breaking news
Ad - Sakshi_Home_Sticky
-
మంచు ఎడారిలో నిరసన మంట
ఆమిర్ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చాలామందికి తెలుసు. కానీ, అందులో ఆమిర్ పోషించిన ఫున్సుఖ్ వాంగ్దూ పాత్రకు స్ఫూర్తినిచ్చిన ఇంజనీర్, విద్యాసంస్కరణవేత్త సోనమ్ వాంగ్ఛుక్ గురించి బహుశా కొందరికే తెలుసుంటుంది. ఇటీవల చేసిన నిరవధిక నిరాహార దీక్ష పుణ్యమా అని ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. ప్రపంచమంతటా మారుమోగి పోయింది. హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్లో శరీరం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆయన సాగించిన నిరశన ఉద్యమానికి మద్దతుగా వేలాది జనం ముందుకు రావడం విశేషం. 21 రోజుల అనంతరం మంగళవారం ఆయన నిరాహార దీక్ష ముగిసినప్పటికీ, లద్దాఖ్కు రాష్ట్ర ప్రతిపత్తి నుంచి అలవిమీరిన అభివృద్ధితో అపాయంలో పడుతున్న ఆ ప్రాంత జీవావరణం దాకా అనేక అంశాలు చర్చలోకి రాగలిగాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకున్నా, ప్రస్తుతానికైతే లద్దాఖ్ ప్రజలు తమ డిమాండ్లను పాలకుల ముందు మరోసారి ఉంచి, ఒత్తిడి తేగలిగారు. నిజానికి, దాదాపు 3 లక్షల జనాభా గల లద్దాఖ్లో మొత్తం 8 తెగల వాళ్ళుంటారు. 2019 ఆగస్ట్ 5న మునుపటి జమ్మూ – కశ్మీర్ నుంచి విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే ఈ ప్రాంత ప్రజలు లద్దాఖ్కు పూర్తి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలనీ, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనీ, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటుచేయాలనీ, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలనీ డిమాండ్ చేస్తున్నారు. 2020 నుంచి వారు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠ – తాజా ఉద్యమం. లద్దాఖ్ ప్రాంతపు ఉన్నత ప్రాతినిధ్య సంస్థ, అలాగే కార్గిల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్’ (కేడీయే) మద్దతుతో నెలన్నర క్రితమే ఫిబ్రవరి మొదట్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో కూర్చొని లద్దాఖ్ను ఆడించాలనుకుంటే కుదరదంటూ ప్రజల్లోని అసమ్మతిని ఆ ప్రదర్శన తేటతెల్లం చేసింది. కీలకమైన విధాన నిర్ణయాలలో తమ స్థానిక స్వరాలకు చోటులేకపోవడమే ఈ నిరసనలకు ప్రధాన ప్రేరకమైంది. ఒకప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జమ్మూ–కశ్మీర్ విధాన పరిషత్కు స్పీకర్,ఎంపీ... ఇంతమంది ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతానికి ఉండేవారు. అలాంటిది ప్రస్తుతం అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికార గణపాలన. లద్దాఖ్కు మిగిలింది ఇప్పుడు పోర్ట్ ఫోలియో లేని ఒకే ఒక్క ఎంపీ. జిల్లాకు ఒకటి వంతున రెండు స్వతంత్ర పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళు ఉన్నప్పటికీ, అధికారాల పంపిణీపై స్పష్టత లేదు. ఇక, ఆర్టికల్ 370 రద్దు అనంతరం తీసు కున్న ప్రశ్నార్హమైన పాలనాపరమైన నిర్ణయాలు అనేకం. దానికి తోడు ఆకాశాన్ని అంటుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో జనం గగ్గోలు పెడుతున్నారు. భూ హక్కులలో మార్పులు, అలాగే స్థానిక ప్రయోజనాలకు విరుద్ధమైన పారిశ్రామిక విధాన రూపకల్పన లాంటివి ప్రజాగ్రహాన్ని పెంచాయి. లద్దాఖీ ఉద్యమకారుడు వాంగ్ఛుక్ దీక్షకు అంతటి స్పందన రావడానికి అదే కారణం. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున దాదాపు మంచు ఎడారిలా జనావాసాలు తక్కువగా ఉండే లద్దాఖ్ పర్యావరణ రీత్యా సున్నిత ప్రాంతం. అక్కడ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన అజెండా పైనా విమర్శలున్నాయి. పర్యాటకం ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థలో కీలకమే కానీ, దాన్ని అంతకు అంత పెంచాలని పర్యావరణానికి హాని కలిగిస్తే మొదటికే మోసం. లే ప్రాంతంలో మెగా ఎయిర్పోర్ట్,ఛంగ్థాంగ్ బయళ్ళలో 20 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సోలార్ పార్క్ లాంటి ప్రణాళికలపై ప్రభుత్వం పునరాలోచించాలని వాంగ్ఛుక్ లాంటివారు కోరుతున్నది అందుకే. పర్యావరణానికీ, స్థానికుల ప్రయోజనాలకూ అనుగుణంగానే అభివృద్ధి ఉంటే మేలు. లద్దాఖ్ సాంఘిక, సాంస్కృతిక ప్రత్యేకతల్ని పరిరక్షించేలా ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్నూ పాలకులు గుర్తించాలి. లద్దాఖ్, కార్గిల్లు రెండూ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, ఒకే ఎంపీ ప్రాతినిధ్యానికి తగ్గిపోవడమూ చిక్కే. ఈ రెండు విభిన్న ప్రాంతాలకు చెరొక పార్లమెంటరీ స్థానంపై ఆలోచించాలి. చైనాతో సరిహద్దులో నెలకొన్న లద్దాఖ్ కీలకమైనది. అందులోనూ హిమాలయ ప్రాంతంలో తన పరిధిని విస్తరించుకోవాలని డ్రాగన్ తహతహలాడుతున్న వేళ వ్యూహాత్మకంగానూ విలువైనది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకొనే భయాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. లద్దాఖ్ ప్రజల నమ్మకాన్ని చూరగొని, వారిని కలుపుకొని ముందుకు సాగడం ముఖ్యం. గతంలో శ్రీనగర్ నుంచి, ఇప్పుడేమో ఢిల్లీ నుంచి పాలిస్తున్నారే తప్ప స్వపరిపాలన సాగనివ్వడం లేదనే భావనను వారి నుంచి పోగొట్టడం ముఖ్యం. ఈ ఏడాది జనవరి మొదట్లో కేంద్ర హోమ్ శాఖ ఉన్నతాధికార సంఘాన్ని (హెచ్పీసీ) వేసింది. గత శనివారంతో కలిపి 3 భేటీలు జరిగినా పురోగతి లేదు. హెచ్పీసీ హోమ్ మంత్రి లేకపోగా, తాజా భేటీకి సహాయ మంత్రి సైతం గైర్హాజరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు వారికి చిత్తశుద్ధి ఉందా అన్నది అనుమానాలు రేపుతోంది. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ పాలనలోని పలు వైఫల్యాలను సహించి, భరించిన లద్దాఖ్ ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిర సన తెలిపారు. స్థానిక ఆకాంక్షలకు తగ్గట్టు న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఢిల్లీ పాలకులు సైతం ప్రజాభీష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం మేలు. లద్దాఖ్ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాటల్లోనే కాదు... చేతల్లోనూ చూపడం అవసరం. లేదంటే, మున్ముందు వాంగ్ఛుక్ దీక్షల లాంటివి మరిన్ని తలెత్తక తప్పదు. -
‘నిరాహార దీక్ష ముగిసినా.. నా పోరాటం ఆగదు’
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష మంగళవారం ముగిసింది. లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరో షెడ్యూల్ వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నిరాహార దీక్ష ముగింపుతో తన పోరాటం ఆగిపోదని సోనమ్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మార్చి 6 తేదీనా ఈ దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘నిరాహార దీక్ష విరమించే కార్యక్రమంలో ఏడు వేల మంది పాల్గొన్నారు. నేను మళ్లీ పోరాటం చేస్తా. నా పోరాటంలో ఈ నిరాహార దీక్ష కేవలం మొదటి అడుగు మాత్రమే. మహాత్మా గాంధీ చేపట్టిన నిరాహారదీక్షల్లో 21 రోజుల దీక్షే ప్రధానమైంది. ఈ రోజు చాలా ముఖ్యమైంది. కేవలం తొలి దశ నిరాహార దీక్ష మాత్రమే నేటి( మంగళవారం)తో ముగిసింది. కానీ పోరాటం ముగిసిపోలేదు. మహిళలు 10 రోజు పాటు మరో నిరాహార దీక్ష చేపట్టనున్నాను. యువత, బౌద్ధ సన్యాసులు కూడా పాల్గొంటారు. ఇలా నేను, నా తర్వాత మహిళలు నిరాహార దీక్ష చేపడతారు. ఇలా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. నా నిరాహార దీక్షలో ఒకే రోజు సుమారు 6వేల మంది పాల్గొన్నారు’ అని సోనమ్ వాంగ్చుక్ ఎక్స్ వేదికగా తెలిపారు. END 21st Day OF MY #CLIMATEFAST I'll be back... 7000 people gathered today. It was the end of the 1st leg of my fast. Btw 21 days was the longest fast Gandhi ji kept. From tomorrow women's groups of Ladakh will take it forward with a 10 Days fast, then the youth, then the… pic.twitter.com/pozNiuPvyS — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 అంతకు ముందు ‘ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దేశానికి చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతి రాజనీతిజ్ఞులు కావాలని నేను ఆశిస్తున్నా. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు మా డిమాండ్లను నెరవేర్చి వారు కూడా రాజనీతిజ్ఞులమని రుజువు చేసుకుంటారని ఆశిస్తున్నా’అని సోనమ్ వాంగ్చుక్ ‘ఎక్స్’లో పోస్ట్చేసిన వీడియోలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5 ఆగస్ట్ 2019 జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్, లడాక్ కేంద్రగా ప్రాంతపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. లేహ్, కార్గిల్ జిల్లాలతో లాడక్.. కేంద్ర పాలిత ప్రాంతంగా విస్తరించి ఉంది. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర... వాంగ్చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్చుక్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్లో ప్రకాష్ రాజ్ బర్త్డే
కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ హక్కులను, పర్యావరాణాన్ని కాపాడాలంటూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో మార్చి 6న నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఉద్యమానికి పర్యావరణ వేత్తలు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు పలుకు తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మార్చి 26, మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ వాంగ్ చుక్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఉద్యమ ప్రదేశానికి తరలి వెళ్లారు. వారికి మద్దతు తెలపడం ద్వారా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నానని తెలిపారు. ‘‘మన దేశం .. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం లడఖ్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలుద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఉద్యమకారుల వీడియోను కూడా షేర్ చేశారు. Its my birthday today .. and i’m celebrating by showing solidarity with @Wangchuk66 and the people of ladakh who are fighting for us .. our country .. our environment and our future . 🙏🏿🙏🏿🙏🏿let’s stand by them #justasking pic.twitter.com/kUUdRakYrD — Prakash Raj (@prakashraaj) March 26, 2024 మరోవైపు సేవ్ లడఖ్, సేవ్ హిమాలయాస్ అంటూ చేపట్టిన వాంగ్చుక్ దీక్ష 21 రోజులకు చేరింది. ఇంతవరకూ రాజకీయ నాయకులనుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వాంగ్ చుక్ ట్వీట్ చేశారు. తన దీక్ష, ఆరోగ్యంపై ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తున్న ఆయన ప్రజలనుంచి తనకు లభిస్తున్న మద్దతుపై సంతోషాన్ని, కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులు కాదంటూ వాంగ్చుక్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా ఇకనైనా స్పందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 21st Day OF MY #CLIMATEFAST 350 people slept in - 10 °C. 5000 people in the day here. But still not a word from the government. We need statesmen of integrity, farsightedness & wisdom in this country & not just shortsighted characterless politicians. And I very much hope that… pic.twitter.com/X06OmiG2ZG — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 -
తల్లి నేర్పిన ఓనమాలే ‘శాపం’ గా మారాయి..
ఒక పోటీలో వందకు పది మంది ఓడితే.. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అదే వందలో 70 మంది విఫలమైతే.. మొత్తం వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. ఆ వైఫల్యాన్ని గుర్తించి తన అనుభవంతో మార్పు తేవడానికి ప్రయత్నించాడు సోనమ్ వాంగ్చుక్. సంప్రదాయేతర సిలబస్ను రూపొందించి ‘ఆసాన్ భాషామే’(సులభమైన భాషలో) పిల్లలకు పాఠాలు బోధించడం, మంచు నీటి ప్రవాహాలను గడ్డ కట్టించి.. వర్షాభావ పరిస్థితులప్పుడు వాడుకోవడం, సోలార్ ఆర్మీ టెంట్లు.. ఇలా ఆయన బుర్రలోంచి పుట్టిన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఒక ఇంజినీర్గా, ఆవిష్కరణకర్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన వాంగ్చుక్.. తన జీవితం కంటే ఆవిష్కరణలు, వాటి వెనుక ఆలోచనలే పిల్లలకు పాఠంగా ఉండటాన్ని ఇష్టపడతానని చెప్తుంటాడు. సోనమ్ వాంగ్చుక్ పుట్టినరోజు ఇవాళ. 1966 సెప్టెంబర్ 1న లడఖ్లోని లే జిల్లా ఉలెటోక్పో లో వాంగ్చుక్ జన్మించాడు. ఇంజినీర్ కమ్ సైంటిస్ట్ అయిన సోనమ్ వాంగ్చుక్ స్ఫూర్తి నుంచే త్రీ ఇడియట్స్ సినిమా తెరకెక్కిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో అమీర్ క్యారెక్టర్ పున్షుక్ వాంగ్డూ(రాంచో) చూపించే ప్లాన్లన్నీ వాంగ్చుక్ నిజజీవితంలో అమలు చేసినవే. తల్లి నేర్పిన పాఠాలే.. వాంగ్చుక్ పుట్టిన ఊళ్లో బడి లేదు. దీంతో 9 ఏళ్ల వయసుదాకా ఆయన బడి ముఖం చూడలేదు. ఆ వయసులో గృహిణి అయిన తల్లి నేర్పిన ఓనమాలే ఆయనకు దిక్కయ్యాయి. వాంగ్ చుక్ తండ్రి రాజకీయ వేత్త(మాజీ మంత్రి కూడా). అందుకే ఎలాగోలా శ్రీనగర్లోని ఓ స్కూల్లో కొడుక్కి అడ్మిషన్ తెచ్చాడు. అయితే వాంగ్చుక్కు తల్లి నేర్పిన భాషంతా స్థానిక భాషలో ఉండడంతో.. స్కూల్లో బాగా ఇబ్బందిపడేవాడు. టీచర్లు అడిగిన దానికి సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉంటే.. ‘సుద్దమొద్దు’ అనే ముద్ర పడింది. తన తల్లి నేర్పిన ఆ ఓనమాలే తన పాలిట శాపం అయ్యాయని, అలా జరిగి ఉండకపోతే తన జీవితం కుటుంబానికి దూరం అయ్యేది కాదని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడాయన. అంతేకాదు శ్రీనగర్ బడిలో నడిపిన రోజుల్ని.. చీకటి రోజులుగా అభివర్ణించుకుంటాడు. టీచర్లు, తోటి విద్యార్థులు చూసే అవమానమైన చూపులకు, కామెంట్లకు భరించలేక ఒకదశకొచ్చేసరికి ఢిల్లీకి పారిపోయాడు. పాకెట్మనీ లేకున్నా.. ఒంటరిగా ఢిల్లీకి చేరిన వాంగ్చుక్.. విశేష్కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ను కలిసి తన పరిస్థితిని వివరించాడు. తన స్కూల్ చదువులు పూర్తయ్యేదాకా ఆచూకీ పేరెంట్స్కు చెప్పొద్దంటూ బతిమాలుకున్నాడు వాంగ్చుక్. అది అర్థం చేసుకుని, మాటిచ్చి వాంగ్చుక్కు తమ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చాడు ఆ ప్రిన్స్పాల్. చదువులో రాటుదేలాక విషయాన్ని పేరెంట్స్కి తెలియజేసి.. తిరిగి వాళ్ల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆపై శ్రీనగర్ ఎన్ఐటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసి మరోసారి కుటుంబానికి దూరం అయ్యాడు. వాంగ్చుక్ ఆర్థిక నిపుణుడు కావాలన్నది ఆ తండ్రి కోరిక. అది నెరవేరకపోవడంతో కొడుకును అసహ్యించుకుని తిరిగి దగ్గరకు తీసుకోలేదు. పేరెంట్స్కు దూరమైన వాంగ్చుక్.. తన స్కాలర్షిప్తోనే హాస్టల్ చదువులు కొనసాగించాడు. ఆపై ఓ ప్రొఫెసర్ సాయంతో ఫ్రాన్స్లో ఎర్తెన్ ఆర్చిటెక్చర్ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత ఇండియాకు వచ్చిన ఆయన జీవితం.. లడఖ్ పరిస్థితుల కారణంగా కొత్త మలుపు తిరిగింది. కామన్సెన్స్ ఉపయోగించి ప్రజల అవసరాలను తీర్చే ఆవిష్కరణలకు బీజం పడింది ఇక్కడి నుంచే.. ►లడఖ్లో అడుగుపెట్టేనాటికి.. అక్కడి విద్యార్థుల పాస్ పర్సంటేజ్ 5 శాతంగా తేలింది. దీంతో విద్యా సంస్కరణలకు బీజం వేశాడు. నిపుణులైన గ్రామస్తులకు-తల్లిదండ్రులకు శిక్షణ ఇప్పించాడు. వాళ్ల ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పించాడు. అలా ఐదు శాతం నుంచి 75 శాతానికి పాస్ పర్సంటేజ్ను మూడేళ్లలోనే సాధించి చూపించాడాయన. ► స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ను కొందరు విద్యార్థులతో 1988లో స్థాపించాడు. పూర్తి సోలార్ ఎనర్జీతో నడిచే విద్యాలయం ఇది. ► స్వచ్ఛమైన నీటిని గ్రామ ప్రజలకు అందించేందుకు ప్రవాహాలను దారి మళ్లించే ప్లాన్లు అమలు చేశాడాయన. ఐస్ స్థూపాలను కోన్ ఆకారంలో నెలకొల్పి కృత్రిమ హిమానీనదాలతో నీటి కరువును తీర్చే ప్రయత్నం చేశాడు. 2013లో ‘ఐస్ స్తూప’ ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ► సోషల్ ఇంజినీర్గా ఎన్నో విచిత్రమైన ఆవిష్కరణలు చేశాడు వాంగ్చుక్. సోలార్ ప్రాజెక్టులతో లడఖ్ గ్రామీణ ముఖచిత్రం మార్చేశాడు. ఆ ఆవిష్కరణలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు కూడా. ► ప్రభుత్వ, కార్పొరేట్ వైఫల్య చదువుల్ని ఏలియన్ చదవులుగా వర్ణిస్తాడాయన. సంప్రదాయేతర బడి.. విద్యా సంస్కరణలకు బీజం వేయడంతో పాటు కొన్నాళ్లపాటు ప్రభుత్వ ఎడ్యుకేషన్ అడ్వైజరీగా వ్యవహరించాడు కూడా. ► నానో కారు వైఫల్యానికి కారణాల్లో ఒకటి.. పేదల కారుగా ప్రచారం చేయడమే అంటాడు సోనమ్ వాంగ్చుక్. పేదవాళ్లే ఆ కారును కొంటారనే ‘సొసైటీ యాక్సెప్టెన్సీ’ వల్ల దానిని జనాలు తిప్పికొట్టారని చెప్పాడు. ► రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాంగ్చుక్.. వ్యవస్థ లోపాల వల్లే మంచి విద్య అందట్లేదని అభిప్రాయపడుతుంటాడు. ప్రజల ప్రాధాన్యం మారినప్పుడే.. ప్రభుత్వాల ఆలోచనా విధానం మారుతుందని చెప్తాడాయన. - సాక్షి, వెబ్డెస్క్ స్పెషల్ -
బాయ్కాట్ చైనా
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘బాయ్కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమం తెరపైకొచ్చింది. 3ఇడియట్స్ సినిమాకు ప్రేరణగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్చుక్ యూట్యూబ్లో షేర్ చేసిన వీడియో ఈ పరిణామానికి ఊపిరిపోసింది. వాంగ్చుక్కు పలువురు నెటిజన్లు, సెలిబ్రిటీలు మద్దతు పలికారు. వీరిలో అర్షద్ వార్సి, మిలింద్ సోమన్, రణ్వీర్ షోరే తదితరులున్నారు. చైనా వస్తువుల వాడకం మానేయాలని వీరు కోరుతున్నారు. ‘చైనా వస్తువులను వాడటం నేను ఆపేస్తున్నా. మీరూ ఆపండి’అని అర్షద్ వార్సీ కోరారు. చైనా వీడియో అప్లికేషన్ టిక్టాక్ను వాడబోనంటూ యాక్టర్, మోడల్ మిలింద్ ఉషా సోమన్ ట్వీట్ చేశారు. నటుడు రణ్వీర్ షోరే ఆమెకు మద్దతు ప్రకటించారు. భారత్ తయారీ వస్తువులనే వాడాలంటూ టీవీ నటి కామ్య పంజాబీ కోరారు. చైనా ఉత్పత్తులతో వాణిజ్య సంబంధాలున్న వారంతా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు. రచయిత రాజ్ శాండిల్య కూడా ‘బాయ్కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు ఇచ్చిన విధంగా ప్రపంచం చైనాను ఏకాకిగా చేయాలని ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ కోరారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019