Sakshi News home page

యూరప్‌లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం

Published Wed, Oct 4 2023 4:31 AM

Malayappa Swami Kalyanam is glorious in Europe - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్, యూకేలో మలయప్ప స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫ్రాంక్‌ఫర్ట్, ఉట్రేచ్‌్ట–నెదర్లాండ్స్‌లో టీటీడీ అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణ క్రతువు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు హాజరై భక్తి పారవశ్యంతో పులకించారు.

ఈ సందర్భంగా ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ మేడపాటి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి సమన్వయంతో ప్రపంచంలోని తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల సహకారంతో శ్రీవారి కల్యాణాలు కనుల విందుగా సాగుతున్నాయన్నారు.

కల్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. యూరప్‌లో స్వామి వారి కల్యాణానికి శివరామ్‌ తడిగొట్ల, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కార్తీక్‌ యార్లగడ్డ, జి.వెంకట కృష్ణ, సూర్య ప్రకాష్‌ తదితరులు ఏర్పాట్లు చేశారని వివరించారు.

Advertisement

homepage_300x250