Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఎన్నికలకు సై

Published Thu, Apr 18 2024 10:35 AM

- - Sakshi

నేడే లోక్‌సభ ఎలక్షన్‌ నోటిఫికేషన్‌

ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ

18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు

నామినేషన్ల దాఖలుకు సమాయత్తమైన అభ్యర్థులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్‌ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

శుభ ముహూర్తాలు

● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది.

● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు.

● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది.

● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు.

● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహుర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది.

● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది.

నామినేషన్ల దాఖలు ఇలా

● అభ్యర్థులు నామినేషన్‌ ఫారం–2ఎ ను రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు.

● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అనుమతి.

● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్‌ను ప్రతిపాదించాలి.

● అదే రిజిస్ట్రర్‌ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్‌ను ప్రతిపాదించాల్సి ఉంది.

● అభ్యర్థులు 3నెలలలోపు దిగిన ఒక పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోను అఫిడవిట్‌పై అతికించాలి.

● నామినేషన్‌పత్రంపై స్టాంప్‌ సైజు ఫొటో పెట్టాలి.

● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్‌ సెగ్మెంట్‌కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్‌ వీఆర్‌ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది.

●రిజస్టర్‌/గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ ఫారంలోని పార్ట్‌–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి.

● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్‌ అకౌంట్‌ తీసుకోవాలి.

● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి.

● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి.

నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్‌ తహహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్‌, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్‌ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల నిబంధనలు పాటించాలని.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని అన్నారు.

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం

పార్టీ అభ్యర్థి నామినేషన్‌ వేయనున్న తేదీ

బీఆర్‌ఎస్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ 19

బీజేపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 22

కాంగ్రెస్‌ గడ్డం రంజిత్‌రెడ్డి 25

షెడ్యూల్‌ ఇలా..

మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌

ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ

ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ

సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు.

ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన

ఏప్రిల్‌ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల

మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

జూన్‌ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250