ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతు
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024కాళోజీ సెంటర్: ‘35 ఏళ్ల తర్వాత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మహిళకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించాలి’ అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్యకు తన నామినేషన్ సెట్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం కావ్య మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా మహిళా ఓటర్లున్నారని, గతంలో మహిళల సమస్యల పరిష్కారానికి పని చేశానన్నారు. విద్య, ఆరోగ్యం కోసం అధిక ప్రాధాన్యమిస్తాన్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న సమస్యలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ అప్ గ్రేడ్ లెదర్ పార్క్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎడ్యుకేషన్, ఐటీ హబ్గా అండర్ డ్రెయినేజీ వ్యవస్థను తీర్చిదిద్దడానికి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు వారి మాటలు నమ్మకుండా తన గెలుపు కోసం అందరు సహకరించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కావ్య కోరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య మాట్లాడుతూ.. కులాల పేరుతో మతాల పేరుతో నిరుద్యోగులు, రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ అన్నారు. 120 రోజుల తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిందలు మోపుతూ 10 ఏళ్ల పాలనలో అన్ని రకాలుగా ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. అన్ని రకాల ప్రజలకు మేలు జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సీనియర్ నాయకుడు ఈవీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ/కాళోజీ సెంటర్: బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ 50 వేల మెజార్టీతో విజయం సాధిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా హనుమకొండ బాల సముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఏకశిల పార్కు వరకు భారీ ర్యాలీ తీశారు. ఈర్యాలీని ఉద్దేశించి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. తాను సర్వే చేయించానని, రంగంలోకి దిగకముందే 50 వేల మెజార్టీతో గెలస్తున్నామని, ప్రచారం చేపడితే మెజార్టీ మరింత పెరుగుతుందన్నారు. పార్టీ పరంగా లాభం పొంది బయటకు వెళ్లిన నాయకులను తిరిగి చేర్చుకునేది లేదని, ఈవిషయంపై పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్ద మాట తీసుకున్నానన్నారు. తనను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, వారికి ఎలాంటి ఆధారాలు దొరకడం లేదన్నారు. కడియం శ్రీహరికి తానే రాజకీయ జీవితమిచ్చానన్నారు. రేవంత్రెడ్డి బ్రోకర్ అయితే కడియం శ్రీహరి మోసకారి అని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేసి బిడ్డకు టికెట్ ఇప్పించి వంచించిన మోసగాడు కడియం శ్రీహరి అని ధ్వజమెత్తారు. శ్రీహరిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ.. తాను స్థానికున్నే అని, కడియం కావ్య గుంటూరుకు చెందిన వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు, వినయ్భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలను విస్మరించిందని పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ గల్లంతవుతుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మానుకోట పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి అజ్మీరా సీతారాం నాయక్ను గెలిపించాలని కోరారు. సీతారాం నాయక్ నామినేషన్ సమర్పించిన నేపథ్యంలో సోమవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా ప్రత్యేక హెలికాప్టర్లో మానుకోట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపానికి చేరుకున్నారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సభ నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను మోదీ సర్కార్ పరిష్కరించిందన్నారు. మోదీ అంటే గ్యారంటీ అని, ప్రజలు ఆలోచన చేస్తున్నారని, దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు. ఆదివాసీ, గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని, ఉద్యోగం, రాజకీయం ఇతర రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సీతారాంను ఎంపీగా గెలిపిస్తే మానుకోటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో జిల్లా యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దేశాభివృద్ధి కోసం మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్, మాజీ రాజ్యసభ, బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ కడియం కావ్య, చిత్రంలో సాంబయ్య, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న ఎర్రబెల్లి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్, వినయ్భాస్కర్, రాజయ్య న్యూస్రీల్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ను గెలిపించాలి
కేంద్ర మంత్రి
కిరణ్ రిజిజు