breaking news
-
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
Padma Awards 2024: అసామాన్య పద్మశ్రీలు
స్త్రీలు జీవానికి జన్మనివ్వడమే కాదు.. జీవాన్ని కాపాడతారు కూడా! ఈసారి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీలలో కొందరు అసామాన్యమైన స్త్రీలు తమ జీవితాన్ని కళ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కలు వీటన్నిటిలోని జీవాన్ని కాపాడుకుంటూ రావడం కనిపిస్తుంది. ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పర్బతి బారువా... లక్షలాది మొక్కలు నాటి ఆకుపచ్చదనం నింపిన చామి ముర్ము... విస్మరణకు గురైన ఔషధ మూలికలకు పూర్వ వైభవాన్ని తెచ్చిన యానుంగ్... కొబ్బరి తోటలు తీయటి కాయలు కాచేలా చేస్తున్న అండమాన్ చెల్లమ్మాళ్... గోద్నా చిత్రకళకు చిరాయువు పోసిన శాంతిదేవి పాశ్వాన్... వీరందరినీ పద్మశ్రీ వరించి తన గౌరవం తాను పెంచుకుంది. ఏనుగుల రాణి భారతదేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆమె పరిచయం. ఇది సంతోషించదగ్గ విషయం. అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కడైనా అటవీ ఏనుగులు అదుపు తప్పి, తల తిక్కగా వ్యవహరిస్తూ ఉంటే పర్బతి బారువాకు పిలుపు వచ్చేది... వచ్చి వాటిని కాస్త పట్టుకోమని, మాలిమి చేయమని. ఇన్నేళ్లకు 69 ఏళ్ల వయసులో ఈ ‘ఏనుగుల రాణి’కి, ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన రుషికి భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ‘ స్వీకరించమని పిలుపు వచ్చింది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రమాదస్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణకు, వాటిని ఎలా కనిపెట్టుకోవాలో తెలిపే జ్ఞానాన్ని సముపార్జించి పంచినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇవ్వడం సంతోషించాల్సిన సంగతి. కళ్లు తెరవగానే ఏనుగు ‘నాకు ఊహ తెలిసిన వెంటనే నా కళ్ల ఎదురుగా ఏనుగు ఉంది’ అంటుంది పర్బతి. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన గౌరిపూర్ సంస్థానం పర్బతి కుటుంబీకులది. పర్బతి తండ్రి రాజా ప్రతాప్ చంద్ర బారువా సంస్థానం మీద వచ్చే పరిహారంతో దర్జాగా జీవిస్తూ 40 ఏనుగులను సాకేవాడు. అంతేకాదు అతనికి ఏనుగులతో చాలా గొప్ప, అసామాన్యమైన అండర్స్టాండింగ్ ఉండేది. వాటి ప్రతి కదలికకూ అతనికి అర్థం తెలుసు. మహల్లో ఉండటం కన్నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని అడవుల్లో నెలల తరబడి ఉండటానికి ఇష్టపడే రాజా ప్రతాప్ తన తొమ్మిది మంది సంతానంలో ఒకతైన పర్బతికి ఏనుగుల మర్మాన్ని తెలియచేశాడు. 9 ఏళ్ల వయసు నుంచే పర్బతి ఏనుగులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల వయసులో మొదటిసారి అటవీ ఏనుగును పట్టి బంధించగలిగింది. అది చూసి తండ్రి మెచ్చుకున్నాడు. కష్టకాలంలో ఏనుగే తోడు 1970లో భారత ప్రభుత్వం (విలీనం చేసుకున్న) సంస్థానాలకిచ్చే భరణాన్ని ఆపేయడంతో పర్బతి తండ్రి పరిస్థితి కష్టాల్లో పడింది. రాబడి లేకపోవడంతో ఏనుగులే అతని రాబడికి ఆధారం అయ్యాయి. ఏనుగులను అమ్మి, టింబర్ డిపోలకు అద్దెకిచ్చి జీవనం సాగించాడు. ఆ సమయంలో పర్బతి ఏనుగుల గురించి మరింత తెలుసుకుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగు కళ్లను చూసి దాని మనసులో ఏముందో చెప్పే స్థితికి పర్బతి చేరుకుంది. ఏనుగుల ప్రవర్తనకు సంబంధించిన ఆమె ఒక సజీవ ఎన్సైక్లోపిడియాగా మారింది. క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీబీసీ వారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ పేరుతో పర్బతి మీద డాక్యుమెంటరీ తీయడంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఉదయం నాలుగున్నరకే లేచి ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యే పర్బతి దినచర్యను చూసి సలాం చేయాల్సిందే. ‘ఏనుగును మాలిమి చేసుకోవాలంటే ముందు దాని నమ్మకం, గౌరవం పొందాలి. లేకుంటే ఏనుగులు మావటీలను చంపేస్తాయి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక ఏనుగు తనను ఇబ్బంది పెడుతున్న మావటిని అతను నిద్రపోతున్నప్పుడు వెతికి మరీ చంపింది’ అంటుంది పర్బతి. కాని నమ్మకం పొందితే ఏనుగుకు మించి గొప్ప స్నేహితుడు లేదని అంటుంది. ‘ఒకో ఏనుగు రోజుకు 250 కిలోల పచ్చగడ్డి తింటుంది. దానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే ఆరోగ్యం కుదుటపడుతుందో ఆ మొక్కను వెతికి తింటుంది. అది తినే మొక్కను బట్టి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం చేయించాలి’ అంటుందామె. ‘ఎవరికైనా విశ్రాంతి ఉంటుంది కాని మావటికి కాదు. మావటి పని డ్రైవర్ ఉద్యోగం కాదు. కారు గ్యారేజ్లో పెట్టడానికి. జీవంతో నిండిన ఏనుగుకు మావటి అనుక్షణం తోడు ఉండాలి’ అంటుందామె. అస్సాం అటవీశాఖలో ‘చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్’గా పని చేసిన ఆమె ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం పని చేస్తోంది. నారియల్ అమ్మ దక్షిణ అండమాన్లోని రంగచాంగ్కు చెందిన 67 ఏళ్ల కామాచీ చెల్లమ్మాళ్ సేంద్రియ కొబ్బరి తోటల పెంపకంలో చేసిన విశేష కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. దక్షిణ అండమాన్లో ‘నారియల్ అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం తరువాత నేలలో తేమను సంరక్షించడానికి కొబ్బరి ఆకులు, పొట్టు మొదలైన వాటితో సేంద్రియ ఎరువు తయారుచేసింది. ‘నాకు పద్మశ్రీ ప్రకటించారు అని ఎవరో చెబితే నేను నమ్మలేదు. అయోమయానికి గురయ్యాను. అండమాన్లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే నాకు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ ఎందుకు ప్రకటిస్తారు అనుకున్నాను. ఆ తరువాత నేను విన్న వార్త నిజమే అని తెలుసుకున్నాను’ అంటున్న చెల్లమ్మళ్ ఆగ్రో–టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. తమ ప్రాంతంలోని రకరకాల పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపకం...మొదలైనవి ఆగ్రో–టూరిజానికి ఊతం ఇస్తాయి అని చెబుతుంది చెల్లమ్మాళ్. అవమానాలను అధిగమించి గోద్నా చిత్రకళలో చేసిన విశేష కృషికి బిహార్లోని మధుబని జిల్లా లహేరిఆగంజ్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి పాశ్వాన్ ఆమె భర్త శివన్ పాశ్వాన్లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గోద్నా చిత్రకళ ద్వారా ఈ దంపతులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా నుంచి జపాన్ వరకు వీరి చిత్రాలను ప్రదర్శించారు. తన కులం కారణంగా ఎన్నో అవమానాలకు గురైన శాంతిదేవి, వాటిని అధిగమించి జీ20 సదస్సులో పాల్గొనే స్థాయి వరకు ఎదిగింది. శాంతిదేవి, శివన్ పాశ్వన్ దంపతులు ఇరవైవేల మందికి పైగా గోద్నా చిత్రకళలో శిక్షణ ఇచ్చారు. ఆది రాణి అరుణాచల్ప్రదేశ్కు చెందిన యానుంగ్ జమెహ్ లెగో ఆది తెగ సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. అరుణాచల్ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన 58 సంవత్సరాల యానుంగ్ను అభిమానులు ‘ఆది రాణి’ అని పిలుచుకుంటారు. లక్షమందికి పైగా ఔషధమూలికలపై అవగాహన కలిగించించిన యానుంగ్ ఏటా 5,000 ఔషధ మొక్కలను నాటుతుంది. ప్రతి ఇంటిలో హెర్బల్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తోంది. ఆర్థికపరిమితులు ఉన్నప్పటికీ విస్మరణకు గురైన ఆది తెగ సంప్రదాయ వైద్య వ్యవస్థను, సాంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేసింది యానుంగ్. మొక్కవోని ఆత్మస్థైర్యం ‘మొక్కలు నాటడానికి నువ్వు ఏమైనా కలెక్టర్ వా!’ అని ఊరి మగవాళ్లు చామిని వెక్కిరించేవాళ్లు. మొక్కలు నాటడం అనే పుణ్యకార్యం వల్ల ఉత్త పుణ్యానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన చామి కూలి పనులు చేసుకుంటూనే 36 ఏళ్ల రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఝార్ఖండ్కు చెందిన చామి ముర్ము ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది.... తన గ్రామం భుర్సాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సమావేశానికి హాజరు కావడం ద్వారా పర్యావరణ కార్యకర్తగా చామీ ముర్ము ప్రయాణం ప్రారంభమైంది. ‘మా ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములు కనిపించేవి. బాధగా అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. అయితే మొక్కలు నాటడం మా ఊరిలోని మగవాళ్లకు నచ్చలేదు. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవల వల్ల సోదరుడి ఇంటికి వెళ్లాను. అతడితో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఒకవైపు జీవనోపాధిపై దృష్టి పెడుతూనే మరోవైపు ప్రకృతికి మేలు కలిగించే పనులు చేయడం ప్రారంభించాను’ అంటుంది చామీ ముర్ము. పదో తరగతి వరకు చదువుకున్న చామి మొక్కలు నాటడం, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నందుకు కొంతమందికి అకారణంగా శత్రువు అయింది. 1996లో చామి నాటిన మొక్కలను ధ్వంసం చేశారు కొందరు. ‘ఇక ఆపేద్దాం. ఎందుకు లేనిపోని గొడవలు’ అని కొందరు మహిళలు చామిని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే చామి మాత్రం ఆనాటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉత్సాహం ముందు ప్రతికూలశక్తులు తోకముడిచాయి. ‘నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. నేను నాటిన 28 లక్షలకుపైగా మొక్కలు నా బంధువులే’ అంటుంది చామి. ఝార్ఖండ్లోని వెనబడిన జిల్లా అయిన సరైకెలా ఖరావాన్లో రైతులు వ్యవసాయం కోసం వర్షంపై ఆధారపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి అవసరాల కోసం వాటర్షెడ్లను నిర్మించడానికి చామి కృషి చేస్తోంది. 2,800 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా, సొంత వ్యాపారం ప్రారంభించేలా చేసింది. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ స్పృహతో మొదలైన నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది చామి. ఒంటరిగా అడుగులు మొదలు పెట్టినప్పటికీ అంకితభావం కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల ప్రభావం చూపించగలరు అని చెప్పడానికి చామీ ముర్ము ప్రయాణం బలమైన ఉదాహరణ. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చామీ ముర్ము పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. టింబర్ మాఫియాపై పోరాడిన చామీ ముర్మును ‘లేడీ టార్జన్ ఆఫ్ ఝార్ఖండ్’ అని అభిమానులు పిలుచుకుంటారు. -
క్రీడారంగంలో పద్మ పురస్కారాలు వీరికే..
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రద్మ పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ ఏడాది క్రీడారంగం నుంచి మొత్తం ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వెటరన్ టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్, పూర్ణిమా మహతో (ఆర్చరీ), సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్పాండేలను (మల్లఖంబ-కోచ్) పద్మశ్రీ అవార్డులు వరించాయి. -
తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు!
Foxconn CEO Young Liu: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ సీఈఓ 'యంగ్ లియు' (Young Liu) ను కూడా పద్మభూషణ్ వరించింది. 66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) చైర్మన్ 'యంగ్ లియు' నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లియుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. యంగ్ లియు స్థాపించిన మూడు కంపెనీలలో యంగ్ మైక్రో సిస్టమ్స్ అని పిలువబడే మదర్బోర్డ్ కంపెనీ (1988), నార్త్బ్రిడ్జ్ అండ్ సౌత్బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ (1995), ఐటీఈ టెక్ అండ్ ఏడీఎస్ఎల్ ఐసీ డిజైన్ కంపెనీ (1997) ఉన్నాయి. తైవాన్కు చెందిన యంగ్ లియు 1978లో తైవాన్లోని నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. భారతదేశంలో ఫాక్స్కాన్ ఉనికి భారతదేశంలో.. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు, వెంచర్లతో తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్కాన్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమిళనాడులో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 40000 మంది పనిచేస్తున్నారు. ఫాక్స్కాన్ సంస్థ బెంగళూరు శివార్లలో యూనిట్ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కోసం 1.6 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని విస్తృతం చేయబోతున్నట్లు ఫాక్స్కాన్ సీనియర్ అధికారి గత సంవత్సరం తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఫాక్స్కాన్ దేశంలో విస్తృత సేవలను అందించనున్నట్లు సమాచారం. పద్మ అవార్డ్స్ 2024 కేంద్రం ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. విదేశీయులకు పద్మ అవార్డులు ఎందుకిస్తారంటే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డ్స్ వెబ్సైట్ ప్రకారం.. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన లేదు. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సేవలందించిన ఎవరికైనా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్, సీఎం రేవంత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్వర్క్: తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్కాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్కాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్సంగ్ హీరోస్’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. పద్మ అవార్డుల వివరాలివీ.. పద్మ విభూషణ్ (ఐదుగురికి): వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ–బిహార్), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). పద్మభూషణ్ (17 మందికి): ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్ జీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్), సీతారాం జిందాల్ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్), రాంనాయక్ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం–గుజరాత్), ఓలంచెరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూ అలియాస్ రాజ్ దత్ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్), ప్యారేలాల్ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం–బిహార్), ఉషా ఉతుప్ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్కాంత్ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) – పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. బాధ్యతను పెంచింది ‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ – ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్ పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019