breaking news
Ad - Sakshi_Home_Sticky
-
‘నోబెల్’ ఆర్థికవేత్త కన్నుమూత..
దిగ్గజ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కాహ్నెమాన్ కన్ను మూశారు. బిహేవియరల్ ఎకనామిక్స్లో క్రమశిక్షణను ఎక్కువగా ప్రభావితం చేసే సిద్ధాంతాలను రూపొందించిన కాహ్నెమాన్ 90 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు ప్రిస్టన్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికన్ విద్యావేత్త అయిన కాహ్నెమాన్ మరణించే వరకు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అత్యధికంగా అమ్ముడైన "థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో" అనే పుస్తకాన్ని రాసిన కాహ్నేమాన్, మనుషుల ప్రవర్తన హేతుబద్ధమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాతుకుపోయిందనే భావనకు వ్యతిరేకంగా వాదించారు. అది తరచుగా ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. మనస్తత్వ శాస్త్రం, ఆర్థిక శాస్త్ర రంగాలలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా కాహ్నెమాన్కు 2002లో ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతి లభించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆయన సిద్ధాంతం సాంప్రదాయ ఆర్థిక విధానాలను వ్యతిరేకించింది. మనుషులు తమ భావనలను మార్చుకునే విచక్షణను కలిగి ఉంటారని వాదించింది. -
ప్రముఖ సైకాలజిస్ట్ డేనియల్ కానమన్ కన్నుమూత
న్యూజెర్సీ: ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కానమన్ (90) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రకటించింది. 1993వ సంవత్సరం నుంచి కానమన్ అక్కడే పనిచేస్తున్నారు. ఆర్థిక శాస్త్రం చదవకపోయినా ప్రవర్తనా ఆర్థికశాస్త్రానికి ఆయన పర్యాయపదంగా మారారు. ఆయన రాసిన పుస్తకం ‘థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో’ ఎంతో ప్రజాదరణ పొందింది. డేనియల్ కానమన్ సిద్ధాంతాలు సామాజికశాస్త్రాలను చాలా మటుకు మార్చివేశాయని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్డార్ షాఫిర్ పేర్కొన్నారు. 1934లో ఇజ్రాయెల్లోని టెల్అవీవ్లో కానమన్ జన్మించారు. -
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
ఆమె కథ మన జీవిత కథ
ఆనీ ఎర్నౌ రచనలకు గానీ, శైలికి గానీ అంత ‘వాడి’ ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి ఎప్పటికప్పుడు పదును తేలుతూ ఉంటాయి! రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆమె రచనల సారం. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడి ఉన్న వాళ్ల కోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ! సాహిత్యంలో ఇప్పటివరకు పదహారు మంది నోబెల్ గ్రహీతలతో అత్యధికంగా విజేతలను కలిగి ఉన్న దేశం ఫ్రాన్స్. వారిలో ఏకైక మహిళ ఆనీ ఎర్నౌ. 2022 సంవత్సరానికి గాను ఆనీ నోబెల్ విజేతగా నిలిచారు. ఆమె కంటే ముందు 2014లో ప్యాట్రిక్ మాడియానో, 2008లో జె.ఎం.జి. క్లెజియో ఈ ఘనత సాధించారు. ఫ్రాన్స్లోని నార్మాండీలో 1940లో జన్మించిన ఆనీ ఎర్నౌ నిరాడంబరమైన కుటుంబంలో పెరిగారు. జీవిక కోసం ఆమె తల్లిదండ్రులు నిత్యావసర వస్తువులను విక్రయించే దుకా ణాన్ని నడుపుతుండేవారు. తర్వాతి కాలంలో ఆ దుకాణం బార్గా, కెఫేగా విస్తరించింది. అక్కడికంతా శ్రామిక వర్గమే వస్తుండేది. తల్లి ప్రోత్సాహం, ప్రోద్బలంతో ఆనీ యూనివర్సిటీ స్థాయి వరకు విద్యను అభ్యసించి, అనంతరం టీచరుగా మారారు. రచయిత్రిగా మారారు. వర్గ వ్యత్యాసాలు, పితృస్వామ్య వ్యవస్థ, అసమానతలు వంటి విస్తృత సామాజిక అంశాలను తన రచనల్లో చర్చించారు. ఆనీ ఎర్నౌ తొలి నవల ‘క్లీన్డ్ ఆఫ్’ (ఫ్రెంచిలో లెజ్ ఆర్మ్వార్ విడేస్) 1974లో వచ్చింది. అయితే ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం 1983లో వచ్చిన ‘ఎ మ్యాన్స్ ప్లేస్’తోనే. తల్లిదండ్రులు నడిపిన కెఫేలో తను ఎదుగుతున్నప్పటి జ్ఞాపకాలను అందులో రాసుకున్నారామె. తర్వాత 1987లో ‘ఎ ఉమన్ స్టోరీ’ అనే నవల రాశారు. అది ఆనీ తల్లి కథ. అక్కడి నుంచి అంతా రచనా ప్రవాహమే. 2008లో ‘ది ఇయర్స్’ పుస్తకం వచ్చే నాటికి కాలానుక్రమ వైయక్తిక స్మృతుల సమ్మేళనంగా అనేకానేక రచనల్ని చేశారు. ‘ది ఇయర్స్’ ఆనీ స్వీయ గాథ. ఆ నవల ఇంగ్లిష్లోకి అనువాదం కాగానే (లెజ్ అన్నీస్ అన్నది ఫ్రెంచి టైటిల్) ఆనీ పేరు సాహితీ ప్రపంచంలో మార్మోగిపోయింది. 1940లు, 90ల మధ్య కాలంలో ఒక స్త్రీ జీవితంలోని ఉత్థాన పతనాలను కథనపరచిన ఈ రచన... మూడో మనిషి చెబుతున్నట్లుగా ముందుకు సాగుతుంది. పాత ఫొటోలను, సినిమా జ్ఞాపకాలను జత పరుస్తూ బాల్యం నుంచి తల్లి అయ్యేవరకు తన జీవితాన్ని అందులో అక్షరబద్ధం చేశారు ఆనీ. 1960లలో తమ కుటుంబం ఎలా జీవించిందీ చెబుతూ, ‘‘మేమెంత సమయాన్ని పొదుపు చేశామో చూసుకుని ఆశ్చర్యపోయే వాళ్లం. సిద్ధంగా అందుబాటులో ఉండే మిరప పొడులతో మా సూప్ తయారయ్యేది. ప్రెస్టో ప్రెషర్ కుక్కర్తో త్వరత్వరగా వంట చేసే వాళ్లం. ‘యమోనైజ్’ అయితే రెడీమేడ్గా ట్యూబులలో దొరికేసేది. గుడ్డు పచ్చసొన, నూనె, నిమ్మరసం కలిపి తయారు చేసే ఈ మసాలా సాస్ను మేమెప్పుడూ సమయం వెచ్చించి సొంతంగా సిద్ధం చేసు కున్నది లేదు. బఠాణీలను తోటలోంచి తెంపుకొచ్చే పని లేకుండా క్యాన్లలో లభించేవాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకునేవాళ్లం. చెట్టుపై పండే బేరీ పండ్లను కాకుండా బేరీ పండ్ల సిరప్ను వాడేవాళ్లం. జీవితం ఎంత సరళం అయిపోయింది! అదంతా కూడా శతాబ్దాల ప్రయాసలను తుడిచిపెట్టేసే అద్భుతమైన ఆవిష్కరణల ఫలితమే. ఒకరోజు వస్తుంది.. మనమిక ఏదీ చేసుకునే పని లేకుండా’’ అని రాశారు ఆనీ. 1967 గురించి, గర్భ నిరోధక మాత్రల చట్టబద్ధత గురించి చెబుతూ– ‘‘ఆ మాత్రలు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయని మేము భావించాం. భీతిగొలిపే మా దేహాల నుంచి మాకు విముక్తి లభిస్తుం దనీ, మగవాళ్లకు ఉన్నంత స్వేచ్ఛ ఆ మాత్రలతో మాకూ వచ్చేస్తుందనీ అనుకున్నాం’’ అని రాసుకున్నారు. తన దేశ పౌరురాలికి సాహిత్యంలో నోబెల్ వచ్చిందని తెలియగానే, ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇలా ట్వీట్ చేశారు. ‘‘గత యాభై ఏళ్లుగా ఆనీ ఎర్నౌ దేశ క్రమానుగతులతో పాటు దేశంలోని ప్రజా సమూహాల చారిత్రక జ్ఞాపకాలను అక్షరీకరిస్తున్నారు’’ అని ప్రశంసించారు. ఆనీ రచనా శైలి కత్తిలా పదునైనది. ‘కత్తి పదునులా రాయడం’ పేరుతో 2003లో ఆమె ఒక వ్యాసం కూడా రాశారు. ఆమె రచనలకు గానీ, శైలికి గానీ అంత పదును ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి పదునెక్కుతాయి. రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆనీ రచనల్లోని పోరాటం కూడా. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. ఫ్రాన్స్లో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం ఉన్నకాలంలో 2000 సంవత్సరంలో ఆమె ‘హ్యాపెనింగ్’ నవల రాశారు. ఆ నవలను అదే పేరుతో ఆడ్రీ దివాన్ సినిమాగా తీశారు. గత ఏడాది విడుదలైన ఆ సినిమా 2021 వెనిస్ చలన చిత్రోత్సవంలో ‘గోల్డెన్ లయన్’ అవార్డు గెలుచుకుంది. సూపర్ మార్కెట్ సంస్కృతి దృక్కోణం నుంచి ఆనీ 2014 లో రాసిన నవల ‘రిగార్డ్లెస్ ల్యూమినరీస్’ సామాజిక అసమానతల్ని సునిశి తంగా పరిశీలించింది. ఈ ఏడాదే విడుదలైన ఆమె కొత్త పుస్తకం ‘జ్యాన్ ఓమె’ తన కన్నా 30 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి దాపరికం లేకుండా చెబుతుంది. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడిపోయిన వాళ్ల కోసం, అసమానతలపై మూగ సాక్షులుగా మిగిలిపోయిన బాధితులకోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ ఎర్నౌ. ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత మార్సెల్ ప్రూస్ట్ రచనా సంవిధానానికి ప్రూస్టియన్ స్టెయిల్ అని పేరు. కోల్పోయిన గతాన్ని పునరుద్ధరించే, అపస్మారక జ్ఞాపకశక్తిని ప్రేరేపించే గుణం కలిగి ఉండే ఆయన ధోరణే ఆనీ రచనల్లోనూ కనిపిస్తుంది. సమయం గడిచేకొద్దీ కనుమరుగైపోయే జ్ఞాపకాలను అంటి పెట్టుకుని ఉండేందుకు తన రచనను ఒక మార్గంగా ఆమె నిర్మించుకున్నారు. ‘‘ఒక్క సెకనులో అంతా తుడిచి పెట్టుకు పోతుంది. ఊయలకు, మరణశయ్యకు మధ్య పేరుకుపోయిన పదాల నిఘంటువు పక్కకు ఒరిగిపోతుంది. ఇక మిగిలింది నిశ్శబ్దం. మాటలకు పదాలు ఉండవు. ‘నేను’, ‘నాకు’ అనేవి నోటిలోంచి బయ టికి రావు. నలుగురు చేరి నవ్వుకునే వేళ తరాల విస్తారమైన అనామ కత్వంలోకి అదృశ్యం అయ్యే వరకు మనం మన పేరు తప్ప మరేమీ కాదు... మన పేరును ఎవరైనా ఒక కాగితం మీద పెట్టేవరకు’’ అని రాస్తారామె. ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త పియర్ బోర్డ్యూ ‘‘కళంకానికి గురైనవారికి జ్ఞాపకశక్తి అధికం’’ అంటారు. అవమానం జరిగిన జ్ఞాపకాలను అస్సలు మర్చిపోలేము. 1997లో ఆనీ రాసిన ‘షేమ్’ పుస్తకంలోని కథాంశం ఇదే. భారతీయ దళిత రచయితలు రాసిన కొన్ని పుస్తకాలను కూడా ఆమె చదివారు. ఓం ప్రకాశ్ వాల్మీకి రాసిన ‘జూఠన్ : యాన్ అన్టచబుల్ లైఫ్’ వాటిలో ఒకటి. ఇటీవలే ఈ పుస్తకం ఫ్రెంచిలోకి తర్జమా అయింది. అదొక ప్రామాణికమైన అత్మకథ. ముల్క్ రాజ్ అనంద్ రచనలు కూడా ఆమెకు సుపరిచితమే. మరికొన్ని నెలల్లో ఢిల్లీలో వరల్డ్ బుక్ ఫెయిర్ జరగబోతోంది. ఆనీ ఎర్నౌ నోబెల్ గెలుచుకున్న సందర్భం ఒక్కటే కాదు... ఇండియా గౌరవ అతిథిగా ఫ్రాన్స్ ఆ పుస్తక ప్రదర్శనకు వస్తుండటం, 20 కంటే ఎక్కువ మంది ఫ్రెంచి రచయితల బృందం హాజరవుతుండటం కూడా బుక్ ఫెయిర్కు మరింత ప్రాధ్యాన్యం తెచ్చింది. ‘పి.ఎ.పి. (పబ్లికేషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్) టాగోర్’ పేరుతో ఇండియా, రొమెయిన్ రోలాండ్ అవార్డ్’ (అపీజే ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్స్ భాగస్వామ్యంతో ఉత్తమ అనువాదానికి ప్రదానం చేసే అవార్డు)తో ఫ్రాన్స్ ఈ పుస్తక ప్రదర్శనలో ఇచ్చుకోబోయే పరస్పర ప్రచురణ సహకారంతో మరిన్ని ఫ్రెంచి పుస్తకాలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యే అవకాశం కలుగుతుందని మనం ఆశించవచ్చు. యాదృచ్ఛికమే అయినా ఇక్కడ ఒక విశేషాన్ని గమనించాలి. టాగోర్ (1913), రొమెయిన్ రోలాండ్ (1915) ఇద్దరూ సాహిత్యంలో నోబెల్ గ్రహీతలే. ఎమ్మాన్యుయేల్ లెనెయిన్ వ్యాసకర్త ఇండియాకు ఫ్రాన్స్ రాయబారి (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
ఒంటరి సమూహం
సుమారు ఆరు దశాబ్దాలుగా అలుపెరగకుండా రాస్తున్న ‘అత్యంత ప్రాధాన్యం గల స్త్రీవాద రచయిత్రి’ ఆనీ ఎర్నౌను 2022 నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఈ గౌరవం దక్కిన తొలి ఫ్రెంచ్ మహిళ ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారం పొందిన పదిహేడో మహిళ. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; అయినా కూడా మహిళలు, అణిచివేతకు గురైనవారి పోరాట గాథలను సజీవంగా ఉంచుతున్నానంటారు 82 ఏళ్ల ఆనీ ఎర్నౌ. శరీరం, లైంగికత; సాన్నిహిత్య సంబంధాలు; సామాజిక అసమానతలు; చదువు ద్వారా వర్గాన్ని మార్చుకునే ప్రయత్నం ఆమె రచనల్లో కనబడతాయి. ఫ్రాన్స్లోని చిన్న పట్టణం నార్మండీలో వారి కుటుంబం నివసించింది. బతకడానికి నాకు పుస్తకాలు అక్కర్లేదని కరాఖండీగా చెప్పే తండ్రిని కలిగిన అతి సాధారణ నేపథ్యం. ఒక కెఫే యజమానిగా అలెగ్జాండర్ డ్యూమా, ఫ్లాబర్ట్, ఆల్బర్ట్ కామూ లాంటి రచయితలను చదవడం వల్ల తనకేం ఒరుగుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ ఆనీలో అది పూర్తి విరుద్ధంగా పనిచేసింది. పుస్తకాలు మాత్రమే తనకు అత్యంత ప్రీతికరమైనవనీ, ఎంత చెడ్డ జీవితంలోనూ తనను తాను ఒక ‘అ–పాఠకురాలిగా’ ఊహించలేననీ అంటారామె. ఆరేళ్ల వయసు నుంచే అక్షరంలోని గమ్మత్తుకు ఆకర్షితురాలయ్యారు. వందలాది పుస్తకాలను ఉచితంగా చదువుకోవడం కోసమే పుస్తకాల షాపులో పనిచేయాలని కలగన్నారు. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టి, బుద్ధెరిగాక మధ్యతరగతి జీవితాలతో పోల్చుకున్నప్పుడు తమ పరిస్థితి పట్ల సిగ్గుపడిన ఆనీ ఎర్నౌ చదువుకోవడం ద్వారా జీవితాలను మార్చుకోగలమన్న అభిప్రాయానికి చాలా త్వరగా వచ్చారు. దానికి అనుగుణంగానే ముందు టీచర్గా, అనంతరం లిటరేచర్ ప్రొఫెసర్గా పనిచేశారు. వర్జీనియా వూల్ఫ్ అంటే ఆనీకి పిచ్చి అభిమానం. సైమన్ ది బోవా ఆమె చైతన్యాన్ని విస్తృతపరిచారు. స్త్రీవాదం అనేది తప్పనిసరైనది అన్న అవగాహనతో ఇరవై ఏళ్ల వయసు నుంచే తన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తన కుటుంబానికి తెలియకుండా చేయించుకున్న అవాంఛిత గర్భస్రావం గురించి ‘క్లీన్డ్ ఔట్’ రాశారు. ఆ అనుభవంలోని జుగుప్స, భయానకాలకు వెరవకుండా, దీన్నే పునర్దర్శనంలాగా ‘హ్యాపెనింగ్’ రాశారు. ఒక స్త్రీ తన శరీరం మీద తన నియంత్రణనూ, స్వాతంత్య్రాన్నీ స్థాపించుకోవడానికి సంబంధించిన అతిముఖ్యమైన నవలగా ఇది నిలిచిపోయింది. తను దాటివచ్చిన జీవిత దశలనే ఆనీ పుస్తకాలుగా మలిచారు. ఆమె కౌమార జీవితం ఒక పుస్తకం. వైవాహిక జీవితం ఒక పుస్తకం. తూర్పు యూరోపియన్ మనిషితో ప్రేమ వ్యవహారం(ప్యాషన్ సింపుల్) ఇంకో పుస్తకం. తల్లి మరణం ఒక పుస్తకం. బ్రెస్ట్ క్యాన్సర్ అనుభవాలు మరో పుస్తకం. ఫ్రాన్స్ చరిత్రతో ముడిపడిన ‘ది ఇయర్స్’ను ఆమె మ్యాగ్నమ్ ఓపస్గా పరిగణిస్తారు. ఉత్తమ పురుష(నేను) కథనాలకు భిన్నంగా దీన్ని థర్డ్ పెర్సన్లో రాశారు. ఏ వ్యక్తిగత అనుభవమో ‘పొరపాటున’ సాహిత్యంలోకి వస్తే– దానికీ, తనకూ ఏ సంబంధమూ లేదని ఒక డిస్క్లెయిమర్ లాంటిది ఆ రచయిత తగిలించడం కొత్త సంగతేం కాదు. మరీ ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, సన్నిహిత మానవ సంబంధాలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువ. ఇక వ్యక్తిగతం అన్నదే కొందరికి నిషిద్ధాక్షరి. వ్యక్తి నుంచి కూడా సమాజాన్ని దర్శించవచ్చునన్న అవగాహన ఉన్నవాళ్లు తక్కువ. కానీ ఆనీ ఎర్నౌ సాహిత్య సర్వస్వం ఆత్మకథాత్మకమే. ఇది కల్పన అని చెబితే రచయితకో రక్షణ కవచం ఉంటుందన్న ఆలోచన ఆమెకు లేక కాదు. కానీ అది మోసం చేయడంలా భావించారు. వ్యక్తిగత జీవితాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షించుకున్నంత కచ్చితత్వంతో తన అనుభవాలను నమోదు చేశారు. అందువల్లే ఆమె ‘గ్రేట్ ట్రూత్ టెల్లర్ ఆఫ్ ఫ్రాన్స్’గా నిలవగలిగారు. నార్మండీ లాంటి చిన్నపట్టణంలో తన జీవితాన్నీ, తండ్రితో తన సంబంధాన్నీ ‘ఎ మ్యాన్స్ ప్లేస్’గా రాస్తున్నప్పుడు తన రచనాపద్ధతిని గురించి ఆమె ఘర్షణపడ్డారు. తండ్రిని ఒక కాల్పనిక పాత్రగా మలవడంలో తన రచనా ఉద్దేశమే నెరవేరదని భావించారు. అందుకే ఉన్నది ఉన్నట్టే రాయడానికి సంకల్పించారు. అందుకే ఆమెను ఫిక్షన్ రచయిత అనాలా, నాన్–ఫిక్షన్ రచయిత అనాలా అన్న చర్చకూడా వచ్చింది. కొందరు ఆమెను ‘మెమొయిరిస్ట్’ (జ్ఞాపకాల రచయిత) అన్నారు. నవలగా, ఆత్మకథగా కాకుండా తన రచనలను ఆటోసోషియోబయోగ్రాఫికల్(సామాజిక ఆత్మకథ)గా మలవగలగడం ఆమె ప్రత్యేకత. చరిత్ర, ఆత్మకథల కలగలుపు ఆమె పద్ధతి. ఇంట్లో పుస్తకాలను చూసి, ఇవన్నీ చదువుతావా అని ఆశ్చర్యపోయిన తన కజిన్, పుస్తకాలతో మనుషులకేం పని అన్నట్టుగా బతికిన తన తండ్రిలాంటివాళ్లు నిజానికి తనకు ఎక్కువ స్ఫూర్తి కలిగించారని చెప్పే ఆనీ... మర్చిపోయి అంతర్ధానమయ్యే లోపల జ్ఞాపకాలను పదిలపరుస్తున్నానంటారు. ఫ్రాన్స్ ఉమ్మడి జ్ఞాపకాలను ఆమె తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అనువాదాల ద్వారా అవి ప్రపంచ స్మృతులుగా కూడా మారాయి. తన ప్రపంచంగా అనిపించని పారిస్ విలాసాలకు దూరంగా ప్రకృతి, నిశ్శబ్దాల కోసం సబర్బన్ ప్రాంతంలో నివసించే ఆనీ ఎర్నౌ... ఒక దశలో ‘మహిళా విప్లవం’ చూడకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డానంటారు. కానీ అబార్షన్ హక్కులు రావడానికీ, స్త్రీ శరీరం మీద మారుతున్న పురుష ప్రపంచ ధోరణికీ ఆమె కూడా ఒక కారణం అయ్యారు. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; కానీ ప్రయోజనం లేకుండా మాత్రం ఉండదు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019