఐలు, గ్రానైట్‌ పరిశ్రమల నుంచి వసూలు చేసిన ‘నల్లధనం’తో ఎన్నికల బరిలోకి దిగుతారు. ఓట్లు కొంటారు, దొంగ ఓట్లు వేయిస్తారు.  ఎలాగైనా గెలిచి మళ్లీ ప్రజలను పీడించుకుతినడమే ఆయన నైజం. పేరుకే ఆయన ‘శివుడు’.కానీ పనులన్నీ భస్మాసురుడిని తలపిస్తాయి.  ఆ ఎమ్మెల్యే నల్లతాచు   

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే అక్రమంగా వసూలు చేసిన నల్లధనంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడటంతో అక్రమాల తుట్టె కదులుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో నీరు – చెట్టు పనుల్లో రూ. కోట్లు కొల్లగొట్టి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో  నీరు – చెట్టు ద్వారా చెరువులు తవ్వాలని అప్పట్లో ఆయన పట్టుబట్టడంతో దళితులు వ్యతిరేకించారు. దళితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలబడడంతో చివరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నాసిరకం బయో మందులపై సర్కారు చర్యలు తీసుకుంది. అయినా నకిలీ మందులు విక్రయించడం మాత్రం ఆపలేదు.  

అగ్రిటెక్‌ మాటున నకిలీ మందులు  
గుంటూరులోని ఎమ్మెల్యేకి చెందిన తన అగ్రిటెక్‌ కంపెనీ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీఎస్‌డీఆర్‌ఐ) జరిపిన తనిఖీల్లో ఆయన ఎన్నికల అక్రమాలు వెలుగుచూశాయి. ఎన్‌ఆర్‌ఐల నుంచి నిధులు పోగేసి తొలుత ఆ నిధులను తన కంపెనీకి తరలించి అక్కడి నుంచి ఎన్నికలకు వెచ్చించినట్లు వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో దొరికిన డైరీలో ‘నల్లధనం’ లెక్కలు వెలుగుచూశాయి.

ఆ నిధులతోనే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు,దొంగ ఓట్లు చేర్చడం, ఎన్నికల్లో ఇతరత్రా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత ఆయన టీడీపీ మాజీ ఎంపీ దగ్గర పనిచేశారు. ప్రస్తుతం ఆ మాజీ ఎంపీ తెలంగాణలో బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఆయనకు ఏపీలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్నప్పుడే అగ్రిటెక్‌ కంపెనీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే  ఆ కంపెనీ తయారు చేసిన నకిలీ బయో ఎరువులు, పురుగు మందులను రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించారు. మాజీ ఎంపీకి బినామీగా ఉన్న సమయంలో ఆయన అండతోనే ఎదిగారన్న ప్రచారమూ ఉంది.  

మైనింగ్,విజిలెన్స్‌ అధికారులపైనా దాడులు  
ఆ నియోజకవర్గంలో తన సామాజికవర్గం బలంగా ఉంది. ఆ వర్గంలో ఎన్‌ఆర్‌ఐలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా గత రెండు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు సమకూర్చారు. అదంతా నల్లధనమేనన్న ఆరోపణలు ఉన్నాయి. మార్టూరు మండలంలో 250కిపైగా గ్రానైట్‌ పరిశ్రమలు సామాజికవర్గం చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్‌ రాయల్టీ లేకుండానే తరలిపోతోంది. దీనికి సహకరిస్తున్న నేతలకు పరిశ్రమల యజమానులు నిధులు కుమ్మరిస్తారు. వీరి నుంచి అధికమొత్తంలో నిధులు వెళ్తున్నట్టు సమాచారం.

నియోజకవర్గంలో 15 వేలకు పైగా దొంగ ఓట్లు  చేరి్పంచడంతో ఇటీవల అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. దీనిలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. తన అగ్రిటెక్‌ కార్యాలయంలో లభించిన డైరీలో ఎమ్మెల్యే అక్రమాలు బయటపడటంతో ఎమ్మెల్యేతోపాటు కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యేను ఏ–1గా చూపారు. మార్టూరు గ్రానైట్‌ పరిశ్రమల నుంచి అక్రమంగా సరుకు తరలిపోతుందన్న ఫిర్యాదుతో జనవరి 30న తనిఖీలకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్‌ అధికారులను తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అడ్డుకొని దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పరారైన ఎమ్మెల్యేకు తర్వాత 41 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టారు.  

కేసులు ‘అనంత’ం  
► మార్టూరులోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలో తనిఖీల నిమిత్తం వచ్చిన విజిలెన్స్‌ అండ్‌ మైనింగ్‌ అధికారులను అడ్డగించిన సందర్భాన్ని పురస్కరించుకొని విజిలెన్స్‌ ఏడీ బాలాజీ నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదుపై 31/2024, 31/01/2024న ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

► 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం వంటివి ఆధారాలతో బట్టబయలు కావడంతో ఎమ్మెల్యేపై ఏ1గా కేసు నమోదు చేశారు.  

► బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 123(1), ఐపీసీ సెక్షన్‌ 171(ఇ), రెడ్‌ విత్‌ 120(బి), సీఆరీ్పసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేసారు. 

► 220/2023, 19/09/2023వ తేదీన ఎమ్మెల్యేపై మార్టూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250