breaking news
Ad - Sakshi_Home_Sticky
-
హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు
విశాఖ లీగల్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ నగరంలోని రెండో అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు డోలా సాయి (23) నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొబ్బరితోట నివాసి. రౌడీ షీటర్గా స్థానికంగా పెత్తనం చెలాయించేవాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి... ఆ బంధానికి సదరు మహిళ భర్త అడ్డం వస్తున్నాడని పలుమార్లు అతడిని హెచ్చరించాడు. అయినా మాట వినకపోవడంతో 2018 అక్టోబర్ 20న అతని మెడపై కత్తితో సాయి బలంగా గాయపరిచాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు డోలా సాయిపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. -
ఎన్నికల ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా
మహరాణిపేట: ఎన్నికల సమయంలో అభ్యర్థులతోపాటు ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. విశాఖ పార్లమెంట్ వ్యయ పరిశీలకులు రంగ రాజన్, భీమిలి, తూర్పు, దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌమ్య పాండేజైన్, ఉత్తర, పశ్చిమ, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు అక్తా జైన్తో కలిసి శుక్రవారం జిల్లాలో నీనా నిగం పర్యటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువుల తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అధికారులందరితో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సమాచార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సంప్రదింపులు చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదని, వారు చేసే ఆర్థిక లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీనా నిగం చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక గ్రీవెన్స్ కమిటీ ద్వారా సాధారణ పౌరుల నుంచి జప్తు చేసిన నగదును ఆధారాలు పరిశీలించి త్వరితగతిన వెనక్కి ఇచ్చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ డా.ఎ.రవిశంకర్, ఎంసీసీ నోడల్ అధికారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ కె.ఎస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్కుమార్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల గురించి ఆమెకు వివరించారు. క్షేత్రస్థాయిలో చర్యలు, సేవలు కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ 11 చోట్ల చెక్ పోస్టులు పెట్టామని, ఇప్పటి వరకు వస్తు, ధన రూపంలో రూ.4.92 కోట్ల నగదును సీజ్ చేశామని తెలిపారు. మొత్తం 110 రకాల బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నాయని వివరించారు. 24/7 పనిచేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 16 మంది నోడల్ అధికారులను నియమించామని, 502 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 1,457 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సీ–విజిల్ ద్వారా 388 వినతులు రాగా.. 285 వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించామని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ఘటనల్లో 59 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. బాధ్యతగా ఎన్నికల విధులు జిల్లా అధికారులతో రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం నియోజకవర్గాల వారీగా సమీక్షలు -
రె‘బెల్స్’
● టీడీపీలో కొనసాగుతున్న సీట్ల ఫైట్ ● మాడుగుల అభ్యర్థిగా పైలా నామినేషన్ ● మాడుగుల అభ్యర్థిగా 22న నామినేషన్ వేస్తానని బండారు ప్రకటన ● పాడేరు నుంచి నామినేషన్ వేసిన కిల్లో రమేష్ నాయుడు ● టికెట్ మార్చి గిడ్డి ఈశ్వరికి ఇస్తారంటూ జోరందుకున్న ప్రచారం ● అరకులో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సివేరి అబ్రహం ● అదే బాటలో దొన్నుదొర.. నామినేషన్ వేసేందుకు సిద్ధం సాక్షి, విశాఖపట్నం: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల కేటాయింపు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు అధినేత తీరుపై మండిపడుతున్నారు. మరో వైపు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో భంగపడ్డ నాయకులు టీడీపీ రెబల్స్గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. మాడుగుల, పాడేరు, అరకు.. ఇలా ప్రతిచోటా రెబెల్స్ మోగుతున్నాయి. దీంతో తిరుగుబావుటా ఎగరేసిన వారికి తాయిళాలు.. నామినేటెడ్ పదవులు ఇస్తామని జపిస్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మడం లేదు. అసలు ఎన్ని పదవులు ఉంటాయి.. ఒకే పదవి ఎంత మందికి ఇస్తారు.. అని భావించిన టికెట్ రాని టీడీపీ నేతలు రెబల్స్గా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడిన వారంతా లోలోపల రగిలిపోతున్నారు. బండారు ఇన్.. పైలా అవుట్ ! మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే భీ పారం ఇవ్వకముందే.. బండారు సత్యనారాయణమూర్తి తనకే టికెట్ ఇస్తారని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పైలాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం సాగుతోంది. ఒకే వేళ తన సీటు మార్చితే లోకల్గా ఉన్న గవిరెడ్డి లేదా కుమార్కు ఇచ్చినా తాను సహకరిస్తాను తప్పా ఎక్కడి నుంచో వచ్చిన బండారుకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్ వేసి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తనను కాదని బండారుకి టికెట్ ఇస్తే.. ఆయన బండారం బయటపెట్టి.. ఎలా నెగ్గుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అరకులో డబుల్ ధమాకా.. అరకు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోటు తప్పేలా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా చంద్రబాబు ప్రకటించిన టికెట్ అరకులోయే. ఈ స్థానంలో టీడీపీ తరఫున దొన్నుదొర నిలబడుతున్నారంటూ ప్రజలందరి ముందు ప్రకటించారు. చివరికి ఆ టికెట్ను బీజేపీకి కేటాయించారు. దీంతో దొన్నుదొర చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇదే స్థానం కోసం ఆశలు పెట్టుకున్న అబ్రహంను కూడా చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో అబ్రహం, దొన్నుదొర ఇద్దరూ చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అబ్రహం కూడా నామినేషన్ వేశారు. దొన్నుదొర కూడా 24న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అక్కడా తిరుగుబావుటా...! పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రగులుతోంది. పాడేరు టికెట్ ఆశించి భంగపడిన గిడ్డి ఈశ్వరి రెబల్గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరించారు. అయితే.. కిల్లు రమేష్ నాయుడుకు హ్యాండ్ ఇచ్చి.. గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీ–ఫారం ఈశ్వరికి ఇస్తే.. తాను రెబల్గా పోటీ చేస్తానని కిల్లు హెచ్చరించారు. రంపచోడవరంలోనూ వంతల రాజేశ్వరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచి.. చంద్రబాబు, లోకేష్కు తన సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. ఇలా.. ప్రతి చోటా టీడీపీకి రెబల్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. తిరుగుబాటు చేస్తామన్న నాయకులందర్ని పిలిపించి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబు హామీలను గమనించిన అసంతృప్త నేతలు అధికారంలోకి రాక ముందు హ్యాండి ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరని మండిపడుతున్నారు. ఎన్నికల్లోనే తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
నయన మనోహరం .. నృసింహ కల్యాణం
సింహాచలం: సింహగిరి కల్యాణ సిరిని సంతరించుకుంది. చైత్రశుద్ధ ఏకాదశి వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి నయనానందకరంగా జరిగింది. శ్రీ మహా విష్ణువు అవతారమైన వరాహ లక్ష్మీ నృసింహస్వామిని పెళ్లి కుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా దర్శించిన భక్తులు తన్మయులయ్యారు. కొట్నాల ఉత్సవంతో శ్రీకారం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలు కుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగరవేసి ధ్వజారోహణ నిర్వహించారు. రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం స్వామి వారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో.. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో కొలువుదీర్చారు. ఈ పల్లకీలను సింహగిరి మాడవీధుల్లో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికలపై అధిష్టింపజేశారు. స్వామివారు, అమ్మవార్ల వైభవాన్ని, గొప్పతనాన్ని చాటిచెబుతూ జరిగిన ఎదురు సన్నాహోత్సవం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా రావులపాలే నికి చెందిన కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, కందుకూరి సత్య సూర్యనారాయణమూర్తి వ్యవహరించారు. నేత్రపర్వం..రథోత్సవం సింహగిరి మాడ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథంలో ఉన్న స్వామివారిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజన సందోహం రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, దేవస్థానం ట్రస్ట్బోర్డు మాజీ సభ్యులు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్రాజ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. కనులపండువగా కల్యాణోత్సవం సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం జరిపించారు. స్వామివారిని, అమ్మవార్లను నృసింహ మండపంలోకి తీసుకొచ్చి, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై కొలువుదీర్చి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తదుపరి భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీసీపీ సత్తిబాబు, నార్త్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన దాసరి రాము ట్రూప్ పులివేషాలు, విజయనగరం జిల్లా వేపాడకు చెందిన సింహాద్రి అప్పన్న గరిడి నృత్యం, విశాఖలోని దువ్వాడకు చెందిన నూకాంబిక ట్రూప్ కోలాటం, వడ్లపూడికి చెందిన వెంకట పరమేశ్వరి అన్నమయ్య సంఘం మహిళల కోలాటం, కూర్మాన్నపాలేనికి చెందిన శ్రీ బాలాజీ త్రిశక్తి కోలాటం సంఘం మహిళలు చేసిన నృత్యం, మాధవధారకు చెందిన లలిత వైభవ కోలాటం, విజయనగరానికి చెందిన పులివేషాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కనువిందుగా ఎదురు సన్నాహోత్సవం వైభవంగా రథోత్సవం పరవశించిన భక్తజనం సింహగిరికి కల్యాణ సిరి కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులుమహిళల సాంస్కృతిక ప్రదర్శన -
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ బెదిరించారు
ఆనందపురం: అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తన ఇంటికి టీ తాగడానికి వచ్చి పార్టీ మారాలని బలవంతం చేశారని పందలపాక సర్పంచ్ ధవళ నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తి వచ్చి పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ మారాలని తనను బలవంతం చేశారని, కుదరదని తేల్చి చెప్పేశానన్నారు. నాయకులను లొంగదీసుకోవడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వివరించారు. తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి గెలుపునకు కృషి చేస్తానన్నారు. టీడీపీ నాయకుల బెదిరింపులకు లొంగనని చెప్పారు. పందలపాక సర్పంచ్ ధవళ నాగేశ్వరరావు
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019