breaking news
-
ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. ప్రైవేట్ వ్యక్తిది కాదన్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ/భూపాలపల్లి: అటవీశాఖకు ఓ వ్యక్తికి మధ్య చోటు చేసుకున్న భూ వివాదానికి 40 ఏళ్ల తర్వాత తెరపడింది. వరంగల్ జిల్లాలోని 106.34 ఎకరాల అటవీ భూమి ప్రైవేట్ భూమి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అత్యంత విలువైన ఆ భూమి అటవీశాఖకు చెందినదేనంటూ గురువారం తీర్పునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరే‹Ù, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీం ధర్మాస నం గురువారం కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తికి చెరో రూ.5 లక్షలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా)కు రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. వరంగల్ జిల్లా కొంపల్లిలోని సర్వే నంబర్ 171/3 నుంచి 171/7 వరకు ఉన్న 106.34 ఎకరాలు తమవేనని అబ్దుల్ఖాసీం తదితరులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు 1981లో జాయింట్ కలెక్టర్ను ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ నిరాకరించడంతో 1984లో ఆ భూమిని డీ నోటిఫై చేయాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతోపాటు వరంగల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. అక్కడ అనుకూలంగా ఆదేశాలు వచ్చినప్పటికీ ఉమ్మడి హైకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేసింది. అనంతరం ఆ వ్యక్తి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. తెలంగాణ హైకోర్టు ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సుందరేష్ ధర్మాసనం గురువారం ఆదేశాలు వెలువరించింది. భూమి తమదని చెప్పుకోవటానికి ఆ వ్యక్తులకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ సమయంలో తెలంగాణ హైకోర్టు, రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడం.. సుప్రీంకోర్టులోనూ అనుకూలంగా రిజాయిండర్ దాఖలు చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వాద, ప్రతివాదులకు జరిమానా విధిస్తూ అడవుల ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించింది. అడవుల ప్రాధాన్యతను గుర్తించడంలో మనుషులకు ‘మతిమరుపు’ ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అడవులు నిస్వార్థంగా మాతృసేవ అందిస్తున్నప్పటికీ ప్రజలు నాశనం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అడవులను పరిరక్షించడం మనుషుల బాధ్యత అని వాటి క్షీణత వల్ల తామే నష్టపోతామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించింది. పర్యావరణ కేంద్రీకృత విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలని తెలిపింది. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై చర్యలు: డీఎఫ్ఓ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు డీఎఫ్ఓ వసంత తెలిపారు. ఈ కేసులో అటవీశాఖ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఏఓఆర్ శ్రావణ్కుమార్ వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా అటవీశాఖ ఆ భూములు తమ శాఖకే చెందుతాయని వాదించగా, రెవెన్యూ శాఖ మాత్రం ఆ భూమిపై ప్రైవేట్ వ్యక్తికే హక్కులున్నాయని అఫిడవిట్లు దాఖలు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి రెండు ప్రభుత్వ శాఖలు విభిన్న వాదనలు వినిపించగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకే వాదనను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశించినట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్లో సదరు 106.34 ఎకరాలను అటవీ భూమిగా స్పష్టంచేశారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి దాన్ని అటవీ భూమిగా గుర్తిస్తూ తీర్పు వెలువరించినట్లు వసంత తెలిపారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుంది. -
ఈ ‘అసైన్డ్’ భూములపై పట్టాదారులకే హక్కులు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. అర్హత ఉన్న అసైన్డ్ భూములకు సైతం యాజమాన్య హక్కులు కల్పించేందుకు రెవెన్యూ అధికారులు వివిధ కారణాలతో వెనుకాడుతుండడంతో, వారికి ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన భూములన్నింటిపైనా ఆంక్షలు తొలగించి యాజమాన్య హక్కులు కల్పించాలని తెలిపింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల జరిగిన వర్క్షాప్లో అసైన్డ్ భూములు, చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్ ఎల్పీఎంల విభజన, ప్రొవిజినల్ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం వీటిపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో యాజమాన్య హక్కులు ఇవ్వొచ్చు ♦ డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్ కాపీ, అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్ల్యాండ్, పీఓఎల్ఆర్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదార్ పాస్ బుక్ ఆధారంగానైనా ఆ భూములకు యాజమాన్య హక్కులివ్వాలి. భూమి పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఎవరైనా పట్టాదారు పాస్బుక్ నకిలీదని తహశీల్దార్ ధృవీకరిస్తే, దానిని నిరూపించే బాధ్యత కూడా తహశీల్దార్దే. ♦ భూ బదలాయింపు (ల్యాండ్ కన్వర్షన్), అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. ఈ తరహా భూముల రికార్డులు లభించకపోయినా, లోతుగా పరిశీలన జరిపి, యాజమాన్య హక్కులివ్వాలి. ♦ భూ బదలాయింపు జరగని సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు, రిట్ పిటిషన్ 140/2022పై హైకోర్టు ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. ♦ ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి యాజమాన్య హక్కులివ్వొచ్చు. ♦ డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబర్తో సరిపోలకపోతే, వారి ఆ«దీనంలో ఉన్న భూమి సర్వే నంబర్ను నమోదు చేయాలి. యాజమాన్య హక్కులివ్వడానికి వారికి భూమి అసైన్ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ♦ ఖాతా నంబర్ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి అసైన్డ్ భూములుగా నమోదవని వాటిని అసైన్మెంట్ రీ వెరిఫికేషన్కు పంపాలి. ఈ భూములకు యాజమాన్య హక్కులిచ్చేందుకు ఎల్రక్టానిక్ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ పేరును చేర్చడానికి సాఫ్ట్వేర్ను మారుస్తారు. ♦ ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాని అసైన్డ్ భూములను అసైన్డ్ జాబితాలో చేర్చేందుకు దరఖాస్తుల కోసం ఏపీ సేవా పోర్టల్లో ఓ ఆప్షన్ ఏర్పాటు. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్లో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వొచ్చు. ♦ అసైన్మెంట్ చేసిన రాస్తా పోరంబోకు భూములకు భూ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) చేసి వాటికి హక్కులివ్వాలి. ♦ ఆర్ఎస్ఆర్లో అటవీ భూమిగా నమోదైన భూమి, అసైన్మెంట్ జరిగి ఆర్ఓఆర్ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టం సెక్షన్ 4(1) కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. ♦ భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి–నాట్ ఎలాటెడ్’గా నమోదై.. వాస్తవానికి ఆ భూమి అసైన్మెంట్ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్కు పంపాలి. పరిశీలనలో అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. ♦ అర్హత ఉన్న అసైన్డ్ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి. రిమార్క్స్ కాలమ్లో యాజమాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు. ♦ రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్ భూములన్నింటినీ మళ్లీ ధృవీకరణ కోసం వీఆర్వో లాగిన్కు పంపాలి. ధృవీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి. ♦ 20 ఏళ్ల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా యాజమాన్య హక్కులివ్వాలి. చుక్కల భూములపై.. 1.12 లక్షల ఎకరాల చుక్కల భూములు అసైన్డ్ భూములు కావడంతో అవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ భూములన్నీ 20 ఏళ్ల క్రితం అసైన్మెంట్ చేసినవి. ఈ భూములన్నింటినీ 22ఏ జాబితాతోపాటు చుక్కల భూముల జాబితా నుంచి కూడా తొలగించాలి. ఈనాం భూములపై.. ♦ 22ఎ జాబితా నుండి తొలగించిన గ్రామ సర్విస్ ఈనాం భూములు వెబ్ల్యాండ్ ఎల్రక్టానిక్ రికార్డుల్లో కనపడాలి. ఆలయాలు, ఎండోమెంట్, వక్ఫ్, ధార్మిక సేవా ఈనాంలు మినహా మిగిలిన అన్ని ఈనాం భూములను 22ఎ జాబితా నుండి తొలగించాలి. అలాంటి ఈనాం భూములన్నీ ఈనాం/ఎస్టేట్/రైత్వారీ గ్రామంలో భాగమైనా, దాంతో సంబంధం లేకుండా తొలగించాలి. ♦ భవిష్యత్తులో ఏ రీ సర్వే గ్రామాల్లోనూ ఉమ్మడి ఎల్పీఎంలు సృష్టించకూడదు. ఎక్కడైనా ప్రజా సంఘాలు ఉమ్మడి ఎల్పీఎంల కోసం అభ్యర్థిస్తే తహశీల్దార్లు వారి స్టేట్మెంట్లు రికార్డు చేసి వాటి ఆమోదం కోసం ఆర్డీవోలకు పంపాలి. ♦ తనఖాలో ఉన్న భూములు యాజమాన్య హక్కుల కల్పనకు అర్హత కలిగి ఉంటే కేవలం తనఖాలో పెట్టారనే కారణంతో వాటిని తిరస్కరించకూడదు. యాజమాన్య హక్కులు కల్పించిన వెంటనే వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించాలి. -
కరకట్ట ఆక్రమణలైనా కూల్చాల్సిందే
సాక్షి, అమరావతి: కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని కరకట్టపై అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చి వేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు, చెరువులు, నీటి కుంటలు, ఇతర నీటి వనరులు, శ్మశానాలు తదితరాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను కూడా కూల్చి వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. 30–40 సంవత్సరాల క్రితమే భూములను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను సైతం తొలగించాలంది. తమకు ఎవరైనా ఒక్కటేనని, ఈ విషయంలో నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, నీటి వనరులు తదితరాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల సంగతి తేలుస్తామన్న హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్గా మలిచిన విషయం తెలిసిందే. ఈ తరహా ఆక్రమణలన్నింటిపై దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ ఈ సుమోటో పిల్కు జత చేసిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం.. వీటిపై మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆక్రమించుకుని కరకట్ట వద్ద నిర్మాణాలు చేపట్టారని, వాటికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ నిర్మాణాల సంగతి కూడా చూస్తామని, తమకు ఎవరైనా ఒకటేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ) పోతిరెడ్డి సుభాష్ రెడ్డి స్పందిస్తూ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని 30–40 ఏళ్ల క్రితమే చేపట్టిన నిర్మాణాల సంగతి ఏమిటని అడిగారు. అలాంటి నిర్మాణాలను సైతం కూల్చి వేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని వ్యాజ్యాల్లో ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేస్తామంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించాల్సిందేనని, ప్రభుత్వం తీసుకొచ్చిన క్రమబద్దీకరణ పథకం ద్వారా క్రమబద్దీకరణ చేసుకున్న వారు మినహా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న మిగిలిన వారంతా ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ సమయంలో న్యాయవాది యలమంజుల బాలాజీ జోక్యం చేసుకుంటూ, వినుకొండలో మునిసిపాలిటీయే డిగ్రీ కాలేజీ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదిని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ..ఇలా కుమ్మక్కవుతారు తామిచ్చిన ఆదేశాల ప్రకారం ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు మొదలు పెట్టగానే, కొందరు హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేస్తారని, తామిచ్చిన ఉత్తర్వుల సంగతి సింగిల్ జడ్జికి చెప్పకుండా స్టే ఉత్తర్వులు పొందుతారని ధర్మాసనం తెలిపింది. అధికారులు సైతం తమ ఉత్తర్వుల సంగతిని సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురారని, ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల సంగతి తెలియని సింగిల్ జడ్జి.. పిటిషనర్లకు అనుకూలంగా స్టే ఉత్తర్వులు ఇస్తారని వివరించింది. ఇలా పిటిషనర్లు, రెవిన్యూ అధికారులు కలిసి కుమ్మక్కవుతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ఆక్రమించుకోమని చెప్పిందా? గ్రామ కంఠం భూములను ఆక్రమించుకుని 30–40 ఏళ్ల క్రితమే నిర్మాణాలు చేపట్టారని, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇస్తే అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా ఆ నిర్మాణాలను కూల్చేస్తారని న్యాయవాది విద్యావతి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కూల్చి వేతలకు ముందు అధికారులు తప్పక వాదనలు వినిపించుకునే అవకాశం ఇస్తారని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తమ జీవనాధారాన్ని కూడా చూడాలని, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును పరిగణనలోకి తీసుకోవాలని విద్యావతి కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజ్యాంగం ప్రభుత్వ భూములను ఆక్రమించుకోమని చెప్పిందా? అని ప్రశ్నించింది. రెవిన్యూ అధికారుల వల్లే ఆ పరిస్థితి ప్రభుత్వ న్యాయవాది సుభాష్ స్పందిస్తూ.. దాదాపు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో రెవిన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని తెలిపింది. రెవిన్యూ అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని స్పష్టం చేసింది. ఈ సమయంలో ఓ న్యాయవాది స్పందిస్తూ, గుంటూరులో శ్మశాన వాటికను ఆక్రమించుకుని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. శ్మశానంలో షాపింగ్ కాంప్లెక్సా అంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కాగా, వివిధ రకాల ఆక్రమణలపై దాఖలైన 55 పిటిషన్లకు సంబంధించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా వ్యాజ్యాలను ప్రభుత్వ భూముల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, శ్మశానాల ఆక్రమణ, తదితర అంశాల వారీగా ధర్మాసనం విభజించింది. వీటిపై తదుపరి విచారణ నిమిత్తం కొన్నింటిని బుధవారం, మరి కొన్నింటిని గురువారానికి, ఇంకొన్నింటిని సోమవారానికి వాయిదా వేసింది. -
బడి భూమిలో పాగా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని సైతం వదలడం లేదు అక్రమార్కులు. దర్జాగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఏకంగా పాఠశాల ప్రాంగణం వరుసగా రెండుసార్లు ఆక్రమణకు గురై నిర్మాణాలు వెలుస్తున్నా... తాత్కాలిక అడ్డగింపు తప్ప శాశ్వత పరిష్కారానికి చొరవ కనిపించడం లేదు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల భూములు మాయమవుతున్నా ఇటు విద్యా శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. చెరలో శంకేశ్వర పాఠశాల ప్రాంగణం.. హైదరాబాద్ జిల్లాలో సుమారు 690 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 25 శాతం మినహా మిగిలిన పాఠశాలకు సొంత స్థలాల్లో భవనాలు ఉన్నాయి. వాటికి ప్రాంగణాలు కూడా ఉన్నాయి. పాఠశాలలకు ఆనుకొని ఉన్న స్థల యజమానులు ప్రాంగణాలను ఆక్రమించుకోవడం, అడ్డుకుంటే కోర్టుకు వెళ్లడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇదే పరిస్థితిని తలపిస్తోంది సైదాబాద్లోని శంకేశ్వర బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలకు కేటాయించిన స్థలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతుండటంతో ఆటలకు అనువుగా ఉండేందుకు సుమారు 250 చదరపు గజాల స్థలాన్ని పాఠశాల ప్రాంగణంగా వదిలి మిగతా స్థలంలోని భవన సముదాయంలో పాఠశాల తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. పదేళ్ల క్రితం పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలం యజమాని ప్రాంగణంలోని వంద గజాల స్థలాన్ని అక్రమించి తన ఇంటికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అప్పట్లో విద్యా, రెవెన్యూ అధికారుల దృష్టికి కొందరు స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతోనే మిన్నకుండిపోయారు. దీంతో మిగిలిన 150 చదరపు గజాల స్ధలం రక్షించుకునేందుకు అప్పటి సైదాబాద్ కార్పొరేటర్ ప్రత్యేక చొరవ చూపించి పాఠశాల ప్రాంగణం రోడ్డు మార్గాన్ని మూసివేసి స్కూల్ ముందు మార్గంలో గేటు పెట్టించారు. మిగిలిన ప్రాంగణం కూడా మూడేళ్ల క్రితం పాఠశాల ప్రాంగణానికి చెందిన మిగిలిన 150 చదరపు గజాల స్థలంపై కొందరి కన్ను పడింది. ఏకంగా ప్రాంగంణంలోని రెండు భారీ వృక్షాలను తొలగించి సామాజిక భవన్ పేరుతో నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పాఠశాల ప్రాంగణం పూర్తిగా కనుమరుగైంది. క్షేత్రస్థాయి సందర్శనకే పరిమితం మూడేళ్లుగా పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై సంబంధిత అధికారుల క్షేత్ర స్థాయి సందర్శనకే పరిమితమైంది. శాశ్వత పరిష్కారం కోసం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ తదితరులు పాఠశాలను సందర్శించడం, ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించడం తిరిగి వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారింది. తాజాగా కొందరు అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై కింద పాఠశాల కోసం సెల్లార్, పైన సామాజిక వర్గం భవనం కొనసాగేలా సంధిమార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మన బస్తీ– మన బడి కార్యక్రమం కింద పాఠశాల ప్రాంగణం మార్గానికి ప్రహరీ పనులు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై హైదరాబాద్ డీఈఓను ఫోన్లో వివరణ కోరేందుకు సంప్రదించగా ఆమె నుంచి స్పందన రాలేదు. (చదవండి: పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు అందుకుంటున్న పిల్లి...ఎందుకో తెలుసా!) -
ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పలు అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టతనిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ముందే సబ్ డివిజన్ తప్పనిసరి మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న వారు దానికి ముందే సర్వే నెంబర్ను సబ్ డివిజన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తై రికార్డుల్లో సర్వే నెంబర్లు, పేర్లన్నీ ఆ ప్రకారం ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాతే మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తహశీల్దార్లకు సూచించారు. పాస్బుక్ల జారీ కూడా మ్యుటేషన్ సమయంలోనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మ్యుటేషన్తోపాటు పాస్బుక్ కోసం దరఖాస్తు స్వీకరించి రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై.. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యుటేషన్ చేయరాదని సూచించారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అది కూడా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తహశీల్దార్లకు ఉన్న ఈ అధికారాన్ని జేసీలకు బదలాయించారు. వారసత్వ వివాదాలకు సంబంధించి మ్యుటేషన్ల విషయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ను తహశీల్దార్ అదే సమయంలో ఇవ్వాలని నిర్దేశించారు. మ్యుటేషన్ చేసుకునే సమయంలోనే ఫ్యామిలీ సర్టిఫికెట్ను దరఖాస్తుదారుడు ఇచ్చినప్పుడు మళ్లీ ఆ కుటుంబం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చుక్కల భూములు, అసైన్డ్ మ్యుటేషన్పై స్పష్టత చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి 12 సంవత్సరాలు దాటి సంబంధిత భూములు దరఖాస్తు చేసుకున్న వారి స్వాధీనంలోనే ఉన్నట్లు రికార్డుల ప్రకారం నిర్థారణ అయితే వాటికి మ్యుటేషన్ చేయవచ్చని సూచించారు. తీర్పులు వెలువడిన కేసులు, కోర్టు ద్వారా వేలం పాట నిర్వహించిన ఆస్తులను కొనుగోలు చేసిన వారికి వెంటనే యాజమాన్య హక్కులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసైన్డ్ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వ్యక్తులే మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకుంటే చేయాలని, మూడో వ్యక్తి ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరించాలని స్పష్టం చేశారు. భూముల రీ సర్వే పూర్తయిన చోట సర్వే పూర్తయినట్లు జారీ చేసే 13 నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే అప్పటివరకు ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్దేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులను చిన్న కారణాలతో తిరస్కరించకూడదని, ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు చూపాలని, ఇంకా ఏ డాక్యుమెంట్లు కావాలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. మ్యుటేషన్ కోసం వచ్చే దరఖాస్తుల్లో 45 శాతం తిరస్కారానికి గురవుతుండడంతో పలు అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019