● పరుగు తీసిన గ్రామస్తులు
భామిని: మండలంలోని తాలాడ వంశదార నదీ తీరంలో శుక్రవారం ఏనుగుల గుంపు అలజడి రేపింది. వేసవి తీవ్రతతో పెరిగిన ఉష్ణోగ్రతలకు విలవిలలాడిన ఏనుగుల గుంపు దాహా ర్తిని తీర్చుకోడానికి నదీ తీరానికి చేరుకున్న సమయంలో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వేసవి ఉపశమనానికి వంశధార నదిఒడ్డుకు తాలాడ వాసులు చేరుకుంటు న్న సమయంలోనే ఏనుగుల గుంపు తారసపడడంతో గందరగోళం నెలకొంది. స్నానాలకు వెళ్లిన గ్రామస్తులు పరుగుపెట్టారు. అంతా సద్దుమణిగాక ఏనుగులు జలకాలాడి నీరు తాగి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
ముమ్మరంగా వాహనాల తనిఖీ
సీతానగరం: సాధారణ ఎన్నికలకు నామినేషన్లు దాఖలవుతున్న కారణంగా రాష్ట్ర రహదారిపై వాహనాల తనిఖీ ముమ్మరం చేశామని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్(ఎఫ్ఎస్టి) అధికారి కె.చిన్నారావు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర రహదారిలో బొబ్బిలి–సీతానగరం సరిహద్దు లచ్చయ్యపేట జంక్షన్ నుంచి సూరంపేట వరకు వాహనాలను తనిఖీ చేశారు. కింతలివానిపేట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తున్న బ్యాగ్లను తనిఖీ చేస్తున్న సమయంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధి కారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది సహకారంతో వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు. పోటీల్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తాయిలాలు సమర్పించడానికి వాహనాల్లో నిబంధనలకు మించి నగదు, ఆకర్షణీయమైన వస్తువులు తరలించే అవకాశాలున్నాయని భావించి వాహనాల తనిఖీకి రిటర్నింగ్ అధికారి మార్గదర్శకా లు విడుదల చేశారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో మే నెల 13 ఎన్నికల పోలింగ్ జరిగేంత వరకూ నిరంతరం వాహనాల తనిఖీ చేపట్ట నున్నామన్నారు. తనిఖీ అధికారులకు వాహనా లు ఎక్కడైనా అపి తనిఖీచేసే అధికారం ఉంద ని, పోలీసు వారి సహకారంతోనే చేపట్టే తనిఖీ సమయంలో వాహన యజమానులు సహకరించాలని కోరారు.
రామతీర్థంలో వైభవంగా
సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మండపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మండపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బొబ్బిలి చీరల పరిశీలన
బలిజిపేట: నారాయణపురం గ్రామానికి చెందిన నీలకంఠేశ్వర చేనేత సహకార సంఘం తయారు చేస్తున్న బొబ్బిలి చీరలను రాష్ట్ర ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ పవనమూర్తి శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కాలంలో సహకార సంఘం తయారు చేసిన బొబ్బిలి చీరలను రాష్ట్రంలోని అన్ని ఆప్కో షోరూంలకు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నాణ్యతను పరిశీలించేందుకు ఆప్కో ఎండీ పవనమూర్తి అమరావతి నుంచి ఇక్కడకు వచ్చారు. చీరలను పరిశీలించి వాటి నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు సంఘ సభ్యులకు అందించారు. ఆయన వెంట కె.వీర్రాజు, సీహెచ్.నారాయణరావు, సభ్యులు ఉన్నారు.