రేపల్లె రూరల్: రేపల్లెలో ఫ్యాన్ గాలి ముందే వీచింది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మద్దతుతో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ ఈవూరు గణేష్ సోమవారం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతల మధ్య నామినేషన్ వేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జెండాలు రెపరెపలాడాయి. జైజై జగనన్న... జైజై మోపిదేవి.. జైజై గణేష్ల అంటూ అభిమాన గళంతో రేపల్లె పట్టణం హోరెత్తింది. నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె రూరల్, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల నుంచి వచ్చిన ప్రజలతో రేపల్లె పట్టణం కిక్కిరిసిపోయింది. తొలుత పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి నామినేషన్ దాఖలుకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, అభ్యర్థి డాక్టర్ గణేష్ బయలుదేరారు. బస్టాండ్ సెంటర్, రాజ్యలక్ష్మి థియేటర్, పద్మావతి థియేటర్ల మీదుగా నెహ్రూ బొమ్మ సెంటర్, అంబేడ్కర్ విగ్రహం సెంటర్ల మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అడుగడుగునా ఎంపీ మోపిదేవికి, అభ్యర్థి గణేష్కు ప్రజలు నీరాజనాలు పలికారు. అనంతరం డాక్టర్ గణేష్ ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో హెలా షారోన్కు నామినేషన్ పత్రాల్ని అందజేశారు. తొలుత తాలూకా సెంటరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రేపల్లెలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయం: గణేష్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు సహకారంతో రేపల్లె నియోజకవర్గంలో వెఎస్సార్ సీపీ విజయం ఖాయమని డాక్టర్ ఈవూరు గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేపల్లె గడ్డపై వైఎస్సార్ సీపీ విజయ ఢంకా మోగించడం తథ్యమని తెలిపారు. బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థిగా నందిగం సురేష్, రేపల్లె అసెంబ్లీ అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నకు రేపల్లె అసెంబ్లీని కానుకగా అందించాలని కోరారు.
రానున్నది వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వమే
అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు మరోమారు ముఖ్యమంత్రిగా జగనన్న నాయకత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ ఈవూరు గణేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం విచ్చేసిన అశేష జనవాహినితో తాలూకా సెంటరులో మోపిదేవి మాట్లాడారు. కులరాజకీయాలను వీడి అభివృద్ధి సంక్షేమానికే పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు అడపా శేషు, గాదె మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, రేపల్లె, రేపల్లె రూరల్, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదె వెంకయ్యబాబు, వీరంకి ముక్తేశ్వరరావు, పయనం ఏడుకొండలు రెడ్డి, ఎంపీపీలు చింతల శ్రీకృష్ణయ్య, మత్తి దివాకర రత్నప్రసాద్, మోపిదేవి విజయ నిర్మల హరనాథ్బాబు పాల్గొన్నారు.
రేపల్లెలో అట్టహాసంగా డాక్టర్ గణేష్ నామినేషన్ దాఖలు అశేష జనవాహినితో తిరునాళ్లను తలపించిన కార్యక్రమం జన సంద్రమైన పట్టణ రహదారులు