breaking news
-
రాత మార్చేసిన దుర్ఘటన.. 29 ఏళ్ల వయసులో రిటైర్మెంట్
జపాన్ బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదం తర్వాత తాను పూర్తిగా కోలుకోలేకపోయానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. కాగా జపాన్కు చెందిన 29 ఏళ్ల కెంటో మొమోటా ఒకప్పుడు బ్యాడ్మింటన్ రంగంలో మకుటంలేని మహారాజుగా నీరాజనాలు అందుకున్నాడు. 2019లో ఏకంగా 11 టైటిళ్లు సాధించి సత్తా చాటాడు. ఆ ఏడాది ఆడిన 73 మ్యాచ్లలో మొమోటా కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఓడిపోయాడు. అయితే, ఆ మరుసటి ఏడాది మొమోటా కారు ప్రమాదానికి గురయ్యాడు. మలేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన తర్వాత కౌలలంపూర్ విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాద ఘటనలో నుజ్జునుజ్జయింది. ఆ కారు డ్రైవర్ చనిపోగా.. మొమోటాకు తీవ్ర గాయాలయ్యాయి. మొమోటా కంటికి బలమైన దెబ్బ తలగడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరో రెండు టైటిళ్లు గెలిచిన మొమోటా.. ఏడాది తర్వాత రెండో కంటి చూపు కూడా మందగించడంతో ఫామ్ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ‘‘కారు ప్రమాదం జరిగిన సమయంలో నేను నా గురించి ఆందోళన చెందలేదని చెప్తే అది అబద్ధమే అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. ఆడాలనే తపన ఉన్నా నా శరీరం అందుకు సహకరించడం లేదు. అందుకే ఈ నిర్ణయం. అయితే, ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు’’ అని కెంటో మొమోటా చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్గా వెలుగొందిన మొమోటా ప్రస్తుతం 52వ ర్యాంకులో ఉన్నాడు. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయిన అతడు.. థామస్, ఉబెర్ కప్ తర్వాత ఆటకు దూరం కానున్నాడు. -
BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం
తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా హడలెత్తిస్తానని భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి నిరూపించాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. తరచూ గాయాల బారిన పడుతూ... ఆశించినన్ని విజయాలు అందుకోలేకపోయిన ఈ కేరళ ప్లేయర్ అడపాదడపా అద్భుత విజయాలతో అలరిస్తుంటాడు. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ప్రణయ్ పెను సంచలనం సృష్టించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్లో ఒకడైన జపాన్ స్టార్ కెంటో మొమోటాను ప్రణయ్ వరుస గేముల్లో ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్కే చెందిన యువతార లక్ష్య సేన్తో ప్రణయ్ తలపడతాడు. గత సంవత్సరం రజత పతకం నెగ్గిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. టోక్యో: అత్యున్నత వేదికపై అద్భుత ఆటతీరుతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఈ కేరళ ఆటగాడు సంచలన విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018, 2019 ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)పై ప్రణయ్ వరుస గేముల్లో గెలిచి ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–16తో కెంటో మొమోటాను ఓడించాడు. గతంలో మొమోటాతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఎనిమిదో ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం. మొమోటాతో 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రణయ్ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ 4–4తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఒక పాయింట్ కోల్పోయిన ప్రణయ్ మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–5తో ముందంజ వేశాడు. ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రణయ్ తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ మొదట్లో ప్రణయ్ 1–4తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ప్రణయ్ స్కోరును సమం చేశాడు. అనంతరం 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మొమోటాకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ప్రణయ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన లక్ష్య సేన్తో ప్రణయ్ తలపడతాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ లక్ష్య సేన్ 36 నిమిషాల్లో 21–17, 21–10తో లూయిస్ ఎన్రిక్ పెనాల్వర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ అవుట్... గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకం సాధించిన ప్రపంచ మాజీ నంబర్వన్, భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 9–21, 17–21తో ఓడిపోయాడు. పోరాడి ఓడిన శిఖా–అశ్విని జోడీ మహిళల డబుల్స్లో భారత పోరాటం ముగిసింది. బుధవారం బరిలోకి దిగిన నాలుగు భారత జోడీలు రెండో రౌండ్లోనే నిష్క్రమించాయి. శిఖా గౌతమ్–అశ్విని భట్ 5–21, 21–18, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ కిమ్ సో యోంగ్–కాంగ్ హి యోంగ్ చేతిలో పోరాడి ఓడిపోయింది. సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 15–21, 10–21తో టాప్ సీడ్ చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ (చైనా) చేతిలో... దండు పూజ–సంజన 15–21, 7–21తో మూడో సీడ్ లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 8–21, 17–21తో పదో సీడ్ పియర్లీ తాన్–థినా మురళీధరన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. ధ్రువ్–అర్జున్ జోడీ అద్భుతం పురుషుల డబుల్స్లో భారత రెండు జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ ద్వయం 21–17, 21–16తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–8, 21–10తో సోలిస్ జొనాథన్–అనిబెల్ మార్క్విన్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో జెప్ బే–లాసి మోల్డే (డెన్మార్క్)లతో సాత్విక్–చిరాగ్... హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ (సింగపూర్)లతో అర్జున్–ధ్రువ్ ఆడతారు. -
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు మొమోటా దూరం
Kento Momota Ruled Out From World Badminton Championship.. వెన్ను నొప్పి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి వైదొలిగాడు. ఈనెల 12 నుంచి 19 వరకు స్పెయిన్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మొమోటా 2018, 2019లలో ప్రపంచ చాంపియన్షిప్లో, ఆసియా చాంపియన్షిప్లో టైటిల్స్ను సాధించాడు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇండోనేసియా ఆటగాళ్లందరూ ప్రపంచ చాంపియన్షిప్లో ఆడటంలేదని ప్రకటించారు. -
వరల్డ్ చాంపియన్ కెంటో మొమొటాకు షాక్
టోక్యో: విదేశీ వేదికలపై అసాధారణ విజయాలు సాధిస్తున్న జపాన్ స్టార్లు సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్లో మాత్రం తేలిపోతున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ చాంపియన్ నయోమి ఒసాకా మూడో రౌండ్లో ఓడినట్లే బ్యాడ్మింటన్లో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమొటా కూడా గ్రూప్ దశ దాటలేకపోయాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఆసియా చాంపియన్గా నిలిచిన మొమొటా బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ ఆఖరి లీగ్ మ్యాచ్లో 15–21, 19–21తో హియో క్వాంగి (దక్షిణ కొరియా) చేతిలో కంగుతిన్నాడు. వరుసగా రెండు విజయాలతో క్వాంగి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఇతర గ్రూప్ల నుంచి కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)... మార్క్ కల్జూ (నెదర్లాండ్స్)... అక్సెల్సన్ (డెన్మార్క్)... జు వె వాంగ్ (చైనీస్ తైపీ)... జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)... షి యుకీ (చైనా)... కాంటా సునెయామ (జపాన్)... జిన్టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా)... టోబీ పెంటీ (బ్రిటన్)... ఆంటోన్సెన్ (డెన్మార్క్)... లీ జి జియా (మలేసియా)... చెన్ లాంగ్ (చైనా)... తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. -
మొమోటా... పూర్తి ఫిట్గా
టోక్యో: ఈ ఏడాది ఆరంభంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా శుక్రవారం ప్రకటించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీ విజేతగా నిలిచిన అనంతరం స్వదేశానికి వెళ్లేందుకు కౌలాలంపూర్ ఎయిర్పోర్టుకు బయలుదేరాడు. అయితే అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడంతో మొమోటా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా... మొమోటా సిబ్బందికీ గాయాలయ్యాయి. మొమోటా కంటికి గాయం కావడంతో ఫిబ్రవరిలో డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించారు. ‘ఆడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూడగలుగుతున్నా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గతంలో లాగే ఆడుతున్నట్లు అనిపిస్తోంది’ అని మొమోటా అన్నాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గడమే తన తదుపరి లక్ష్యం అని మొమోటా పేర్కొన్నాడు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019