చీరాల: వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఈనెల 24న నామినేషన్ దాఖలు చేస్తున్నానని, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని చీరాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ కోరారు. సోమవారం రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రామకృష్ణాపురంలోని తన ఇంటి నుంచి బుధవారం నామినేషన్ కార్యక్రమం ప్రసాద్ థియేటర్, కొట్లబజార్, ముంతావారి సెంటర్, గడియార స్తంభం సెంటర్, అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు జరుగుతుందని వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ చిమటా సాంబు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ జైసన్బాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కె.బాబ్జి, రూరల్ అధ్యక్షుడు అంకాళరెడ్డి, వేటపాలెం అధ్యక్షుడు బి.సుబ్బారావు, కార్పొరేషన్ల డైరెక్టర్లు జి.శ్రీనివాసరావు, ఎం.వైష్ణవి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జిల్లాలో నామినేషన్ల జోరు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లా వ్యాప్తంగా సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. బాపట్ల పార్లమెంట్ నుంచి నవతరం పార్టీ అభ్యర్థిగా నలమర్ల తరుపతిరావు, జయభీమ్ రావు భారత్ పార్టీ నుంచి పర్రె కోటయ్య నామినేషన్లు దాఖలు చేశారు. చీరాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్, కరణం బలరాం కృష్ణమూర్తి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్య ర్థిగా ఎంఎం కొండయ్య, బాల కొండమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్, బహుజన సమాజ్ పార్టీ నుంచి కాటి మార్క్, రిఫార్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తన్నీరు విజయ్, స్వతంత్య్ర అభ్యర్థులుగా శ్రీనివాసరావు, లేళ్ల రాంబాబులు నామినేషన్లు దాఖలు చేశారు.
● వేమూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు, వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వరికూటి అశోక్బాబు, వరికూటి గౌతమ్, జయభారత్ నేషనల్ పార్టీ తరపున భాగ్యరాజు నామినేషన్లు వేశారు.
● అద్దంకి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పానెం చిన హనిమిరెడ్డి, పానెం ఆదిలక్ష్మి, జయ భీమ్ భారత్ పార్టీ పి.హేబేలు, జాతీయ సమ సమాజం పార్టీ నుంచి బాచిన రాంబాబు, నవోదయ పార్టీ తరపున కుంటుపల్లి గోపి, స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాసరావు, పి. శ్రీనివాసులు నామినేషన్లు దాఖలు చేశారు.
● పర్చూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు నామినేషన్లు దాఖలు చేశారు.
● రేపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఈవూరి గణేష్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బెల్లంకొండ సుబ్బారావు, స్వతంత్య్ర అభ్యర్థిగా రాంబాబు నామినేషన్లు దాఖలు చేశారు.
25న ఏపీ గురుకుల
పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష
చిలకలూరిపేట టౌన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలల్లో 5,6,7,8వ తరగతుల ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు రాజాపేట ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. సుబ్రహ్మణ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి ఏపీఆర్ఎస్ క్యాట్ –2024 పేరిటా నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. హాల్ టికెట్లను విద్యార్థిలకు పంపమని, httr://aprr.apcfrr.in అనే విద్యాలయ ప్రత్యేక వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. ఐడీ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత
గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు.